వర్ధన్నపేట, మే 5: అంగవైకల్యంతో బాధపడుతున్న వారికి తెలంగాణ ప్రభుత్వం అండగా నిలుస్తున్నదని వర్ధన్నపేట ఎమ్మెల్యే, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు అరూరి రమేశ్ అన్నారు. మండలంలోని కట్య్రాల గ్రామ శివారు ఉప్పరపల్లి క్రాస్రోడ్డులోని లక్ష్మీ గార్డెన్స్లో మహిళా, శిశు, దివ్యాంగులు, వృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఉపకరణాలు అందించేందుకు గురువారం దివ్యాంగుల గుర్తింపు శిబిరం నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే హాజరై మాట్లాడారు. జిల్లాలో అంగవైకల్యం ఉన్న వారిని గుర్తించి ఉపకరణాలు అందించేందుకు ప్రభుత్వం వివిధ శాఖల ఆధ్వర్యంలో ఈ శిబిరాన్ని ఏర్పాటు చేసిందన్నారు. అర్హులైన వారిని గుర్తించి, వారికి త్వరలోనే ప్రభుత్వం ద్వారా ట్రై సైకిళ్లు, ఇతర ఉపకరణాలను అందించనున్నట్లు వెల్లడించారు.
అలాగే, దివ్యాంగులు కుటుంబంపై ఆధారపడకుండా టీఆర్ఎస్ ప్రభుత్వం దేశంలో ఎక్కడా లేని విధంగా రూ. 3,016 పింఛన్ అందిస్తున్నదని గుర్తుచేశారు. అలాగే, దివ్యాంగుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏటా రూ. 1,800 కోట్లు ఖర్చు చేస్తున్నదని వివరించారు. వర్ధన్నపేట నియోజకవర్గంలోని దివ్యాంగులకు 30 డబుల్ బెడ్రూం ఇండ్లు అందించేందుకు పైడిపల్లిలో శరవేగంగా నిర్మాణ పనులు జరుగుతున్నాయని తెలిపారు. అలాగే, రానున్న రోజుల్లో దివ్యాంగుల సంక్షేమం కోసం నియోజకవర్గంలో తనవంతు సహకారం అందిస్తానని ఎమ్మెల్యే రమేశ్ హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఎంపీపీ అన్నమనేని అప్పారావు, జడ్పీటీసీ మార్గం భిక్షపతి, పీఏసీఎస్ చైర్మన్ రాజేశ్ఖన్నా, కట్య్రాల గ్రామ సర్పంచ్ గుజ్జ సంపత్రెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ ఆంగోత్ అరుణ, వైస్ చైర్మన్ కోమాండ్ల ఎలేందర్రెడ్డి, ఏసీపీ గొల్ల రమేశ్, సీఐ సదన్కుమార్, డీడబ్ల్యూవో ఎం శారద, సీడీపీవోలు శ్రీదేవి, విశ్వజ, దివ్యాంగులు పాల్గొన్నారు.
ఘనంగా బొడ్రాయి వేడుకలు
పర్వతగిరి: మండలంలోని నారాయణపురంలో బొడ్రాయి విగ్రహ ప్రతిష్ఠాపన వేడుకలను గురువారం ఘనంగా నిర్వహించారు. టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే అరూరి రమేశ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన కొబ్బరికాయ కొట్టి పూజలు చేశారు. అనంతరం కళాకారులతో కలిసి వేడుకల్లో పాల్గొన్నారు. కార్యక్రమంలో జడ్పీటీసీ సింగ్లాల్, ఎంపీపీ కమలా పంతులు, ఏకాంతంగౌడ్, టీఆర్ఎస్ మండల కార్యదర్శి ఎర్రబెల్లి వెంకటేశ్వర్రావు, సర్పంచ్ కొత్తూరి రామ్మోహన్, సర్వర్, నాయకులు పాల్గొన్నారు.
రైతులు అధైర్య పడొద్దు: అరూరి
వర్ధన్నపేట: రైతులు అధైర్య పడొద్దని, తెలంగాణ ప్రభుత్వం ప్రతి ధాన్యం గింజనూ కొంటుందని ఎమ్మెల్యే అరూరి రమేశ్ అన్నారు. మండలకేంద్రంలోని ప్రభుత్వ కళాశాల ఆవరణలో, ఫిరంగిగడ్డలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలను ఆయన ప్రారంభించారు. కేంద్రంలోని బీజేపీ తెలంగాణలో యాసంగి ధాన్యాన్ని కొనుగోలు చేయడానికి ముందుకు రాకపోవడం బాధాకరమన్నారు. రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్న కేంద్ర ప్రభుత్వానికి అన్నదాతలు తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు.
కార్యకర్త కుటుంబానికి బీమా చెక్కు అందజేత
పట్టణానికి చెందిన కొండేటి రాజ్కుమార్ ఇటీవల ప్రమాదవశాత్తు మృతి చెందాడు. అతడు టీఆర్ఎస్ సభ్యత్వం పొందడంతో రూ. 2 లక్షల ఇన్సూరెన్స్ మంజూరైంది. ఆ చెక్కును రాజ్కుమార్ భార్య కోమలకు ఎమ్మెల్యే అందజేశారు. ఎంపీపీ అప్పారావు, జడ్పీటీసీ భిక్షపతి, మున్సిపల్ చైర్పర్సన్ అరుణ, వైస్చైర్మన్ ఎలేందర్రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ రాజేశ్ఖన్నా, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు కుమారస్వామి పాల్గొన్నారు.