వాజేడు, మార్చి 4 : తాగునీరు, విద్యుత్ సౌకర్యం కల్పించాలని గుడిసెవాసులు ములుగు జిల్లా వాజేడు ఎంపీడీవో కార్యాలయం ఎదుట ధర్నాకు దిగారు. వాజేడు మండలంలోని మండపాక గ్రామ శివారులో ప్రభుత్వ భూమిలో ఇటీవల కొందరు గుడిసెలు వేసుకొని ఉంటున్నారు.
కరెంట్, తాగునీటి సౌకర్యం కల్పించడంతో పాటు నివాసం ఉంటున్న వారందరికీ ఇంటి పన్నులు ఇవ్వాలంటూ సోమవారం సీపీఎం నాయకులతో కలిసి కుటుంబాలతో సహా రెండు కిలోమీటర్లు ర్యాలీగా వచ్చి ఎంపీడీవో కార్యాలయానికి చేరుకున్నారు. ఖాళీబిందెలతో మండల ప్రజాపరిషత్ కార్యాలయం ఎదుట నిరసన తెలిపి గంట పాటు ధర్నా చేశారు.
ఈమేరకు ఎంపీవో శ్రీకాంత్నాయుడుకు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో సీపీఎం నాయకులు కొప్పుల రఘుపతిరావు, గుగ్గిళ్ల దేవయ్య, దామోదర్, సౌమ్య, గుడిసెవాసులు ప్రవీణ్, భీమయ్య, శరత్ తదితరులు పాల్గొన్నారు.