వరంగల్ను హెల్త్సిటీగా మార్చేందుకు రూ.1116 కోట్లతో నిర్మిస్తున్న సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పనులు 68 శాతం పూర్తయ్యాయని, వీలైనంత త్వరగా ప్రజలకు అందుబాటులోకి తెస్తామని, అత్యాధునిక వైద్య సేవలు ఇక ఇక్కడే అందుతాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి టీ హరీశ్రావు అన్నారు. మెగా వైద్యశాల పనుల పురోగతిని మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావుతో కలిసి బుధవారం ఆయన పరిశీలించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ 24 అంతస్తుల్లో 2,100 పడకల సామర్థ్యంతో కడుతున్న హాస్పిటల్ పనులను వెయ్యి మంది కార్మికులతో చేయిస్తున్నట్లు చెప్పారు. వరంగల్పై సీఎం కేసీఆర్కు ప్రత్యేక అభిమానం ఉందని, రాష్ట్రం ఏర్పడేనాటికి ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఒకేఒక కేఎంసీ ఉండేదని, ఇవాళ అదనంగా ఏడు ప్రభుత్వ మెడికల్ కాలేజీలు వచ్చాయని గుర్తుచేశారు. ఒకే నియోజకవర్గం కలిగిన భూపాలపల్లి, ములుగు వంటి జిల్లాల్లోనూ తెలంగాణ ప్రభుత్వం మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేయడం దేశంలోనే రికార్డు అని అభివర్ణించారు.
– వరంగల్, మే 31(నమస్తేతెలంగాణ)
వరంగల్, మే 31(నమస్తేతెలంగాణ): తెలంగాణ ప్రభుత్వం వరంగల్లో నిర్మిస్తున్న సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పనులు శరవేగంగా జరుగుతున్నాయని మంత్రి హరీశ్రావు చెప్పారు. ఇప్పటికే 68 శాతం పనులు పూర్తయినట్లు వెల్లడించారు. మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావుతో కలిసి ఆయన హాస్పిటల్ పనులను బుధవారం ఆయన సందర్శించారు. ఆర్అండ్బీ శాఖ ఇంజినీర్లు ఏర్పాటు చేసిన ఫొటో ప్రదర్శనను తిలకించారు. హాస్పిటల్లో తిరుగుతూ క్షేత్రస్థాయిలో పనుల పురోగతిని తెలుసుకున్నారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ దాదాపు వెయ్యి మంది కార్మికులు హాస్పిటల్ పనులు చేస్తున్నారని తెలిపారు. సీఎం కేసీఆర్ ఆదేశాలతో హాస్పిటల్ ప్లింత్ ఏరియా 16.50 లక్షల చదరపు అడుగుల నుంచి 20.76 లక్షల చదరపు అడుగులకు పెరిగిందని, ఇప్పటివరకు 14 లక్షల చదరపు అడుగుల నిర్మాణం పూర్తయిందని వెల్లడించారు. దవాఖాన పడకల స్థాయి కూడా 2,100కు పెరిగిందన్నారు. వైద్యశాలలో 36 రకాల సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయని, ఇక వైద్యసేవల కోసం వరంగల్ ప్రజలు హైదరాబాద్ వెళ్లాల్సిన అవసరం ఉండదన్నారు. ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో ఆరు లేన్ల రోడ్డు నిర్మాణం చేపడుతూనే ఎమర్జెన్సీ సర్వీసుల కోసం అంబులెన్సులు ట్రామా కేర్లోకి సులువుగా వెళ్లేలా ప్రత్యేకమైన డెడికేటెడ్ రహదారి, ఎంట్రెన్స్లు ఉండేలా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు.
కిడ్నీ, లివర్ తదితర మార్పిడి చికిత్సలు జరిగినపుడు పేషెంట్ల బంధువులు ఈ హాస్పిటల్ ఆవరణలో 250 మంది ఎనీటైం ఉండేలా సకల సౌకర్యాలతో ధర్మశాలను నిర్మిస్తున్నట్లు చెప్పారు. 4,800 కిలోవాట్స్ పవర్ సరఫరాకు అనుగుణంగా 6 వేల కిలోవాట్స్ సామర్థ్యం గల జనరేటర్లను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. 1,200 కిలో లీటర్ల సామర్థ్యంతో ఎస్టీపీ ప్లాంట్, 800 కిలో లీటర్ల వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. 400 మంది రెసిడెంట్ డాక్టర్లకు అన్ని వసతులతో హాస్పిటల్పై ప్రత్యేక రూములు నిర్మిస్తున్నట్లు చెప్పారు. 450 మందితో సమావేశం నిర్వహించుకునేలా కాన్ఫరెన్స్ హాల్ ఉంటుందని, హెల్త్ యూనివర్సిటీతోపాటు సూపర్స్పెషాలిటీ హాస్పిటల్ వరంగల్లో ఉండడం గర్వకారణమన్నారు. ఇప్పటి వరకు పది అంతస్తుల వరకు పూర్తయిందని, వీటిలో వైద్య సేవలను ముందు దశలో అందించేందుకు హెల్త్, ఆర్అండ్బీ అధికారులు సమన్వయంతో ముందుకు పోవాలని సూచించారు. దసరాలోగా పది అంతస్తులను పూర్తి స్థాయిలో పూర్తి చేసి అందిస్తామని ఏజెన్సీ, అధికారులు చెప్పినట్లు వెల్లడించారు. 24 అంతస్తుల పనులను నవంబర్ వరకు పూర్తి చేసి జనవరి వరకు అందిస్తామని ఆర్అండ్బీ ఇంజినీర్లు చెప్పారని వివరించారు.
