ములుగు, ఏప్రిల్ 18 (నమస్తే తెలంగాణ)/వెంకటాపూర్ : కాకతీయుల కళావైభవ చిహ్నం.. చారిత్రక రామప్ప ఆలయం పులకించిపోయింది. యునెస్కో గుర్తింపు తర్వాత తొలిసారిగా ఇక్కడ నిర్వహించిన ప్రపంచ వారసత్వ ఉత్సవాలు అంబరాన్నంటాయి. ‘శిల్పం వర్ణం కృష్ణం’ థీమ్తో మంగళవారం జరిగిన వేడుకలు అలరించగా, వేలాదిగా తరలివచ్చిన పర్యాటకులతో పాలంపేట పోటెత్తింది. ఉదయం నుంచి రాత్రి వరకు కళాకారులు, సినీప్రముఖులు ఇచ్చిన ప్రదర్శనలు విశేషంగా ఆకట్టుకున్నాయి. వాయిద్య కళాకారుడు శివమణి, పిల్లనగ్రోవి కళాకారుడు నవీన్, సంగీత దర్శకుడు తమన్, సింగర్ కార్తీక్ షోలు ఉర్రూతలూగించాయి. పేరిణి నృత్యం, క్లాసికల్ డ్యాన్స్ ప్రదర్శనలను వీక్షించిన ఆహూతులు ఆనందపారవశ్యం పొందారు. కలెక్టర్ కృష్ణ ఆదిత్య పర్యవేక్షణలో కొనసాగిన ఈ కార్యక్రమానికి మంత్రులు వీ శ్రీనివాస్గౌడ్, ఎర్రబెల్లి దయాకర్రావు, సత్యవతి రాథోడ్, ప్రభుత్వ చీఫ్విప్ దాస్యం వినయ్భాస్కర్ ముఖ్య అతిథులుగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేశారు. 800 ఏళ్ల క్రితం నుంచే సైన్స్కు దొరకని టెక్నాలజీకి మారుపేరు తెలంగాణ అని, రామప్ప ఆలయాన్ని చరిత్రలో నిలిచిపోయేలా అభివృద్ధి చేస్తామని అమాత్యులు వెల్లడించారు.
రామప్ప ఆలయ ప్రాంగణంలో ప్రపంచ వారసత్వ ఉత్సవాలు అంబరాన్నంటాయి. ‘శిల్పం వర్ణం కృష్ణం’ థీమ్తో మంగళవారం ఇక్కడ ఏర్పాటుచేసిన సాంస్కృతిక ప్రదర్శనలు ఆహూతులను ఉర్రూతలూగించాయి. దగదగలాడే వెలుగులు. హుషారెత్తించే సంగీత ధ్వనుల నడుమ వందలాది కళాకారుల ఆటపాటలు ఆద్యంతం కట్టిపడేశాయి. కలెక్టర్ కృష్ణ ఆదిత్య పర్యవేక్షణలో ఏర్పాటుచేసిన కార్యక్రమాన్ని ఎక్సైజ్, పర్యాటక శాఖల మంత్రి వి.శ్రీనివాస్గౌడ్, రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, గిరిజన, స్త్రీశిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతిరాథోడ్లు ముఖ్య అతిథులుగా హాజరై ప్రారంభించారు.
ఉదయం నుంచే సందడి..
ఉదయం నుంచే సందడి మొదలైంది. ఇటు ఆలయంతో పాటు రామప్ప సరస్సును సందర్శించి సరదాగా గడిపారు. తొలిసారి నిర్వహించిన వారసత్వ వేడుకలకు ఉమ్మడి వరంగల్ నుంచే గాక హైదరాబాద్ నుంచి వేలాదిగా తరలివచ్చారు. 9గంటల నుంచి సాయంత్రం 5 వరకు ఫుడ్ ఫెస్టివల్లో భాగంగా తెలంగాణ సంప్రదాయ పిండివంటలను స్టాల్స్లో ప్రదర్శించారు. వివిధ వ్యాపార, వాణిజ్య సంస్థల ఉత్పత్తులను తెలిపే స్టాల్స్ను కూడా ఏర్పాటు చేశారు. సాయంత్రం 70మంది వయోలిన్ విధ్వాంసులతో స్వాగత కార్యక్రమం నిర్వహించారు. పేరిణి నృత్య కళాకారులు రాజ్కుమార్ బృందం నృత్య ప్రదర్శన ఆకట్టుకుంది. రామప్ప వారసత్వ సంపదపై రూపొందించిన లఘుచిత్రాన్ని ప్రదర్శన కళ్లగట్టింది. ప్రముఖ కళాకారుడు సూర్వ ఎన్రావు రూపొందించిన రావణ నృత్య ప్రదర్శన కట్టిపడేసింది.
