టార్గెట్ గ్రూప్స్
ఎక్కువ పోస్టులుండడంతో పెరిగిన పోటీతత్వం
కోచింగ్ సెంటర్లకు అభ్యర్థుల పయనం
శిక్షణ కోసం ఇతర జిల్లాల నుంచి ఫ్యాకల్టీలు
టైం టేబుల్ ప్రిపేర్ చేసుకుంటే కొలువు మీదేనని సీనియర్ల సూచన
ఉద్యోగార్థులతో సందడిగా కిషన్పుర, నయీంనగర్
సీఎం కేసీఆర్ ఉద్యోగ ప్రకటనతో అభ్యర్థుల్లో ఉత్సాహం వచ్చింది. వేలాది పోస్టులు భర్తీ కానుండడంతో అందరి దృష్టి గ్రూప్స్ నోటిఫికేషన్పై పడింది. ఎప్పటినుంచో ఆశగా ఎదురుచూస్తున్న వారికి మంచి అవకాశం దక్కగా, ఎప్పుడూ లేనన్ని పోస్టులు ఉండడంతో పోటీతత్వం కూడా పెరిగింది. అందుకే ఈసారి ఎలాగైనా జాబ్ కొట్టాలనే లక్ష్యంతో కోచింగ్ సెంటర్ల వైపు పరుగులు పెడుతుండగా వారి కోసం నిర్వాహకులు హైదరాబాద్, గుంటూరు, నుంచి ఎక్స్పర్ట్ ఫ్యాకల్టీలనూ తీసుకొస్తున్నారు. అంతేగాక కొన్ని సెంటర్లు మాక్ టెస్టులతో పాటు క్లూస్ ఇస్తామని ఆఫర్ చేస్తూ అభ్యర్థులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుండగా.. టైం టేబుల్ ప్రిపేర్ చేసుకుంటే కొలువు మీదేనంటూ సీనియర్ ఫ్యాకల్టీలు సూచన చేస్తున్నారు. దీంతో ఇంట్లో, లైబ్రరీల్లో, కోచింగ్ సెంటర్లలో ప్రిపరేషన్లో నిమగ్నమైన ఉద్యోగార్థులు మరింత పట్టుదలతో బరిలో దిగారు.
హనుమకొండ చౌరస్తా, మార్చి 30 :గ్రూప్స్లో అత్యధికంగా పోస్టులు ఉండడంతో అభ్యర్థులు లక్ష్యంపై గురిపెట్టారు. జూనియర్ అసిస్టెంట్ జిల్లాస్థాయి పోస్టులు కావడంతో ఎక్కువమంది వాటిపై దృష్టి కేంద్రీకరిస్తున్నారు. ఆ తర్వాత ఎక్కువ మంది నిరుద్యోగులు అత్యధిక పోస్టులున్న గ్రూప్-4 కోచింగ్ తీసుకునేందుకు ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది. పలు కోచింగ్ సెంటర్లలో గ్రూప్స్పై శిక్షణ తీసుకుంటున్నారు. కొంతమంది ఆర్నెళ్ల క్రితమే కోచింగ్కు ఫీజు చెల్లించి శిక్షణ తీసుకోవడం విశేషం.
గ్రూప్స్.. లోకల్ కేడర్ వారీగా..
గ్రూప్-1 నుంచి గ్రూప్-4 వరకు భర్తీ చేయనున్న ఖాళీలను కూడా ప్రభుత్వం ప్రకటించింది. గ్రూప్-1 కింద 503, గ్రూప్-2 (582), గ్రూప్-3 (1,373), గ్రూప్-4 ద్వారా 9,168 పోస్టుల్లో నియామకాలు చేపట్టి ఎవరి ఉద్యోగాలు వారికే వచ్చేలా కసరత్తు చేస్తోంది. అటెండర్ పోస్టు నుంచి ఆర్డీవో పోస్టులు 95 శాతం స్థానికులకే వస్తాయని, కేవలం 5శాతం మాత్రమే ఓపెన్ కోటాలోకి వెళ్తాయని, అందులోనూ కొన్ని పోస్టులు జనరల్ కింద లోకల్ వాళ్లకే దక్కుతాయని సీఎం కేసీఆర్ ప్రకటించారు. లోకల్ కేడర్వారీగా పరిశీలిస్తే జిల్లాస్థాయిలో 39,829, జోనల్లో 18,866, మల్టీ జోనల్లో 13,170, మిగిలిన విభాగాలు, యూనివర్సిటీల్లో 8,174 పోస్టులను భర్తీ చేయనున్నారు.
జిల్లాల వారీగా పోస్టుల సంఖ్య..
జిల్లాల వారీగా భర్తీ చేయనున్న పోస్టుల వివరాలను కూడా ప్రభుత్వం వెల్లడించింది. రాష్ట్రంలోని 33 జిల్లాల్లో 39,829 ఖాళీలను భర్తీ చేయనున్నారు. అందులో ఉమ్మడి జిల్లాలోని హనుమకొండ-1,157, వరంగల్-842, జయశంకర్ భూపాలపల్లి-918, ములుగు-696, జనగామ-760, మహబూబాబాద్-1,172 పోస్టులు ఉన్నాయి. ఈసారి పోటీ కూడా ఎక్కువగానే ఉండనుంది.
