మహబూబాబాద్, ఫిబ్రవరి 18 : రాష్ట్రంలో మహిళలు, యువతులు, విద్యార్థినులు, చిన్నారుల రక్షణే ప్రథమ కర్తవ్యంగా పోలీస్ శాఖ పనిచేస్తున్నదని రాష్ట్ర గిరిజన, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ పేర్కొన్నారు. శనివారం మహబూబాబాద్ జిల్లాకేంద్రంలోని టౌన్ పోలీస్స్టేషన్ ఆవరణలో జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్ ఆలోచన మేరకు ఏర్పాటుచేసిన మదర్, చైల్డ్ కోసం పోలీస్ ఫ్రెండ్లీ రూమ్ను ఎంపీ, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు మాలోత్ కవిత, ఎమ్మెల్సీ తక్కళ్లపల్లి రవీందర్రావు, ఎమ్మెల్యే బానోత్ శంకర్నాయక్, కలెక్టర్ కే.శశాంక, ఎస్పీ శరత్చంద్ర పవార్లతో కలిసి మంత్రి ప్రారంభించారు.
ఫ్రెండ్లీ రూమ్లో సమకూర్చిన వస్తువులను చూపిస్తూ చిన్నారులతో మంత్రి సత్యవతి సరదాగా గడిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలోనే తొలిసారి మదర్, చైల్డ్ కోసం పోలీస్ ఫ్రెండ్లీ రూమ్ను ఏర్పాటుచేయడం ప్రశంసనీయమని ఎస్పీ శరత్చంద్ర పవార్ను అభినందించారు. సీఎం కేసీఆర్ సూచనలతో శాంతిభద్రతల పరిరరక్షణ, మహిళ రక్షణ, నేర విచారణ, నేరస్తులకు శిక్షలు పడేలా విధులు నిర్వహిస్తున్న తెలంగాణ పోలీసులు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నారని కొనియాడారు.
ఫిర్యాదులు చేయడానికి, దోషులను కలవడానికి వచ్చిన తల్లి, పిల్లలు సేద తీరేందుకు ఈ ఫ్రెండ్లీ పోలీస్రూమ్ను ఏర్పాటుచేశామని.. మహిళలకు ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పారు. ఎక్కువ సమయం పోలీస్స్టేషన్లో ఉండే సమయంలో మహిళలు, చిన్నారులు ఇబ్బందులు పడకుండా తగిన విశ్రాంతి తీసుకునేందుకు బెడ్స్, చిన్నారులు పోలీసుస్టేషన్కు వచ్చిన ఫీలింగ్ రాకుండా రూమ్లో అన్ని రకాల ఆట వస్తువులు అందుబాటులో ఉంచడం మంచి పరిణామమన్నారు. సీడబ్ల్యూసీ చైర్పర్సన్ సుంకరనేని నాగవాణి మాట్లాడుతూ ఇలాంటి ఫ్రెండ్లీ రూమ్ను ఏర్పాటుచేయడాన్ని తెలంగాణ ప్రభుత్వం మహిళలకు ఇస్తున్న గౌరవంగా పేర్కొన్నారు. ఇదే స్ఫూర్తితో ప్రతి పోలీస్స్టేషన్లో ఏర్పాటుచేయాలని కోరారు. కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ జోగుల చెన్నయ్య, మున్సిపల్ చైర్మన్ రామ్మోహన్రెడ్డి, టౌన్ సీఐ యడ్లపల్లి సతీశ్, ఎస్సైలు రవి, క్రాంతికిరణ్ కనుకుల, దీపికారెడ్డి, వైస్ చూర్మన్ ఫరీద్, మంగళంపల్లి కన్న, మడత వెంకన్న, సఖి సెంటర్ సెంట్రల్ అడ్మిన్ శ్రావణి, రెడిన్ కలర్ ల్యాబ్ లక్ష్మణ్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.