దేశంలోని వారసత్వ సంపదలపై శ్రావ్యమానస ఆధ్వర్యంలో 200మంది కళాకారులు శాస్త్రీయ నృత్యం ప్రదర్శించారు. అనంతరం బలగం చిత్రబృందాన్ని సన్మానించారు. ఆ తర్వాత డ్యాన్స్ డైరెక్టర్ విజయజ్యోతి రచించిన రామప్ప ఆలయం నాట్యశాస్త్రం పుస్తకాన్ని ఆవిష్కరించారు. అనంతరం మిరుమిట్లు గొల్పేలా రంగురంగుల విద్యుత్ కాంతులతో నిర్వహించిన లేజర్ షోతో నయాలుక్ వచ్చినట్లయింది. అలాగే ముఖ్య అతిథులుతో కళాకారులకు, స్పాన్సర్స్ను సన్మానించారు. సంగీత దర్శకుడు ఎస్.ఎస్.తమన్, సింగర్ కార్తీక్, ఫ్లూటిస్ట్ నవీన్లు గంటలన్నర పాటు సంగీత, వాయిద్య ప్రదర్శనలు రాత్రి 11గంటల దాకా కొనసాగగా ఆహుతులను అలరించాయి. డ్రమ్మర్ శివమణి.. స్వయంగా రామప్ప రుద్రేశ్వరస్వామి వచ్చి శివతాండవం చేస్తున్నట్లు చేసిన ప్రదర్శన ఆహుతులను భక్తి పారవశ్యంలో ముంచింది.
ప్రపంచానికి కాకతీయులే దిక్సూచి ;రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్
ప్రపంచానికి 800 ఏళ్ల నాడే తెలంగాణ ప్రాంతాన్ని పరిపాలించిన కాకతీయు రాజులు దిక్సూచిగా మారారని, వారు అవలంబించిన టెక్నాలజీ సైన్స్కు సైతం సవాల్గా మారిందని రాష్ట్ర పర్యాటక, పురవాస్తు శాఖల మంత్రి వి.శ్రీనివాస్గౌడ్ అన్నారు. ఏటా ప్రపంచ వారసత్వ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర రాజధాని హైదరాబాద్లో ఉత్సవాలు జరిపే వాళ్లమని సీఎం కేసీఆర్ సూచనల మేరకు ఈ ఏడాది రామప్పలో నిర్వహించామన్నారు. తరతరాల చరిత్రను భావితరాలకు తెలియజేసేందుకే ఉత్సవాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. తెలంగాణ నైపుణ్యం, విశిష్ట కళ, ప్రాంత చరిత్ర, రామప్ప శిల్పాల్లో దాగి ఉందని అన్నారు. సీఎం కేసీఆర్ పట్టుదలతోనే యునెస్కొ గుర్తింపు సాధ్యమైందన్నారు. రామప్పకు యునెస్కొ గుర్తింపు ద్వారా తెలంగాణ ప్రాంత గొప్పతనం యావత్ ప్రపంచానికి తెలిసిందన్నారు. రామప్ప అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషిచేస్తున్నదని, అందులో భాగంగానే ఆలయ పరిసర ప్రాంతాలను రూ.23కోట్లతో అభివృద్ధి చేస్తున్నామని పేర్కొన్నారు. కాకతీయుల సాంకేతిక స్ఫూర్తితో సీఎం కేసీఆర్ యాదాద్రిని అత్యద్భుతంగా నిర్మించారని చెప్పారు. అలాగే వారు అనుసరించిన విధానాల నుంచే మిషన్ కాకతీయకు శ్రీకారం చుట్టినట్లు గుర్తుచేశారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతున్నదని.. తెలంగాణ పాటకు ఆస్కార్ రావడం ఎంతో గొప్ప విషయమన్నారు. రామప్పను మరింత అభివృద్ధి చేసేందుకు తన వంతు కృషిచేస్తానని హామీ ఇచ్చారు. రామప్ప ఖ్యాతిని మరింత విస్తరింపజేసేందుకు నిత్యం కవులు, కళాకారులతో సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి ప్రకటించారు.
