వరంగల్, జూలై 23(నమస్తేతెలంగాణ) : పండ్ల తోటల సాగుకు ముందుకొచ్చే రైతులకు ఆర్థిక సాయం అందించి ప్రోత్సహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఉద్యాన శాఖ ద్వారా ఉపాధి హామీ పథకం అనుసంధానం చేసి మామిడి, నిమ్మ, జామ, సపోట, సీతాఫలం, దానిమ్మ, మునగ తోటల పెంపకానికి రాయితీ ఇవ్వనున్నది. ఈ పథకానికి ఎస్సీ, ఎస్టీ, సన్న, చిన్నకారు రైతులు అర్హులు కాగా, ఐదెకరాల వరకు పరిమితి విధించింది. వరంగల్ జిల్లాలో 980 ఎకరాల్లో పండ్ల తోటల సాగుకు ఈ నెల 31వ తేదీ వరకు రైతుల నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నట్లు కలెక్టర్ ప్రావీణ్య తెలిపారు. – వరంగల్, జూలై 23(నమస్తేతెలంగాణ)
పండ్ల తోటల పెంపకంలో రైతులను ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. తోటల పెంపకం ఖర్చుతో కూడుకున్నది కావడంతో రైతులకు ఆర్థికంగా చేయూతనిచ్చేందుకు ఉపాధి హామీ పథకాన్ని అనుసంధానం చేసింది. ఉద్యాన శాఖ ద్వారా దీన్ని అమలు చేసేందుకు ప్రణాళిక రూపొందించింది. వరంగల్ జిల్లాలో 980 ఎకరాల్లో పండ్ల తోటల సాగుకు రైతులను ప్రోత్సహించాలని టార్గెట్ పెట్టింది. మామిడి, నిమ్మ, బత్తాయి, జామ, సపోట, సీతాఫలం, కొబ్బరి, జీడి మామిడి, ఆపిల్ బేర్, దానిమ్మ, మునగ, డ్రాగన్ ఫ్రూట్ తదితర తోటలను సాగు చేయాలని రాయితీలను కూడా ప్రకటించింది. ఈ పండ్ల తోటలు సాగు చేసే రైతులకు ప్రస్తుత సంవత్సరం నుంచి బిందు సేద్యం పరికరాలనూ సబ్సిడీపై అందజేయనున్నట్లు స్పష్టం చేసింది. షెడ్యూల్డ్ కులాలు, తెగలు, చిన్న కారు రైతులు, జాబ్ కార్డు, నీటి వసతి గల రైతులు రాయితీలను పొందడానికి అర్హులు. ప్రతి రైతుకు ఐదు ఎకరాల వరకు పరిమితి ఉంటుంది. డ్రాగన్ ఫ్రూట్ సాగుకు అర ఎకరం వరకు రాయితీ అందుతాయని ఉద్యానశాఖ అధికారి శంకర్ వెల్లడించారు.
పంటల వారీగా సాగు లక్ష్యాలు..
జిల్లాలో పంటల వారీగా అత్యధికంగా మామిడి తోటలను 400 ఎకరాల్లో సాగు చేయాలని టార్గెట్ పెట్టింది. మొక్కల మధ్య 7.5 మీటర్ల దూరం ఉండేవి 100, ఏడు మీటర్ల దూరం ఉండేవి 100, ఆరు మీటర్ల దూరం ఉండేవి 100, ఐదు, నాలుగు, మూడు మీటర్ల దూరం ఉండేవి 100 ఎకరాల్లో ఈ తోటలను సాగు చేయాలని, నిమ్మ తోట మొక్కల మధ్య 6 మీటర్ల దూరం ఉండేవి 30 ఎకరాలు, బత్తాయి 6.3 మీటర్ల దూరం ఉండేవి 20 ఎకరాల్లో, జామ 200 ఎకరాల్లో, సీతాఫలం 5 ఎకరాల్లో, సపోట 10 ఎకరాల్లో, మునగ 100 ఎకరాల్లో, డ్రాగన్ ఫ్రూట్ 5 ఎకరాల్లో, దానిమ్మ 10, కొబ్బరి బండ్ ప్లాంటేషన్ 200 ఎకరాల్లో సాగు చేయాలని లక్ష్యాలను నిర్దేశించింది. ఒక్కో ఎకరానికి మామిడి తోటకు 70 నుంచి 666, నిమ్మ తోటకు 110, బత్తాయి తోటకు 100, జామ తోటకు 110 నుంచి 444, సీతాఫలం తోటకు 160 నుంచి 444, సపోట తోటకు 60, మునగ తోటకు 1,000, దానిమ్మ తోటకు 265, కొబ్బరి బండ్ ప్లాంటేషన్కు 40 మొక్కల చొప్పున ఉద్యానశాఖ ద్వారా అందజేయనుంది. ఒక్కో మామిడి మొక్కకు రూ.30, నిమ్మకు 25, బత్తాయికి రూ.44, జామకు రూ.31, సీతాఫలానికి రూ.26, సపోటకు రూ.37, దానిమ్మకు రూ.24, కొబ్బరికి రూ.36గా నిర్ణయించింది. ఈ పండ్ల తోటలను సాగు చేసే రైతులకు ఉపాధి హామీ పథకం ద్వారా భూసార పరీక్ష, గుంతలు తీయడం, మొక్కలు నాటడం, ఊత కర్ర నాటడం, మొక్కల ఖరీదు, ఎరువులపై ఒక మొక్కకు రూ.50 చొప్పున మూడు సంవత్సరాల వరకు, వాచ్ వార్డు కోసం ఒక మొక్కకు ప్రతి నెలా రూ.10 చొప్పున మూడేళ్ల పాటు, బిందు సేద్యం పరికరాలపై 90 శాతం రాయితీ వర్తించనుంది. ఐదు ఎకరాలలోపు భూమి, నీటి వసతి, జాబ్ కార్డు కలిగిన ఎస్సీ, ఎస్టీ, సన్న, చిన్నకారు రైతులను ఈ పండ్ల తోటల సాగు కోసం లబ్దిదారులుగా ఎంపిక చేయడానికి ఉద్యానశాఖ అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఆసక్తి గల అర్హులైన రైతులు తమ పేర్లను ఈ నెల 31వతేదీ లోగా నమోదు చేసుకోవాలని కలెక్టర్ పీ ప్రావీణ్య కోరారు.