పాఠశాలల పునఃప్రారంభం రోజే విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది. పాఠశాల విద్యను మరింత బలోపేతం చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నది. ఇందులో భాగంగా వేసవి సెలవుల్లోనే ఆయా జిల్లాలకు పుస్తకాలు పంపిస్తున్నది. వరంగల్ జిల్లా గోదాముకు ఇప్పటికే 40శాతం చేరుకోగా, త్వరలోనే పూర్తిస్థాయిలో పుస్తకాలు వస్తాయని జిల్లా విద్యా శాఖ అధికారులు చెబుతున్నారు. ఈ నెలాఖరులోగా బుక్స్ను ఎమ్మార్సీలకు తరలిస్తామని తెలిపారు.
గిర్మాజీపేట, మే 8 : రాష్ట్ర ప్రభుత్వం సర్కారు సూళ్లు మరింత బలోపేతానికి కృషి చేస్తున్నది. భవిష్యత్తులో విద్యార్థులు పోటీని తట్టుకునేలా ఓ వైపు నాణ్యమైన విద్యను అందిస్తూనే సర్కారు బడుల్లో మౌలిక వసతులు కల్పిస్తూ కార్పొరేట్కు దీటుగా తీర్చిదిద్దుతున్నది. ఈ దఫా విద్యాసంవత్సరం ప్రారంభానికి ముందే పాఠ్య పుస్తకాలు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నది. వరంగల్ జిల్లాలో 722 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. ఇందులో 490 ప్రాథమిక పాఠశాలలు, 86 ప్రాథమికోన్నత పాఠశాలలు, 146 ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. దాదాపు 51,939 మంది విద్యార్థులు చదువుకుంటు న్నారు. వీరి కోసం రాష్ట్ర ప్రభుత్వం ముద్రించిన పాఠ్యపుస్తకాలు జిల్లా కేంద్రంలోని గోదాముకు చేరుకున్నాయి. వీరికి మొత్తం 4,01,012 పాఠ్య పుస్తకాల అవసరం కాగా, గత విద్యా సంవత్సరంలో మిగిలిన 19,702 పుస్తకాలు పోను ఇంకా 3,81,310 పుస్తకాలు కావాల్సి ఉంటుంది. ఇప్పటివరకు జిల్లా గోదాముకు 1,50,900 పాఠ్యపుస్తకాలు చేరాయి. ఇంకా 2,30,410 పుస్తకాలు రావాల్సి ఉంది. ఇవి త్వరలోనే జిల్లాకు రానున్నాయి.
బార్ కోడింగ్ ఆధారంగా పంపిణీ
కోట్లాది రూపాయలు వెచ్చించి ముద్రించిన పుస్తకాలు ప్రైవేట్పరం కాకుండా ప్రభుత్వం పకడ్బందీ చర్యలు చేపట్టింది. బార్కోడింగ్ ఆధారంగా వీటిని ముద్రించింది. బార్ కోడ్ ఆధారంగా అవి ఏ జిల్లాకు కేటాయించారో సులువుగా తెలుసుకోవచ్చు.
ఒకే పుస్తకం.. రెండు భాషలు..
గతేడాది నుంచి సర్కారు బడుల్లో ఆంగ్లమాధ్యమం ప్రవేశపెట్టింది. ఈ క్రమంలో విద్యార్థులకు ఏ ఇబ్బంది కలుగకుండా ఒకే పుస్తకంలో రెండు భాషలతో పాఠ్యాంశాలను ముద్రించింది. రెండు భాషల్లో పాఠ్య పుస్తకాల ముద్రణపై ఇటు విద్యార్థులు, అటు ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
స్కూళ్ల ప్రారంభం నాటికి రెడీ
రాష్ట్ర ప్రభుత్వం గతేడాది కంటే భిన్నంగా స్కూళ్ల పునఃప్రారంభానికి ముందే జిల్లాకు పాఠ్య పుస్తకాలను పంపించింది. ఇప్పటివరకు 40శాతం పుస్తకాలు చేరాయి. త్వరలోనే మొత్తం రానున్నాయి. పాఠశాలల ప్రారంభం నాటికి ఆయా పాఠశాలల హెచ్ఎంలకు పుస్తకాలను అందిస్తాం.
– డీ వాసంతి, డీఈవో
నెలాఖరులోగా ఎంఆర్సీలకు..
ఇప్పటికే జిల్లా కేంద్రంలోని గోదాముకు 40 శాతం పాఠ్యపుస్తకాలు వచ్చాయి. త్వరలోనే మొత్తం పుస్తకాలు చేరుకుంటాయి. ఈ నెలాఖరు కల్లా ఎంఆర్సీ భవనాలకు వీటిని తరలిస్తాం. విద్యా సంవత్సరం ప్రారంభం రోజే విద్యార్థులకు పుస్తకాలను అందజేస్తాం.
– కృష్ణమూర్తి,జిల్లా నోడల్ అధికారి, డీసీఈబీ సెక్రటరీ