హనుమకొండ, అక్టోబర్ 14 : వరంగల్ నిట్(జాతీయ సాంకేతిక విద్యాసంస్థ)లో ప్రతి ఏటా సాంకేతిక మహోత్సవానికి రెడీ కాబోతోంది. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న తన వార్షిక సాంకేతిక ఉత్సవం ‘టెక్నోజియన్’ను ఈనెల 24, 25 తేదీల్లో ఘనంగా నిర్వహించడానికి సిద్ధమవుతోంది. 2006 నుంచి నిట్లో టెక్నోజియన్ పేరిట నూతన ఆవిష్కరణలకు నాంది పలుకుతోంది. దేశవ్యాప్తంగా 7 వేల విద్యార్థులు ఇందులో పాల్గొంటారు. వారిని ఆకర్షించేవిధంగా దేశంలోని ప్రముఖ విద్యార్థుల ఆధ్వర్యంలోని సాంకేతిక ఉత్సవాలలో ఒకటిగా స్థిరపడ్డది. ఈ సంవత్సరం టెక్నోజియన్-25 సృజనాత్మకత ఆవిష్కరణల సరిహద్దులను మరింత విస్తరించబోతోంది.
ప్రతిభను ప్రోత్సహిస్తూ..
రూ.2 లక్షల విలువైన బహుమతి నిధితో పాటు, రెండు రోజులపాటు ఉత్సాహభరితమైన పోటీలు, సాంకేతిక ప్రదర్శనలు, విభిన్న ఈవెంట్లతో నిండి ఉండే ఈ ఉత్సవం, సాంకేతిక పురోగతిని వేడుకగా జరుపుకునే వేదికగా నిలవనుంది. యువ మేధావులను ప్రేరేపిస్తూ, ప్రతిభను పెంపొందించే తన వారసత్వాన్ని కొనసాగిస్తూ, టెక్నోజియన్-25 సరిహద్దులను దాటి ఆవిష్కరణలను అన్వేషించే భారత యువతను ఒకచోట చేర్చే స్మరణీయ కార్యక్రమంగా నిలవనుంది. విద్యార్థులే నిర్వాహకులుగా మారి నిర్వహించే ఎన్నో నూతన ఆవిష్కరణ, సాంకేతిక ఉత్సవాల కార్యక్రమాలకు వేదికగా మారనుంది.
వివిధ రకాల ఈవెంట్స్..
టెక్నోజియన్లో భాగంగా విద్యార్థులు వివిధ రకాల ఈవెంట్లతో ఆకట్టుకోనున్నారు. కోడ్ రెడ్, ప్రాజెక్టు ఎక్స్పో, ది లాంచ్పాడ్, బ్లేజ్(వెల్కమ్ టు ది బార్డర్ల్యాండ్స్), నియోన్ క్రికెట్, గెస్టోర్ డ్రిఫ్ట్, వీరేంద్ర అధికారి ఫొటోగ్రాఫీతో పాటు పలు ఈవెంట్లను ప్రదర్శించనున్నారు. ఇందులో ప్రతిభ కనబర్చినవారికి రూ.2 లక్షల ప్రైజ్మనీ కూడా అందజేయనున్నారు. దేశంలోని వివిధ రాష్ట్రాల నిట్ విద్యార్థులతో పాటు, ఇంజినీరింగ్ కాలేజీల విద్యార్థులు ఇందులో పాల్గొని రెండురోజుల పాటు సందడి చేయనున్నారు. మరిన్ని వివరాలకు https://technozion.nitw.ac.in/ వెబ్సైట్ను సందర్శించాలని నిర్వాహకులు తెలిపారు.