వరంగల్, మార్చి 6(నమస్తేతెలంగాణ) : రైతులు ఆర్థికంగా నిలదొక్కుకొనేందుకు రాష్ట్ర సర్కారు అన్ని చర్యలు తీసు కుంటున్నది. విత్తనాలు నాటినప్పటి నుంచి మొదలుకొని పంట కోసి విక్రయించే వరకు వెన్నుదన్నుగా నిలుస్తున్నది. ఏటా రెండు దఫాలుగా రైతుబంధు పథకం ద్వారా పెట్టుబడి సాయం అందించి అన్నదాతలు అప్పులపాలు కాకుండా కాపాడుతున్నది. ఇప్పుడు రైతులకు సబ్సిడీపై విద్యుత్ మోటర్లను పంపిణీ చేస్తున్నది. ఇది బోర్వెల్, ఓపెన్వెల్ ఉన్న వారికి ప్రయోజనకరంగా మారనున్నది. 50 శాతం సబ్సిడీపై 3, 5, 7.5 హెచ్పీ కరంటు మోటర్లను అందజేస్తున్నది. ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి చొరవతో నర్సంపేట నియోజకవర్గంలో పైలట్ ప్రాజెక్టుగా దీన్ని అమలు చేస్తుండగా, రెండు విడుతల్లో మొత్తం 5,189 మంది లబ్ధి పొందనున్నారు. ఈ నెలాఖరులోగా పంపిణీ పూర్తి చేస్తామని జిల్లా ఉద్యానశాఖ అధికారి శంకర్ తెలిపారు.
వ్యవసాయరంగానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తున్నది. విద్యుత్ కోతలు, కొరతకు తెరదించింది. 24 గంటలు నాణ్యమైన కరంటు సరఫరా చేస్తున్నది. మార్కెట్లో ఎరువులు, పురుగు మందుల కొరత తీర్చింది. సాగునీటి వసతి కోసం ప్రాజెక్టులు నిర్మించింది. కాళేశ్వరం వంటి భారీ ఎత్తిపోతల పథకంతో ఎస్సారెస్పీ కాల్వల ద్వారా చెరువుల్లోకి గోదావరి జలాలను తరలిస్తున్నది. దీంతో భూగర్భ జలమట్టం గణనీయంగా పెరిగింది. నీటి సౌకర్యం లేక బీడు పడ్డ భూములన్నీ సాగులోకి వస్తున్నాయి. నిరంతర విద్యుత్తో పాటు సాగునీరు కూడా అందుబాటులోకి రావడంతో రాయితీపై కరంటు మోటర్లను సమకూర్చుతున్నది. పైలట్ ప్రాజెక్టులకు కేరాఫ్గా మారిన నర్సంపేట శాసనసభ నియోజకవర్గం పరిధిలో సబ్సిడీపై రైతులకు విద్యుత్ మోటర్ల పంపిణీ కార్యక్రమం అమల్లోకి వచ్చింది. సుమారు రూ.7.78 కోట్ల సబ్సిడీతో 5,189 కరంటు మోటర్లను పంపిణీ చేస్తున్నారు. వీటిని ఈ నెలాఖరులోగా అందజేయాలని అధికారులకు ప్రభుత్వం లక్ష్యం నిర్దేశించింది. పర్ డ్రాప్ మోర్ క్రాప్ (పీడీఎంసీ) పథకం ద్వారా రైతులకు దీన్ని అమలు చేస్తున్నది. ఈ పథకం నుంచి కరంటు మోటరు పొందిన బోర్వెల్, ఓపెన్వెల్ కలిగిన రైతులకు ఒక్కొక్కరికి రూ.15 వేల వరకు సబ్సిడీ ఇస్తున్నది. ఉద్యానశాఖ ద్వారా ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నది. తొలివిడుత 2018-19 ఆర్థిక సంవత్సరంలో ఇక్కడి రైతులకు 2,589 మోటర్లను సబ్సిడీపై అందజేసింది. రెండోవిడుత ఈ ఆర్థిక సంవత్సరం మరో 2,600 కరంటు మోటర్లను రైతులకు పంపిణీ చేస్తున్నది.
లబ్ధిదారుకు మోటరు, పంపు..
