పరకాల, ఏప్రిల్ 16 : పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి సుధీర్కుమార్ను భారీ మెజార్టీతో గెలిపించి పార్టీని మోసం చేసిన వారికి బుద్ధి చెప్పాలని మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. హనుమకొండలోని ఆయన నివాసంలో బీఆర్ఎస్ వరంగల్ ఎంపీ అభ్యర్థి మారపెల్లి సుధీర్కుమార్తో కలిసి ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గతంలో ప్రజా సంక్షేమమే లక్ష్యంగా కేసీఆర్ ప్రభుత్వం పాలన చేసిందని, కానీ మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం పాలనను పట్టించుకోవడం లేదని విమర్శించారు. రైతులకు సాగు నీరు ఇవ్వడం లేదని, మోటర్లు పెట్టుకుందామంటే కరెంటు ఉండడం లేదని, దీంతో లక్షల ఎకరాల్లో చేతికి వచ్చిన పంటలు ఎండుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజా సంక్షేమాన్ని విస్మరించిన కాంగ్రెస్ ప్రభుత్వానికి పార్లమెంట్ ఎన్నికల్లో బుద్ధి చెప్పాలన్నారు.