హైదరాబాద్, జనవరి 12 (నమస్తే తెలంగాణ)/నర్సంపేట : నర్సంపేట నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. దశాబ్ద కాలంగా కాంగ్రెస్ పార్టీలో కీలక నేతగా ఉన్న తక్కళ్లపల్లి రవీందర్ రావు గులాబీ తీర్థం పుచ్చుకున్నారు. సోమవారం హైదరాబాద్లో నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో పార్టీ కండువా కప్పుకున్నారు. రవీందర్రావు గత పదేండ్లుగా నర్సంపేట నియోజకవర్గ కాంగ్రెస్ కన్వీనర్గా, జిల్లా పార్టీ అధికార ప్రతినిధిగా కీలక బాధ్యతలు నిర్వర్తించారు.
గతంలో ఆయన రెండు సార్లు ఎంపీపీగా, సింగిల్ విండో చైర్మన్గా పనిచేసి నియోజకవర్గంలో మంచి పట్టు సాధించారు. కాంగ్రెస్ సర్కారు రాష్ట్రంలో అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలు, మోసపూరిత వైఖరిని నిరసిస్తూ బీఆర్ఎస్లో చేరుతున్నట్టు ఈ సందర్భంగా రవీందర్రావు ప్రకటించారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ హయాంలో రాష్ట్రంలో జరిగిన అభివృద్ధికి ఆకర్షితుడినై పార్టీలో చేరుతున్నట్టు ప్రకటించారు. ఈ చేరికతో నియోజకవర్గ రాజకీయాల్లో, ముఖ్యంగా నర్సంపేట మున్సిపాలిటీ, ఖానాపురం మండలాల్లో బీఆర్ఎస్కు కొండంత అండ లభిస్తుందని పెద్ది సుదర్శన్రెడ్డి పేర్కొన్నారు. క్షేత్రస్థాయిలో బలమైన క్యాడర్ ఉన్న రవీందర్రావు పార్టీలోకి రావడంతో రాబోయే రోజుల్లో పార్టీ మరింత పటిష్టం అవుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.