Station Ghanpur | స్టేషన్ ఘన్పూర్, నవంబర్ 19 : ఒకప్పుడు కరువుకు నిలయమైన స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గం స్వరాష్ట్రంలో సస్యశ్యామలంగా మారింది. సమైక్య పాలనలో సాగు, తాగునీరందక ఇబ్బందిపడిన ప్రజలకు నేడు గోదావరి జలాలు అందుతున్నాయి. నాడు కరెంట్ కోతలతో పంటలకు నీరందించలేక, మోటర్లు కాలిపోయి అప్పుల్లో కూరుకుపోయిన రైతులు ఆత్మహత్యలు చేసుకునేవారు. బతుకుదెరువు కోసం పొట్టచేత పట్టుకుని భీవండి, సూరత్, హైదరాబాద్ వంటి నగరాలకు వలస వెళ్లేవారు. గ్రామాల్లో బీడుభూములు, తాళాలు వేసి ఉన్న ఇండ్లు కనిపించేవి. తాగు నీటి కోసం మహిళలు కిలోమీటర్ల దూరంలో ఉన్న వ్యవసాయ బావుల వద్దకు వెళ్లాల్సిన దుస్థితి ఉండేది. ప్రజాప్రతినిధులు గ్రామాల్లోకి వస్తే ప్రజలు నిలదీయడంతో పాటు ఆందోళన చేసే పరిస్థితి నెలకొనేది. ఈ నేపథ్యంలో ఉద్యమ నేత, సీఎం కేసీఆర్ పోరాట ఫలితంగా స్వరాష్ట్రం సాకారం కావడంతో సాగునీటి ప్రాజెక్టులతోపాటు వాగులపై చెక్డ్యాముల నిర్మాణం జరిగింది. ఫలితంగా గోదావరి జలాలతో చెరువులు, కుంటలు నింపుతుండడంతో మండు వేసవిలోనూ సమృద్ధిగా జలాలుంటున్నాయి. ‘మిషన్ కాకతీయ’లో చెరువులను పునరుద్ధరించడంతో నీటి నిల్వ పెరిగింది. ‘మిషన్ భగీరథ’ ద్వారా ఇంటింటికీ స్వచ్ఛమైన తాగునీరు అందుతున్న ది. వ్యవసాయానికి నిరంతరం నాణ్యమైన ఉచిత విద్యు త్ ఇస్తుండడంతో పంటల సాగు విస్తీర్ణం పెరిగింది. దీం తో స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గ రూపురేఖలు మారిపోయాయి. పట్టణాలకు వలస వెళ్లిన రైతులు, కూలీలు స్వస్థలాలకు వచ్చి వ్యవసాయం చేసుకుంటున్నారు.
స్టేషన్ఘన్పూర్ నియోజకవర్గంలో దేవాదుల ఎత్తిపోతల పథకంలో భాగంగా 6 రిజర్వాయర్లను నిర్మించారు. వీటి ద్వారా వేలాది ఎకరాలకు సాగునీరందుతూ విస్తీర్ణం పెరిగింది. స్టేషన్ ఘన్పూర్లో 1.5 టీఎంసీ సామర్థ్యంగల రిజర్వాయర్ నిర్మించడంతో 28,800 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందుతున్నది. గండి రామారం రిజర్వాయర్ 0.4 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించారు. కుడి కాలువ కింద 5,600 ఎకరాలు, ఎడమ కాలువ ద్వారా 4000 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందుతున్నది. రూ. 29 కోట్లతో కుడి కాలువ పనులు కొనసాగుతున్నాయి. లింగాలఘనపురం మండలం నవాబ్పేట రిజర్వాయర్ 0.5 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించారు. దీనిద్వారా 53,400 ఎకరాలకు, అశ్వరావుపల్లి రిజర్వాయర్ 0.74 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించడంతో 43,000 ఎకరాలకు సాగునీరందుతున్నది. ధర్మసాగర్ మండల కేంద్రంలో 1.5 టీఎంంసీలతో రిజర్వాయర్ నిర్మించడంతో లక్షా 27 వేల ఎకరాలకు సాగునీరు అందుతున్నది. ఉప్పుగల్లు రిజర్వాయర్ 0.5 టీఎంసీల సామర్థ్ధ్యంతో నిర్మించారు. ఇక్కడి నుంచి జఫర్గఢ్ చెరువుకు కాల్వ ద్వారా నీరందించేందుకు పనులు చేపట్టారు. ఇది పూర్తయితే 42 వేల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందనుంది. చిల్పూర్, ధర్మసాగర్ మండలాల్లోని ఎగువ ప్రాంతాలకు సాగునీరు అందించేందుకు రిజర్వాయర్లపై లిఫ్ట్ల ఏర్పాటుకు రూ.105 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసింది.