పీడీఎంసీ పథకం ద్వారా ప్రభుత్వం లబ్దిదారులకు కరంటు మోటరుతో పాటు పంపును సబ్సిడీపై ఇస్తున్న ది. ఆసక్తి గల రైతులు మీసేవ కేంద్రాల ద్వారా ఉద్యానశాఖకు దరఖాస్తు అందజేయాలి. ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీపోను మిగిలిన మొత్తాన్ని రైతులు తమ వాటాధనంగా బ్యాంకులో చెల్లించిన డీడీ, పట్టాదారు పాసు పుస్తకం ప్రతిని జతచేయాలి. వీటిని ఉద్యానశాఖ అధికారులు పరిశీలించి సదరు దరఖాస్తుదారు వ్యవసాయ భూమి, బోర్వెల్, ఓపెన్వెల్, కరంటు సరఫరాను క్షేత్రస్థాయిలో చూస్తారు. బోర్వెల్ మోటరు విలువ రూ.30 వేల నుంచి రూ.40,500 వరకు, 5 హెచ్పీ మోటరుకు రూ.30 వేల నుంచి రూ.32 వేల వరకు, 7.5 హెచ్పీ మోటరు విలువ రూ.40 వేల నుంచి రూ.40,500 ఉండగా వీటిలో దేనికైనా ప్రభుత్వం రూ.15 వేలు సబ్సిడీగా ఇస్తుంది. ఓపెన్వెల్ కరంటు మోటర్ల విలువ రూ.26,900 నుంచి రూ.34 వేల వరకు ఉంది. వీటిలో రూ.26,900 విలువ గల 3 హెచ్పీ మోటరుకు ప్రభుత్వం యాభై శాతం సబ్సిడీ రూ.13,450 ఇస్తుండగా లబ్ధిదారులు మిగతా రూ.13,450 తమ వాటాధనంగా, రూ.29,500 విలువ గల 5 హెచ్పీ మోటరుకు రూ.14,750 సబ్సిడీ ఇస్తుండగా మిగతా రూ.14,750 నాన్సబ్సిడీని చెల్లిస్తున్నారు. రూ.34 వేల విలువ గల 7.5 హెచ్పీ మోటరుకు రూ.15 వేలు సబ్సిడీ ఇస్తుంది. నర్సంపేట, నల్లబెల్లి, దుగ్గొండి, చెన్నారావుపేట, ఖానాపురం, నెక్కొండ మండలాల్లోని రైతులు సబ్సిడీ మోటర్లను పొంది సద్వినియోగం చేసుకుంటున్నారు. రైతులకు ప్రయోజనం కలగాలనే ఉద్దేశంతో ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి ఈ సబ్సిడీ మోటర్ల పంపిణీపై సంబంధిత అధికారులతో సమీక్షలు నిర్వహిస్తూ క్షేత్రస్థాయిలో పథకం అమలుకు ప్రత్యేక చొరవ కనబరుస్తున్నారు.
నెలాఖరులోగా పంపిణీ పూర్తి..
– శంకర్, ఉద్యానశాఖ అధికారి, వరంగల్
ప్రత్యేకించి నర్సంపేట నియోజకవర్గంలో రైతులకు సబ్సిడీపై విద్యుత్ మోటర్లు పంపిణీ చేస్తున్నాం. 2018-19లో ఇక్కడ తొలివిడుత 2,589 మంది రైతులకు అందజేశాం. రెండో విడుత ఈ ఏడాది మరో 2,600 మందికి కరంటు మోటర్లను ఇస్తున్నాం. మార్చి నెలాఖరులోగా పంపిణీ చేయాలనేది ప్రభుత్వ టార్గెట్. కొద్దిరోజుల నుంచి ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి రైతులకు వీటిని అందజేస్తున్నారు.
రైతుల పాలిట దేవుడు సీఎం కేసీఆర్..
– భాషబోయిన ఐలయ్య, రైతు చిన్నగురిజాల, నర్సంపేట మండలం
నర్సంపేట రూరల్ : నాకు ఇదే గ్రామ శివారులో మూడెకరాల వ్యవసాయ భూమి ఉంది. గత ఏడాది పత్తి పంట వేశాను. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీ విద్యుత్ మోటర్లు అందిస్తున్నదని తెలువడంతో పత్తి అమ్మగా వచ్చిన డబ్బులతో డీడీ తీశాను. సోమవారం నర్సంపేటలో ఎమ్మెల్యే పెద్ది మోటరును అందించారు. బీదవారికి రాయితీ మోటర్లు అందించడం గొప్ప విషయం. రైతుల పాలిట దేవుడి సీఎం కేసీఆర్.