చరిత్రలో నిలిచిపోయేలా అభివృద్ధి చేస్తాం..;మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు
కాకతీయులు నిర్మించిన రామప్ప ఆలయ విశిష్టతను భావితరాలకు దిక్చూచిలా నిలిచేలా మరింత అభివృద్ధి చేస్తామని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. యునెస్కొ గుర్తింపు కోసం సీఎం కేసీఆర్ పట్టుదలతో తీవ్రంగా కృషి చేశారని అన్నారు. సమైక్యపాలనలో ఆదరణకు నోచుకోని మన ఆలయాలను స్వరాష్ట్రంలో అభివృద్ధి చేస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రపంచంలోని 17 దేశాల సహకారంతో రామప్పకు యునెస్కో గుర్తింపు లభించిందన్నారు. కేంద్ర, రాష్ట్ర పర్యాటక శాఖల ద్వారా రామప్పను మరింత తీర్చిదిద్దుతామని చెప్పారు. రామప్పకు గుర్తింపు రావడంలో ఇంటాక్ కన్వీనర్ ప్రొఫెసర్ పాండురంగారావు, మాజీ ఐఏఎస్ అధికారి పాపారావు, వైజాగ్కు చెందిన ఐఏఎస్ అధికారిణి వేదవతి కృషి ఎంతో ఉన్నదని కొనియాడారు. రామప్పతో తెలంగాణ ఖ్యాతి ప్రపంచాన్ని తెలుస్తున్న క్రమంలో తెలంగాణ యాస, భాషకు కూడా ప్రజలు పట్టం కడుతున్నారని, ఇటీవల వేణు దర్శకత్వంలో వచ్చిన బలగం సినిమా అపూర్వ విజయం సాధించిందన్నారు. రామప్ప గుర్తింపునకు కృషిచేసిన ప్రతీ ఒక్కరికి పేరుపేరునా మంత్రి ధన్యవాదాలు తెలిపారు.
తెలంగాణకు గర్వకారణం రామప్ప ;మంత్రి సత్యవతి రాథోడ్
కాకతీయు కళావైభవం, శిల్పకళతో పర్యాటకుల మనసు దోచుకుంటున్న రామప్ప ఆలయం యావత్ తెలంగాణ రాష్ర్టానికే గర్వకారణమని రాష్ట్ర గిరిజన, స్త్రీశిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతిరాథోడ్ అన్నారు. ప్రపంచ పటంలో రామప్పకు ప్రత్యేక గుర్తింపు వచ్చేందుకు సీఎం కేసీఆర్ నాయకత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం ఎంతో కృషి చేసిందన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ఒక్క దేవాలయానికి కూడా యునెస్కొ గుర్తింపు లభించలేదన్నారు. స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ తీసుకుంటున్న నిర్ణయాలు, పట్టుదలతోనే తెలంగాణ రాష్ర్టానికి ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు లభిస్తుందన్నారు. పర్యాటక ప్రాంతంగా విరాజిల్లనున్న ములుగు జిల్లాను మరింత అభివృద్ధి చేసి రానున్న రోజుల్లో మరింత ప్రాచుర్యం కల్పిస్తామని చెప్పారు. జడ్పీచైర్మన్ జగదీశ్వర్ మాట్లాడుతూ ప్రపంచ గుర్తింపు పొందిన రామప్ప ఆలయం ములుగు జిల్లాలో ఉండడం జిల్లా ప్రజలకు ఎంతో గర్వకారణమన్నారు. ఎమ్మెల్యే సీతక్క మాట్లాడుతూ గత జీవన విధానం తెలిపేది సంస్కృతి, సంప్రదాయమని, భవిష్యత్తు తరాలు తెలంగాణ సంస్కృతిని రామప్ప దేవాలయ సందర్శన ద్వారా తెలుసుకోవచ్చని అన్నారు. ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం ఎంతో అభినందనీయమన్నారు. కార్యక్రమంలో చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్, భూపాలపల్లి బీఆర్ఎస్ జిల్లా అధ్యుక్షురాలు గండ్ర జ్యోతి, వైస్ చైర్మన్ బడే నాగజ్యోతి, ఎమ్మెల్యేలు సీతక్క, పోదెం వీరయ్య, వరంగల్ ఎంపీ పసునూటి దయాకర్, వరంగల్ నగర మేయర్ గుండు సుధారాణి, కార్పొరేషన్ చైర్మన్లు వీరమల్ల ప్రకాశ్, గెల్లు శ్రీనివాస్యాదవ్, వై.సతీశ్రెడ్డి, అనిల్ కుర్మాచలం, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ గోవింద్నాయక్, ఎస్పీ గౌస్ ఆలం, ఐటీడీఏ పీవో అంకిత్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఇలా త్రిపాఠి, మాజీ ఎంపీ సీతారాంనాయక్, ఓఎస్డీ అశోక్కుమార్, డీఆర్వో రమాదేవి, ఇంటాక్ కన్వీనర్ ప్రొఫెసర్ పాండురంగారావు, పాలంపేట సర్పంచ్ డోలి రజిత, ఎంపీటీసీ తిరుపతిరెడ్డి, ఎంపీపీ బుర్ర రజిత, జడ్పీటీసీ గైరుద్రమదేవి పాల్గొన్నారు.