అటు క్యూ.. ఇటు క్లూ..
పోటీ పరీక్షల కోసం అభ్యర్థులు కుస్తీ పడుతుంటే, వారిని ఆకర్షించేందుకు కోచింగ్ సెంటర్ల నిర్వాహకులు అదేస్థాయిలో పోటీపడుతున్నారు. మాక్ టెస్ట్లు నిర్వహిస్తామని, క్లూస్ ఇస్తామంటూ అభ్యర్థులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. కొన్ని సెంటర్లు ఆసక్తి కలిగిన అభ్యర్థుల ఫోన్ నెంబర్లు సేకరించి, వారికి ఎస్ఎంఎస్లు పంపుతున్నాయి. మరికొన్ని కేంద్రాలు కరపత్రాలతో విస్తృతంగా ప్రచారం చేసుకొంటున్నాయి.
ఇప్పటి నుంచే ఓ ప్రణాళిక ఉండాలి..
రాష్ట్రం ఏర్పడిన చాలాకాలం తర్వాత అతి పెద్ద నోటిఫికేషన్లు రానున్నాయి. అందుకే గ్రూప్-1, 2, 3, 4, కానిస్టేబుల్, ఎస్సైకి ప్రిపేరయ్యే అభ్యర్థులు ఇప్పటి నుంచే పక్కా ప్రణాళికతో చదవాలి. నేను 2008 నుంచి కాంపిటీటివ్ కోచింగ్లో సీనియర్ ఫ్యాకల్టీగా చేస్తున్నా. సరైన కోచింగ్ తీసుకొని, సీరియస్గా టైం టేబుల్ ప్రిపేర్ చేసుకొని, సరైన పుస్తకాలు చదివితే జాబ్ మీదే. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని, పట్టుదలతో కృషిచేయాలి.
– మిడిసెనమెట్ల కోటేశ్వర్రావు, కరెంట్ ఎఫైర్స్
సీనియర్ ఫ్యాకల్టీ, రామప్ప అకాడమీ
ఇంగ్లిష్పై ఎక్కువ శ్రద్ధ చూపాలి..
గ్రూప్స్లో ఉద్యోగం సాధించాలంటే క్రమశిక్షణతో కూడిన ప్రణాళికతో చదివితేనే విజయం సాధించవచ్చు.. ప్రతిరోజూ న్యూస్పేపర్లు, అంతర్జాతీయ, జాతీయ, రాష్ట్రస్థాయి అంశాలపై ఎక్కువగా దృష్టి పెట్టాలి. తెలంగాణ చరిత్ర, సంస్కృతి, తెలంగాణ ఎకానమీ, ప్రణాళికలు, పథకాలపై ఎక్కువ దృష్టి సారించాలి. ముఖ్యంగా గ్రూప్-1, 2లో తెలుగుమీడియం విద్యార్థులు ఇంగ్లిష్పై ఎక్కువ శ్రద్ధ చూపాలి. సీనియర్ ఫ్యాకల్టీతో గ్రూప్స్ కోచింగ్ ఇప్పిస్తున్నాం. ప్రణాళికతో రోజుకు కనీసం 6-8 గంటలు కష్టపడి చదివితే విజయం సాధించవచ్చు. – మండ ప్రశాంత్వర్మ, త్రివేణి స్టడీ సర్కిల్ డైరెక్టర్, కిషన్పుర
హైదరాబాద్, గుంటూరు నుంచి ఫ్యాకల్టీలు
వరంగల్, హనుమకొండ కిషన్పుర మరో అశోక్నగర్ (హైదరాబాద్)గా పేరుగాంచాయి. కోచింగ్ సెంటర్లకు కేంద్ర బిందువుగా మారాయి. కోచింగ్ కోసం వచ్చే అభ్యర్థులతో హనుమకొండ కిషన్పుర, నయీంనగర్లో సందడిగా ఉంటోంది. ఉద్యోగాల ప్రకటనతో సెంటర్లకు ఫ్యాకల్టీలు ఇతర ప్రాంతాల నుంచి వస్తున్నారు. సబ్జెక్టు, కోర్సును బట్టి హైదరాబాద్, విజయవాడ, గుంటూరు, కృష్ణా, తిరుపతి తదితర ప్రాంతాల నుంచి ప్రత్యేక శిక్షకులను తీసుకొస్తున్నారు. వారంలో మూడు రోజులు అర్థమెటిక్, మెంటల్ ఎబిలిటీ, ఇంగ్లిష్ క్లాసులు చెప్పి వెళ్తున్నారు. అయితే ఫీజులు ఒక్కో సెంటర్లో ఒక్కో రకంగా ఉంటున్నాయి.
