ములుగు, జూన్ 7 (నమస్తేతెలంగాణ) : తాను ఏడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచానని, తనకు 40 ఏండ్ల రాజకీయం అనుభవం ఉందని, ఎన్నో ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చినా కూడా తెలంగాణ ప్రాంతంలో తట్టెడు మట్టి పోసి అభివృద్ధి చేయలేదని రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. సాధించుకున్న తెలంగాణలో సీఎం కేసీఆర్ ఎవరూ ఊహించని అభివృద్ధిని చేపట్టారన్నారు. తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ములుగులో బుధవారం నిర్వహించిన సాగునీటి దినోత్సవ సభలో మంత్రి మాట్లాడారు. హైదరాబాద్కు ఎంతో దూరంలో ఉన్న ములుగు గత ప్రభుత్వాల హయాం లో ఎన్నో కష్ట నష్టాలకు నలిగిపోయిందని గుర్తుచేశారు. గూడేలు, పల్లెల్లో ఎండాకాలం వచ్చిందంటే ఆడబిడ్డలు తాగునీటి కోసం తల్లడిల్లేవారన్నారు. ఆ సమయంలో సర్పంచ్లు, ఎంపీటీసీలు, ప్రజాప్రతినిధులుగా ఉన్న వారు గ్రామాల్లోకి వెళ్లాలంటే భయపడేవారన్నారు.
ఎక్కడ బిందెలు, కుండలు అడ్డుపెట్టి తమను అడ్డుకుంటారో, గ్రామంలో ప్రజలు నిలదీస్తారోనని గ్రామాలకు రాకుండా ఉండేవారని గుర్తు చేశారు. గడిచిన పదేళ్లలో సీఎం కేసీఆర్ ఆడబిడ్డల నీటి కష్టాలను తీర్చారన్నారు. మారుమూల గ్రామాల్లోకి కూడా మిషన్ భగీరథ ద్వారా గోదావరి జలాలను ఇంటింటికీ అందించారన్నారు. ప్రస్తుతం నీటి గోస ఎక్కడా లేదని, నీటి కష్టాలు తీర్చిన గొప్ప మహనీయుడు సీఎం కేసీఆర్ అని చెప్పారు. ములుగులో నాడు రవాణా సౌకర్యాలు సరిగా లేవని, ఏటూరునాగారం, పస్రా, మంగపేట, ములుగు ప్రాంత ప్రజలు హనుమకొండకు వెళ్లాలంటే అష్టకష్టాలు పడే వారని చెప్పారు. ఈ ప్రాంత ప్రజలకు పరిపాలనను దగ్గర చేసేందుకు సీఎం కేసీఆర్ ఇచ్చిన మాట ప్రకారం ములుగును జిల్లాగా చేసి గొప్పగా అభివృద్ధి చేశారన్నారు. కాంగ్రెస్ హయాంలో ములుగు అభివృద్ధి చెందిందా, బీఆర్ఎస్ హయాంలో అభివృద్ధి చెందిందా అనేది ఇక్కడి ప్రజలు గమనించాలన్నారు. గత ఎన్నికల్లో జరిగిన పొరపాటును తిరిగి చేయకుండా బీఆర్ఎస్ పక్షాన నిలవాలని కోరారు.
అభ్యర్థిగా ఎవరిని ప్రకటించినా అందరూ కలిసి కట్టుగా పని చేసి గెలుపు కోసం కృషి చేయాలన్నారు. కార్యక్రమాల్లో ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్రెడ్డి, పోచంపల్లి శ్రీనివాస్రెడ్డి, డీజీపీ అంజనికుమార్యాదవ్, ఎమ్మెల్యేలు పెద్ది సుదర్శన్రెడ్డి, గండ్ర వెంకటరమణారెడ్డి, జడ్పీ అధ్యక్షులు కుసుమ జగదీశ్, గండ్ర జ్యోతి, అంగోత్ బిందు, వైస్ చైర్మన్ బడే నాగజ్యోతి, కలెక్టర్ కృష్ణ ఆదిత్య, ఎస్పీ గౌస్ ఆలం, జలవనరుల సంస్థ చైర్మన్ వీ ప్రకాశ్రావు, రెడ్కో చైర్మన్ ఏరువ సతీశ్రెడ్డి, దివ్యాంగుల అభివృద్ధి సంస్థ చైర్మన్ వాసుదేవారెడ్డి, రైతు రుణ విమోచన కమిషన్ చైర్మన్ నాగుర్ల వెంకటేశ్వర్లు, జడ్పీటీసీలు గై రుద్రమదేవి, సకినాల భవాని, హరిబాబు, ఎంపీపీలు గండ్రకోట శ్రీదేవి, రజిత, శ్రీనివాస్రెడ్డి, సర్పంచ్ డోలి రజిత, గంథాలయ చైర్మన్ గోవింద్నాయక్, బీఆర్ఎస్ నాయకుడు బాలసాని లక్ష్మీనారాయణ పాల్గొన్నారు.
కొట్లాడి సాధించుకున్న తెలంగాణను అభివృద్ధిలో సీఎం కేసీఆర్ దేశంలోనే అగ్రగామిగా నిలిపి దశాబ్ది ఉత్సవాలను జరుపుతుంటే ప్రతిపక్ష నాయకులు ఉత్సవాలు ఎందుకు అని సన్నాయి నొక్కులు నొక్కుతున్నారని, వారందరికీ ఇంగిత జ్ఞానం, సిగ్గుండాలని ఎంపీ మాలోత్ కవిత దుయ్యబట్టారు. భావితరాలకు ఉద్యోగావకాశాలను కల్పిస్తున్న యువ నేత కేటీఆర్ ఎక్కడ అడుగు పెడితే అక్కడ అభివృద్ధి జరుగుతుందన్నారు. 2019 పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా నిర్వహించిన సభలో పాల్గొన్న కేటీఆర్, ములుగు ప్రాంత అభివృద్ధికి కట్టుబడి ఉన్నామన్న మాటలను నిజం చేస్తూ నేడు రూ.133 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారని చెప్పారు. కేంద్రం దేశ వ్యాప్తంగా 150 మెడికల్ కాలేజీలను తొమ్మిదేళ్లలో ఏర్పాటు చేస్తే అందులో తెలంగాణకు ఒక్కటీ రాలేదన్నారు. తాను ప్రాతినిథ్యం వహిస్తున్న మహబూబాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో మూడు మెడికల్ కాలేజీలను సీఎం కేసీఆర్ ఏర్పాటు చేశారని చెప్పారు.