మిషన్ భగీరథ పథకం ద్వారా ధర్మసాగర్ రిజర్వాయర్ నుంచి ఇంటింటికీ శుద్ధిచేసిన తాగునీరు అందిస్తున్నారు. చిల్పూరు మండలంలో మూడు, రఘునాథపల్లి మండలంలో నాలుగు, లింగాలఘన్పూర్ మండలంలో ఒక ఓహెచ్బీఆర్ఎస్ ఏర్పాటు చేశారు. ప్రతి రోజూ స్టేషన్ ఘన్పూర్ మండలంలో 68 లక్షల 47 వేల లీటర్ల శుద్ధిచేసిన నీటిని మిషన్ భగీరథ ద్వారా అందిస్తున్నారు. చిల్పూరు మండలంలో 44 లక్షల 26 వేలు, రఘునాథపల్లి మండలంలో 62 లక్షల 3 వేలు, లింగాలఘనపురం మండలంలో 44 లక్షల 72 వేలు, జఫర్గఢ్ మండలంలో 40 లక్షల 75 వేలు, ధర్మసాగర్ మండలంలో 40 లక్షల 75 వేలు, వేలేర్ మండలంలో 23 లక్షల లీటర్ల శుద్ధి చేసిన తాగునీటిని అందిస్తున్నారు. ఎడ్యుకేషన్ హబ్గా స్టేషన్ ఘన్పూర్ స్వరాష్ట్రంలో బడి ఈడు పిల్లలందరినీ పాఠశాలల్లో చేర్పించడంతోపాటు వారికి నాణ్యమైన విద్యను అందించాలనే లక్ష్యంతో స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గంలో గురుకుల పాఠశాలలు, కళాశాలలను ఏర్పాటు చేశారు. నియోజకవర్గంలో మహాత్మాజ్యోతిరావు ఫూలే, మైనార్టీ, కస్తూర్భాగాంధీ, మోడల్ స్కూల్, పాలిటెక్నిక్ కళాశాల, బాలికల రెసిడెన్షియల్ డిగ్రీ కళాశాల ఏర్పాటుతో ఎంతో మంది పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుతున్నది. మరోవైపు జిల్లాల పునర్విభజన అంనతరం స్టేషన్ ఘన్పూర్ రెవెన్యూ డివిజన్ కేంద్రంగా ఏర్పడింది. అనంతరం ఫైర్ స్టేషన్, మినీ స్టేడియం ఏర్పాటు చేశారు. డివిజన్ కేంద్రానికి వంద పడకల దవాఖాన, కోర్టు మంజూరయ్యాయి. ఎన్నికల అనంతరం వీటి నిర్మాణం చేపట్టనున్నారు. మరోవైపు స్టేషన్ ఘన్పూర్, శివునిపల్లి, చాగల్లు గ్రామాలను కలిపి మున్సిపాలిటీగా ఏర్పాటు కానుంది. ఇందుకోసం ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణ రూపొందించగా ఎన్నికలు రావడంతో కార్యరూపం దాల్చలేదు. చిల్పూర్లోని బుగులు వేంకటేశ్వర స్వామి ఆలయ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం రూ.10 కోట్లు కేటాయించింది. స్వరాష్ట్రంలో పెద్ద ఎత్తున అభివృద్ధి పనులు జరుగుతుండడంతో స్టేషన్ఘన్పూర్ నియోజకవర్గం ప్రగతిబాటలో పయనిస్తున్నది.