ములుగు, జనవరి 22 (నమస్తే తెలంగాణ) : ములుగు జిల్లా ప్రజల పోరాటం, సీఎం కేసీఆర్ ఆరాటంతోనే రామప్పకు యునెస్కో గుర్తింపు లభించిందని తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. ఆదివారం రామప్ప దేవాలయాన్ని ఆమె గిరిజన, స్త్రీశిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతిరాథోడ్తో కలిసి సందర్శించారు. ముందుగా రుద్రేశ్వరస్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించి రామప్ప శిల్పకళను తిలకించారు. అనంతరం ఏర్పా టు చేసిన విలేకరులతో కవిత మాట్లాడారు.
రామప్ప వైభవాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన ఘనత సీఎం కేసీఆర్ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వానిదేనన్నారు. తెలంగాణ కళాకారుల ప్రతిభకు ఆలయం ఒక నిదర్శనమని తెలిపారు. రామప్పకు యునెస్కో గుర్తింపు రావడంతో ములుగు జిల్లాతో పాటు పరిసర ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత చేసిన కృషికి యునెస్కో గుర్తింపు దక్కిందన్నారు. పాలంపేట ప్రజలు, మేధావులు పాండురంగారావు, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి పాపారావు, గ్రామానికి చెందిన వీరమల్ల ప్రకాశ్రావు, రామప్ప పరిరక్షణ కమిటీ యునెస్కో గుర్తింపునకు ఎంతో కృషి చేశారని అన్నారు. వెయ్యి ఏండ్ల కింద 1213లో రేచర్ల రుద్రుడు రామప్పను నిర్మిస్తే రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ ఆలయ అభివృద్ధికి ఎంతో కృషి చేస్తున్నారని చెప్పారు. రామప్ప డెవలప్మెంట్ అథారిటీని ఏర్పాటు చేసి నిధులు కేటాయిస్తున్నట్లు తెలిపారు.
మేడారం సమ్మక్క-సారలమ్మ మహా జాతరకు జాతీయ పండుగ హోదా కల్పించాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఎమ్మెల్సీ కవిత డిమాండ్ చేశారు. ఈ డిమాండ్ ఇప్పటిది కాదని, రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి (ఎనిమిదేండ్లుగా) పార్లమెంట్లో బీఆర్ఎస్ ఎంపీలు డిమాండ్ చేస్తున్నారన్నారు. అయినా కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడంలేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కోట్ల రూపాయలు వెచ్చించి జాతర ఘనంగా నిర్వహిస్తోందన్నారు. గతానికి, ప్రస్తుతానికి మేడారం అభివృద్ధి చెందడంతోపాటు వసతులు పెరిగాయని భక్తులు చెప్తున్నారన్నారు.
1914లో నిజాం ప్రభుత్వం ఆధ్వర్యంలో రామప్ప గుడి పరిరక్షణకు నడుం కట్టిన నిజాం ప్రభువు ఆ నాడు గులాం యాజ్దాని అనే ఇంజినీర్ను రామప్పకు పంపి గుడిపై కప్పుకు మరమ్మతులు చేశారని తెలిపారు. నాడు నిజాం చేసిన మరమ్మతుల కారణంగానే నేడు మనందరం చూడటానికి గుడి మిగిలి ఉందన్నారు. రామప్ప నుంచి దేశ ప్రజలందరికీ మత సామరస్యం, సంస్కృతి, సంప్రదాయాలు కాపాడుకుంటూ భావి తరాలకు తెలియజేయాలన్నారు. జలవనరుల అభివృద్ధి సంస్థ చైర్మన్ వీరమల్ల ప్రకాశ్రావు, జడ్పీ చైర్మన్ కుసుమ జగదీశ్వర్, రెడ్కో చైర్మన్ ఏరువ సతీశ్రెడ్డి, భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, వరంగల్ జడ్పీ చైర్పర్సన్ గండ్ర జ్యోతి, రాష్ట్ర దివ్యాంగుల కార్పొరేషన్ చైర్మన్ వాసుదేవరెడ్డి, రాష్ట్ర రుణవిమోచన సంస్థ చైర్మన్ నాగుర్ల వెంకన్న, తెలంగాణ ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ మేడె రాజీవ్సాగర్, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.