శాయంపేట, ఏప్రిల్ 27 : జోగంపల్లి శివారులో ఉన్న చలివాగు ప్రాజెక్టుకు మహర్దశ వచ్చింది. సమైక్య పాలనలో అభివృద్ధికి నోచుకోని చలివాగు జలాశయానికి తెలంగాణ సర్కారు రూ.10.21 కోట్లను మంజూరు చేస్తు ఉత్తర్వులు జారీ చేసింది. ప్రాజెక్టు నిర్మించి 60 ఏండ్లు అవుతున్నా ఇంత పెద్ద మొత్తంలో నిధులు కేటాయించడం ఇదే తొలిసారి. దీంతో త్వరలో టెండర్లను పిలిచి పనులు ప్రారంభించే అవకాశాలున్నాయి. మిషన్ భగీరథ కింద తాగునీటిని అందిస్తుండగా తాజాగా రూ.100 కోట్లతో చలివాగు నుంచి వరంగల్ టెక్స్టైల్ పార్కుకు నీటిని సరఫరా చేసే కాల్వ పనులు కొనసాగుతున్నాయి. గతంలో నాలుగో విడుత మిషన్ కాకతీయలో భాగంగా రూ.3.86 కోట్ల నిధులను కేటాయించింది. మత్తడి, కాల్వల లైనింగ్, కట్ట మరమ్మతులు, తూము అభివృద్ధితోపాటు పూడికతీత పనులు చేయాలని నిర్దేశించారు.
చలివాగు నిర్వహణను ఇరిగేషన్ శాఖ నుంచి మూడేళ్ల క్రితం దేవాదులకు ప్రభుత్వం బదిలీ చేసింది. 1964లో చలివాగు ప్రాజెక్టును నిర్మించారు. ఈ జలాశయం కింద అధికారికంగా 3040 ఎకరాల ఆయకట్టు ఉంది. కానీ సైఫన్లు, కాల్వలతో అనధికారికంగా ఐదు వేల ఎకరాల్లో సాగు అవుతున్నట్లు తెలుస్తున్నది. ప్రాజెక్టు ప్రధాన కాల్వ 10 కిలోమీటర్లు కొప్పుల, దమ్మన్నపేట, చెన్నాపూర్ వరకు విస్తరించి ఉండగా దీని కింద 124 ఎకరాల ఆయకట్టున్నది. అలాగే, కుడి కాల్వ 14 కిలోమీటర్లుండగా దీని కింద 2,185 ఎకరాలు, ఎడమ కాల్వ కింద నాలుగు కిలోమీటర్లుండగా 737 ఎకరాల ఆయకట్టు సాగు అవుతున్నది. ప్రాజెక్టు 18 అడుగులు అంటే 500 ఎంసీఎఫ్టీల నీటి నిల్వ సామర్థ్యం కలిగి ఉన్నది. ప్రతి ఏడాది వానకాలంతో పాటు యాసంగి పంటలకు నీరందిస్తున్నది. శాయంపేట మండలంతో పాటు పరకాల నియోజకవర్గంలోని సుమారు 125 గ్రామాలకు సురక్షిత తాగునీటిని అందిస్తున్నారు. ప్రస్తుతం వరంగల్ టెక్స్టైల్ పార్కుకు భూగర్భ పైపులైన్ ద్వారా నీటిని తరలించేందుకు పనులు జరుగుతున్నాయి. సుమారు 40 కిలోమీటర్ల మేరకు పైపులైన్ పనులు చేస్తున్నారు.
సమైక్య పాలకులు జలాశయాన్ని పట్టించుకోకపోవడంతో కాల్వల లైనింగ్ దెబ్బతింది. మత్తడి మరమ్మతుకు చేరింది. తూము పూర్తిగా శిథిలమై కూలేలా ఉన్నది. కట్టపై భారీగా ముళ్ల పొదలు పెరిగాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ సర్కారు వచ్చిన తర్వాత చలివాగుపై ప్రత్యేక దృష్టి పెట్టింది. మిషన్ కాకతీయలో రూ.3.86 కోట్లను ప్రభుత్వం మంజూరు చేసింది. దీంతో రూ.50లక్షలతో పూడికపనులను కూడా చేపట్టాలని ప్రణాళిక తయారు చేసినట్లు అప్పటి ఇరిగేషన్ అధికారులు వెల్లడించారు. అయితే దీనికి సంబంధించి టెండర్ల ప్రక్రియలోనే ఆగిపోయిందంటున్నారు. ఈ నేపథ్యంలో భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి అదనపు నిధుల కోసం ప్రతిపాదనలు పంపించారు. నిధల మంజూరుకు పలుమార్లు సీఎం కేసీఆర్తో ఆయన మాట్లాడారు. దీంతో చలివాగు అభివృద్ధికి ప్రభుత్వం రూ.10.21కోట్లను మంజూరు చేస్తు ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో కాల్వలు, తూము, కట్ట మరమ్మతులు, అభివృద్ధి పనులు జరుగనున్నాయి. చలివాగు ప్రాజెక్టు అభివృద్ధికి నిధుల మంజూరుకు కృషి చేసిన ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డికి ఎంపీపీ మెతుకు తిరుపతిరెడ్డి, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు గంగుల మనోహర్రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.