జిల్లాలో యాసంగి పంటల సాగు కోసం వ్యవసాయ శాఖ అధికారులు ప్రణాళికలు రూపొందించారు. సరిపడా సాగునీరు, ప్రభుత్వం వ్యవసాయానికి నిరంతరంగా విద్యుత్ను సరఫరా చేస్తుండడంతో సాగు విస్తీర్ణం పెరుగనుంది. గతేడాది 1,69,376 ఎకరాలుగా కాగా.. ఈసారి 1,84,140 ఎకరాల్లో రైతులు వివిధ రకాల పంటలు వేసే అవకాశం ఉందని అంచనా వేశారు. ఈ సీజన్లో వరి పంట తర్వాత మక్కజొన్నకే ప్రాధాన్యం ఇవ్వనున్నారు. 2902 క్వింట్లాళ వరి విత్తనాలు, 4,800 క్వింటాళ్ల మక్కజొన్నలు, 63 క్వింటాళ్ల పల్లికాయ, 292 క్వింటాళ్ల పప్పుదినుసులకు సంబంధించిన విత్తనాలు రైతులకు అందుబాటులో ఉంచారు. 4,074 టన్నుల యూరియాతోపాటు డీఏపీ, ఇతర ఎరువుల నిల్వలు ఉన్నాయి.
హనుమకొండ సబర్బన్, నవంబర్ 3 : వానకాలం పంటలు ముగింపు దశలో ఉన్నాయి. వరి కోతలు ముమ్మరంగా సాగుతున్నాయి. రోహిణి కార్తెలో వరి నాట్లు వేసిన రైతులు ధాన్యాన్ని కూడా విక్రయించారు. మళ్లీ యాసంగి కోసం నార్లు పోసేందుకు సిద్ధమవుతున్నారు. ఇక పత్తి ఏరుడు కూడా ప్రారంభమైంది. మరో నెల పాటు చివరి పత్తిని ఏరుకుని ఆ పంటను తొలగించి మక్కజొన్న వేసేందుకు రైతులు సిద్ధమవుతున్నారు. ఇందుకు సరిపడా సాగునీరు పుష్కలంగా అందుబాటులో ఉంది. దీనికి తోడు ప్రభుత్వం వ్యవసాయానికి విద్యుత్ కూడా సరిపడా ఇస్తుండడంతో ఉత్సాహంతో రైతులు యాసంగి పంట వైపు వెళ్తున్నారు. గత ఏడాది కంటే ఈసారి సాగు భారీగా పెరుగనుంది. 1,84,140 ఎకరాల్లో పలు రకాల పంటలను రైతులు వేస్తారని వ్యవసాయ శాఖ అంచనాలను సిద్ధం చేసింది. ఇందుకు అనుగుణంగానే ఎరువులు, విత్తనాలు, పురుగు మందులు రైతులకు అందుబాటులో ఉంచుతోంది.
వరి పంటదే అగ్రస్థానం
యాసంగిలో వరి పంటవైపే రైతులు పెద్ద ఎత్తున మొగ్గు చూపుతున్నారు. గత ఏడాది 1,10,791 ఎకరాల్లో వరిని సాగుచేయగా.. ఈసారి 1,20,500 ఎకరాల్లో సాగు చేసేందుకు సిద్ధమవుతున్నారు. గతంలో 55 వేల ఎకరాల్లో మక్కజొన్న సాగుచేయగా ఈసారి 60 వేల ఎకరాల్లో వేయనున్నారు. వేరుశనగ 2 వేల ఎకరాల నుంచి 2,150కి పెరుగనుంది. పెసర్లు, ఇతర పప్పు దినుసులు 1,410 ఎకరాలు ఉండగా, ఈసారి 1,480 ఎకరాలకు పెరుగనుంది.1,69,376 ఎకరాలుగా ఉన్న గత యాసంగి సాగు ఈసారి 1,84,140 ఎకరాలుగా ఉంటుందని వ్యవసాయ శాఖ అధికారులు అంచనాలు సిద్ధం చేశారు.