మెయిన్స్ని దృష్టిలో పెట్టుకోవాలి
గ్రూప్-1 పోటీ పరీక్ష కోసం ఎదురుచూసిన నిరుద్యోగుల కల రాబోయే నోటిఫికేషన్తో నెరవేరనుంది. గ్రూప్-1 పరీక్ష ముఖ్యంగా మూడు అంచెల్లో ఉంటుంది. మొదట ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ. అభ్యర్థులు తమ ప్రిపరేషన్ని మెయిన్స్ పరీక్షని దృష్టిలో పెట్టుకుని చదవాల్సి ఉంటుంది. అప్పుడే ప్రిలిమ్స్ కూడా ఎంతో సునాయసంగా సాధించి తర్వాత మెయిన్స్కి చేరుకుంటారు. గ్రూప్-1 సిలబస్ చూసినట్లయితే పేపర్-2 హిస్టరీ సిలబస్ ఎక్కువగా ఉంటుంది. ఆశావహులు ముందుగా హిస్టరీతో ప్రిపరేషన్ మొదలుపెడితే ఎక్కువ సార్లు రివిజన్ చేసుకోవచ్చు.
– సంధ్యారాణి, సీనియర్ ఫ్యాకల్టీ(హిస్టరీ)
తెలంగాణ ఉద్యమ చరిత్ర ఒక వరం..
గ్రూప్-1లో 6వ పేపర్, గ్రూప్-2లో 4వ పేపర్గా తెలంగాణ ఉద్యమ చరిత్ర 150 మార్కులకు పెట్టడం అభ్యర్థులకు ఒక వరం. తెలంగాణ ఉద్యమ చరిత్ర అందరికీ తెలిసిందే. ఇది అందరికీ మంచి అవకాశం. గ్రూప్స్ పరీక్షలకు ప్రిపేరయ్యే అభ్యర్థులకు ఆ పేపర్లు చాలా ఈజీగా ఉంటాయి. తెలంగాణ చరిత్రకి సంబంధించి కొన్ని తేదీలు పరీక్ష ల వేళ కన్ఫ్యూజ్ అయ్యే ప్రమాదం ఉంటుంది.
– వెంకట్, ‘తెలంగాణ మూవ్మెంట్’ ఫ్యాకల్టీ
టార్గెట్ పెట్టుకుంటా..
పాత సిలబస్తోనే పోటీ పరీక్షలు నిర్వహిస్తారు. ఈసారి పోటీ కూడా ఎక్కువగానే ఉంటుంది. అన్ని సబ్జెక్టుల్లో పట్టు సాధిస్తున్నాను. కొలువుల నోటిఫికేషన్ త్వరలో వస్తుందనుకుంటున్నా. చాలా సంతోషంగా ఉంది. లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకుని ఉద్యోగ సాధనకు కృషి చేస్తా. – వై.నందిని, గ్రూప్-1 అభ్యర్థి
5వ పేపర్ చాలా కీలకం..
గ్రూప్స్ కొట్టాలని చాలా మందికి ఉంటుంది. గ్రూప్-1 సాధించాలంటే చాలా కష్టమే. కానీ ప్రతిరోజూ సాధన చేస్తే ఈజీయే. ఉద్యోగాల ప్రకటనతో కోచింగ్ సెంటర్లలోనూ అభ్యర్థులు పెరిగారు. పేపర్-1 చాలా కీలకం. దీన్ని సాధన చేయడం కోసం ప్రతిరోజూ 2 గంటల సమయం తీసుకోవాలి. కష్టంతో కాకుండా ఇష్టంతో చదివితే జాబ్ కొట్టొచ్చు.
– అల్లాడి సంతోష్రావు, సీనియర్ ఫ్యాకల్టీ
గ్రూప్-1 సాధిస్తా..
గ్రూప్-1, 2 నోటిఫికేషన్ వస్తుందని ఎప్పటినుంచో సాధన చేస్తున్నా. ఈసారి ఎలాగైనా సరే కష్టపడి చదివి జాబ్ కొడతాననే నమ్మకంతో ఉన్నా. కోచింగ్ కూడా తీసుకుంటున్నా. ప్రతి రోజూ రివిజన్ చేసుకుంటున్నా. ఉద్యోగాల ప్రకటన కోసం చాలామంది ఆశగా ఎదురుచూస్తున్నారు. ఒకేసారి ఇన్ని వేల ఉద్యోగాలు రావడం చాలా సంతోషంగా ఉంది.
– వేదాంత్, గ్రూప్-1, 2 అభ్యర్థి
ఈ ఛాన్స్ను వదులకోను..
నేను గ్రూప్-2 కోచింగ్ తీసుకుంటున్నా. ఏడాది నుంచి ప్రిపేరవుతున్నా. సీఎం కేసీఆర్ ఉద్యోగ ప్రకటనతో చాలా సంతోషంగా ఉంది. ఈ అవకాశం కోసమే ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నా. వచ్చిన ఛాన్స్ను వదులుకోను. ఉద్యోగం తప్పకుండా సాధిస్తా. ఆ దిశగా ప్రయత్నం చేస్తున్నా.
– అజ్మీరా ప్రతాప్, గ్రూప్-2 అభ్యర్థి