మండల కేంద్రంగా ఇనుగుర్తి..
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 1985లో ఎన్టీ రామారావు అధికారంలో ఉన్న సమయంలో మండలాలను ఏర్పాటు చేశారు. ఆ సమయంలో అప్పటివరకు అధిక జనాభా ఉన్న ఇనుగుర్తి గ్రామం మండలకేంద్రంగా ఏర్పాటవుతుందని విస్తృతంగా ప్రచారం జరిగింది. నిజానికి ఆ సమయంలోనే ఇనుగుర్తి మండలం ఏర్పాటయ్యే అవకాశం ఉండగా సాంకేతిక కారణాల వల్ల ఇనుగుర్తికి బదులు కేసముద్రాన్ని మండలంగా ఏర్పాటు చేశారు. నాటి నుంచి సుమారు 37 సంవత్సరాలుగా మండల ఏర్పాటు కోసం ఇనుగుర్తి గ్రామ ప్రజలు ఎదురుచూశారు. కాంగ్రెస్, టీడీపీ ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చినప్పటికీ ఇక్కడి ప్రజల ఆకాంక్షను పట్టించుకోలేదు. సీఎం కేసీఆర్ ప్రజల అభీష్టం మేరకు ఎన్నికల సమయంలో ఇచ్చిన మాట ప్రకారం ఇనుగుర్తిని మండల కేంద్రంగా ప్రకటించారు.
కేసముద్రం, జూలై 25 : ఇనుగుర్తి గ్రామ ప్రజల దశాబ్దాల కల నెరవేరింది. వారి ఆకాంక్షల మేరకు సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన మాట ప్రకారం ఇనుగుర్తి గ్రామాన్ని మండల కేంద్రంగా ప్రకటించారు. కాకతీయుల కాలం నుంచి ఈ గ్రామానికి ప్రత్యేక గుర్తింపు ఉంది. ఇనుగుర్తిని కేంద్రంగా చేసుకొని కాకతీయులు ఈ ప్రాంతాన్ని పాలించినట్లు చరిత్ర చెబుతోంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉన్న పెద్ద గ్రామాల్లో ఇనుగుర్తి ఒక్కటి. ఇక్కడ సుమారు 8వేల జనాభా ఉంటుంది. నాటి పాలకుల నిర్లక్ష్యంతో మండలకేంద్రానికి నోచుకోలేదు. పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత పరిపాలనా సంస్కరణల్లో భాగంగా సీఎం కేసీఆర్ రాష్ట్రంలో పునర్విభజన చేపట్టారు. జవాబుదారీతనం పెంచేందుకు, పరిపాలనా సౌలభ్యం కోసం కొత్త జిల్లాలు, మండలాలు, గ్రామపంచాయతీలు ఏర్పాటుచేస్తున్నారు. ఈ క్రమంలో 2016 అక్టోబర్లో వరంగల్ జిల్లాలో మహబూబాబాద్ కొత్త జిల్లాగా ఏర్పడింది. 2016 ఏడాదిలోనే ఇనుగుర్తిని మండల కేంద్రంగా ఏర్పాటు చేయాల్సి ఉండగా సాంకేతిక కారణాల వల్ల ఏర్పాటుకాలేదు. ఈ నేపథ్యంలో గ్రామస్తులు పలుమార్లు మంత్రు లు దయాకర్రావు, సత్యవతిరాథోడ్, ఎంపీలు మాలోత్ కవిత, వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్యే బానోత్ శంకర్నాయక్ ద్వారా సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లారు. సోమవారం హైదరాబాద్లో ప్రగతిభవన్లో మరోసారి వారు సీఎం కేసీఆర్కు వినతిపత్రం అందించారు. ఈమేరకు స్పందించిన సీఎం ఇనుగుర్తిని మండల కేంద్రంగా ఏర్పాటుచేయాలని వెంటనే జీవో విడుదల చేయాలని సీఎస్ సోమేశ్కుమార్ను ఆదేశించినట్లు సమాచారం.
చారిత్రక గ్రామం ఇనుగుర్తి
ఇనుగుర్తి గ్రామానికి చారిత్రకంగా ప్రత్యేక గుర్తింపు ఉంది. ఇనుగుర్తిని కేంద్రంగా చేసుకొని కాకతీయులు ఈ ప్రాంతాన్ని పాలించినట్లు చరిత్ర చెబుతోంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉన్న పెద్ద గ్రామాల్లో ఇది ఒక్కటి. కాకతీయ రాజులు గ్రామంలో నివాసం ఉండే వారని చెబుతారు. అందుకే ఊరిలో ఎక్కడచూసినా రాతి స్తంభాలపై చెక్కిన శిల్పాలు, నంది విగ్రహం, నాగేంద్రుడి విగ్రహం, ఎత్తైన యాదవరాజుల విగ్రహాలు, శాసనాలు కనిపిస్తాయి. కాకతీయులు గ్రామంలో లక్ష్మీనరసింహస్వామి, ఉమా, రామలింగేశ్వరస్వామి, ఆలయం, శివాలయం, బ్రహ్మంగారి గుడి, అంజనేయస్వామి ఆలయాలను కాకతీయులు నిర్మించారని చరిత్ర చెబుతోంది. దేవాలయాలతో పాటు ఇనుగుర్తి చుట్టూ గుంటి, బంగారుకత్వ, ఆరెవాణి, బేడి అనే చెరువులను నిర్మించారు. గుంటి చెరువులో కాకతీయులు నాటిన చెట్లు, రాతి స్తంభాలతో చెరువు మధ్యలో ఉయ్యాల ఉంటుంది. ఇనుగుర్తి గ్రామం నుంచే తొలి తెనుగు దినపత్రికను 1922వ సంవత్సరంలో వద్దిరాజు సోదరులు రాఘవరంగారావు, సీతారాంచందర్రావు ప్రారంభించారు. అంతేగాక ఇనుగుర్తి గ్రామం వాలీబాల్కు పుట్టినిల్లుగా పేరుగాంచింది. గ్రామానికి చెందిన వెంకటనారాయణ ఇండియన్ వాలీబాల్ టీమ్ కెప్టెన్గా వ్యవహరించారు. ఎంతోమంది క్రీడాకారులు వాలీబాల్ ద్వారా జాతీయ అంతర్జాతీయ స్థాయిలో రాణించి ప్రభుత్వ ఉద్యోగం పొందారు.