పుష్కలంగా ఎరువులు
జిల్లాలో యాసంగికి సరిపడా వివిధ రకాల ఎరువులు మార్క్ఫెడ్ గోదాముల్లో బఫర్ నిల్వలుగా ఉన్నాయి. గతంలో ఎరువుల కోసం ఇబ్బందులు ఎదుర్కొనే వారు. ప్రభుత్వం ముందస్తు ప్రణాళికతో ఎరువుల సరఫరాకు ఎలాంటి ఆటంకాలు లేకుండా ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటోంది. దాదాపు జనవరి నుంచి ఎరువుల వినియోగం మొదలవుతుంది. ఈ ఏడాది వానకాలంలో 8వేల టన్నుల ఎరువులను వినియోగించారు. ఇక యాసంగి విషయానికొస్తే 4,074 టన్నుల యూరియా(85వేల బస్తాలు)తో పాటు డీఏపీ, 20-20-0-13 బఫర్గా ఉన్నాయి. ఇంకా నవంబర్, డిసెంబర్ కోటా ఎరువులు రావాల్సి ఉంది. ఇదేకాకుండా ప్రైవేట్ వ్యాపారుల వద్ద కూడా భారీగా ఎరువుల నిల్వలు ఉన్నాయి. రైతులు ఎరువుల కోసం బారులు తీరాల్సిన అవసరం ఉండదు.
సరిపడా విత్తనాలు
యాసంగి సాగు కోసం సరిపడా విత్తనాలను కూడా వ్యవసాయ శాఖ అందుబాటులో ఉంచింది. జిల్లాలో పెద్ద మొత్తంలో విత్తన సాగుతోపాటు ప్రైవేట్ సీడ్ కంపెనీలు కూడా బై బ్యాక్ పద్ధతిలో రైతులతో వరి, మక్కజొన్న పంటలను సాగు చేయించి కొంటున్నాయి. వరి విత్తనాలు ప్రైవేట్ వ్యాపారులతో పాటు రాష్ట్ర సీడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో కూడా 2902 క్వింటాళ్లు అందుబాటులో ఉన్నాయి. ఇక 4,800 క్వింటాళ్ల మక్కజొన్నలు, 63 క్వింటాళ్ల పల్లికాయ, 292 క్వింటాళ్ల పప్పుదినుసులకు సంబంధించిన విత్తనాలు రైతులకు అందుబాటులో ఉంచారు. ఈసారి యాసంగిలో పత్తి సాగును ఎక్కువ మొత్తంలో సాగు చేసేందుకు రైతులు సిద్ధమవుతున్నారు. ఈ విత్తనాలు కూడా ప్రైవేట్ వ్యాపారుల వద్ద ఉన్నాయి.
అందుబాటులో అధికారులు
ఈసారి వర్షాలు సమృద్ధిగా కురిశాయి. భూగర్భ జలాలు భారీగా పెరుగడంతో పాటు మిషన్ కాకతీయతో చెరువుల్లో కూడా పెద్ద ఎత్తున నీటి నిల్వ ఉంది. ప్రాజెక్టులు కూడా నిండుకుండల్లా ఉన్నాయి. యాసం గి సాగు కోసం రైతులు ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారు. ప్రభుత్వం తరఫున విత్తనాలను అందుబాటులో ఉంచాం. దీనికి తోడు వ్యవసాయ శాఖ సిబ్బంది ఎప్పుడూ వ్యవసాయ క్లస్టర్లలో రైతులకు అందుబాటులో ఉంటారు.
– బొందిల రవీందర్సింగ్, జిల్లా వ్యవసాయాధికారి
పుష్కలంగా ఎరువులు..
గతంలో మాదిరిగా కాకుండా ఈసారి పెద్ద మొత్తం లో ఎరువులు జిల్లా గోదాముల్లో నిల్వ చేశాం. ఇంకా రెండు నెలల ఎరువుల కోటా మనకు రావాల్సి ఉంది. జనవరి నుంచి యాసంగి పంటలకు రైతులు ఎరువులను వినియోగిస్తారు. ప్రైవేట్ వ్యాపారుల వద్ద కూడా ఎరువులు పుష్కలంగా ఉన్నాయి. యూరియాతో పాటు కాంప్లెక్స్ ఎరువులు సరిపడా రైతులకు అందుబాటులో ఉంచుతాం.
– శ్యాం, మార్క్ఫెడ్ డీఎం