బచ్చన్నపేట, మార్చి 23 : ఓ వైపు కంటికి రెప్పలా కాపాడిన తండ్రి తిరిగి రాని లోకాలకు వెళ్లాడు.. మరోవైపు పదో తరగతి పరీక్షలు.. కుటుంబం విషాదంలో ఉండగా దుఃఖాన్ని దిగమింగుకుని పరీక్ష రాసిన విద్యార్థిని ఉదంతం చూపరులను కంటతడి పెట్టించింది. వివరాల్లోకి వెళ్తే.. జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం పడమటికేశ్వాపూర్కు చెందిన రైతు కొమ్మాట రఘుపతి భూ సమస్యలతో ఆందోళనకు గురై శుక్రవారం ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
దీంతో కుటుంబం విషాదంలో మునిగిపోయింది. ఈ నేపథ్యంలో రఘుపతి కుమార్తె మహాలక్ష్మి పుట్టెడు దుఃఖంలో శనివారం కొన్నెలో పరీక్ష రాసేందుకు వెళ్లింది. ఈ ఉదంతం స్థానికుల హృదయాలను ద్రవింప చేసింది. తండ్రి మృతదేహం ఇంటి వద్ద ఉండగానే పదో తరగతి పరీక్ష రాసి వచ్చి అంత్యక్రియల్లో పాల్గొంది. ‘అయ్యోబిడ్డా.. ఎంత కష్టమొచ్చెనమ్మా..!’ అంటూ బంధువులు కుటుంబ సభ్యులు, బంధువులు ఆవేదన వ్యక్తంచేశారు.