ప్రభుత్వ దవాఖానల్లో పెరిగిన డెలివరీ శాతం
ప్రభుత్వ దవాఖానల్లో 70 శాతం డెలివరీలు నమోదవుతున్నట్లు మంత్రి హరీశ్రావు వెల్లడించారు. కాంగ్రెస్ హయాంలో ప్రభుత్వ దవాఖానల్లో 30 శాతం, ప్రైవేట్లో 70 శాతం నమోదయ్యేవని, ఇపుడు ప్రభుత్వ దవాఖానల్లో 70శాతం, ప్రైవేట్లో 30 శాతం నమోదవుతున్నాయని చెప్పారు. సమావేశంలో మంత్రి ఎర్రబెల్లి, చీఫ్విప్ దాస్యం, ఎంపీ దయాకర్, ఎమ్మెల్యే అరూరి రమేశ్, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్రెడ్డి, మేయర్ గుండు సుధారాణి, దివ్యాంగుల సహకార సంస్థ చైర్మన్ వాసుదేవారెడ్డి, హనుమకొండ జడ్పీ చైర్మన్ సుధీర్కుమార్, డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ రమేశ్రెడ్డి, కలెక్టర్ ప్రావీణ్య, కార్పొరేషన్ కమిషనర్ రిజ్వాన్ బాషా, ఆర్అండ్బీ వరంగల్ ఎస్ఈ నాగేందర్రావు, ఈఈ జితేందర్రెడ్డి, ఎల్అండ్టీ ప్రాజెక్ట్ డైరెక్టర్ వెంకట్రెడ్డి, కాళోజీ హెల్త్ యూనివర్సిటీ వీసీ కరుణాకర్రెడ్డి, బీఆర్ఎస్ నేతలు ఎస్ సమ్మారావు, పుల్లా పద్మావతి, జీ కేశవరావు పాల్గొన్నారు.
ఒకే నియోజకవర్గం ఉన్న జిల్లాల్లో మెడికల్ కాలేజీలు రికార్డు
రాష్ట్రం ఏర్పడేనాటికి ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఒకేఒక కేఎంసీ ఉండేదని, ఇవ్వాళ అదనంగా ఏడు ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఉమ్మడి వరంగల్ జిల్లాకు వచ్చాయని గుర్తుచేశారు. ఒకే నియోజకవర్గం కలిగిన భూపాలపల్లి, ములుగు వంటి జిల్లాల్లోనూ తెలంగాణ ప్రభుత్వం మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేయడం దేశంలోనే రికార్డు అని అభివర్ణించారు. మారుమూల, గిరిజన ప్రాంతాలు కావడం వల్ల ఒకే నియోజకవర్గం ఉన్నా ములుగు, భూపాలపల్లి జిల్లాల్లో మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. ఇప్పటికే మహబూబాబాద్ జిల్లాలో మెడికల్ కాలేజీ ప్రారంభమైందని, ఈ ఏడాది జనగామ, భూపాలపల్లి జిల్లాల్లో మెడికల్ కాలేజీలను ప్రారంభించనున్నామన్నారు. త్వరలోనే పనులు మొదలుపెట్టి వచ్చే ఏడాది ములుగులోనూ మెడికల్ కాలేజీని ప్రారంభిస్తామని, ఏజెన్సీ ప్రాంతాల్లో ప్రజలకు వైద్యం అందుబాటులోకి తేవాలన్నదే సీఎం కేసీఆర్ ఆలోచన అని తెలిపారు. జనగామ మెడికల్ కాలేజీకి 51, భూపాలపల్లి మెడికల్ కాలేజీకి 54 మంది ప్రొఫెసర్లను నియమించి పోస్టింగ్ ఇచ్చామని, నేషనల్ మెడికల్ పర్మిషన్, నీట్ ఫలితాలు కూడా వచ్చినందున ఇక కౌన్సెలింగ్ ప్రారంభించి కేఎంసీ, మహబూబాబాద్తో పాటు జనగామ, భూపాలపల్లిలోనూ మెడికల్ కాలేజీలను ఓపెన్ చేస్తామన్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఐదు మెడికల్ కాలేజీలు రావడం దేశ చరిత్రలోనే గొప్ప అంశమని చెప్పారు. ఏ ప్రాంతం పిల్లలు అక్కడి కాలేజీలోనే చదవడమే తమ లక్ష్యమన్నారు.