మండలం చేయడం హర్షణీయం
– ఎమ్మెల్యే బానోత్ శంకర్నాయక్
మహబూబాబాద్ నియోజకవర్గంలో అతి పెద్ద గ్రామం ఇనుగుర్తిని మండలకేంద్రంగా ఏర్పాటు చేయడం చాలా సంతోషం. మానుకోట తెచ్చుడో.. శంకర్నాయక్ సచ్చుడో అనే నినాదంతో పోరాడాను. సీఎం కేసీఆర్ ఆశీస్సులతో జిల్లాను సాధించాను. అదే స్ఫూర్తితో ఇనుగుర్తి మండలకేంద్రంగా తీసుకొస్తానని పలుమార్లు ప్రజలకు చెప్పాను. 13 మండలాలను ప్రకటించిన జాబితాలో ఇనుగుర్తి లేకపోవడంతో ప్రజలు ఆందోళన చెందారు. అయినప్పటికీ నిరుత్సాహ పడకుండా సీఎం కేసీఆర్ ఇచ్చిన మాట ప్రకారం ఇనుగుర్తిని మండల కేంద్రంగా ఏర్పాటు చేస్తారని ప్రజలకు వివరించాను. ఇప్పుడు సీఎం కేసీఆర్ స్పందించి ప్రకటన చేశారు. మండల కేంద్రం చేసినందుకు కృతజ్ఞతలు.
శక్తివంచన లేకుండా అభివృద్ధి చేస్తా..
– ఎంపీ వద్దిరాజు రవిచంద్ర
1983 సంవత్సరం నుంచి ఇనుగుర్తి మండల కేంద్రం కావాలని ప్రజల కోరిక. సమైక్య పాలకులు పట్టించుకోకపోవడం వల్ల అది నెరవేరలేదు. చారిత్రక నేపథ్యం, ప్రజల ఆకాంక్ష మేరకు ఇనుగుర్తిని మండలంగా ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్ను కోరడంతో స్పందించి ఆదేశాలు ఇవ్వడం సంతోషంగా ఉంది. ముఖ్యమంత్రి నిర్ణయంతో ప్రజల 37 ఏండ్ల కల నెరవేరింది. కొత్తగా ఏర్పడనున్న ఇనుగుర్తి మండల అభివృద్ధికి శక్తి వంచన లేకుండా కృషిచేస్తా.
పరిపాలనా సౌలభ్యం మెరుగవుతుంది..
– ఎంపీ మాలోత్ కవిత
ఇనుగుర్తి కొత్త మండలంగా ఏర్పాటు కావడం వల్ల పరిపాలనా సౌలభ్యం మెరుగుపడుతుంది. ప్రభుత్వ కార్యాలయాలు అందుబాటులోకి వస్తాయి. ప్రజలకు సౌకర్యంగా ఉంటుంది. ఏ ప్రభుత్వాలూ అందించని విధంగా సీఎం కేసీఆర్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి పరిపాలనా సంస్కరణలు తెచ్చి సంక్షేమం, అభివృద్ధిని ప్రజలకు అందిస్తున్నారు. ఇనుగుర్తి మండలం ఏర్పాటుకు కృషిచేసిన గ్రామ వాస్తవ్యులు ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, అలాగే మంత్రులు దయాకర్రావు, సత్యవతిరాథోడ్లకు ధన్యవాదాలు. ఎంపీ ఎన్నికల్లో సీఎం కేసీఆర్ ఇచ్చిన మాట ప్రకారం మండలం ఏర్పాటు చేసినందుకు వారికి ప్రత్యేక కృతజ్ఞతలు.
సీఎం కేసీఆర్కు ప్రజాప్రతినిధుల కృతజ్ఞతలు
ఇనుగుర్తి మండల ప్రకటన అనంతరం హైదరాబాద్లో మంత్రులు ఎర్రబెల్లి, సత్యవతి, ఎంపీలు కవిత, రవిచంద్ర, ఎమ్మెల్యే శంకర్ నాయక్ తదితరులు విలేకరులతో మాట్లాడుతూ సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ ప్రాంత ప్రజల చిరకాల ఆకాంక్ష నెరవేరిందని, ఆనందం వ్యక్తం చేస్తూ మండల ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.