హనుమకొండ, ఏప్రిల్ 26 : రాష్ట్రవ్యాప్తంగా ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల(పీఏసీఎస్)కు నామినేటెడ్ పద్ధతిలో పాలకమండళ్లను నియమించేందుకు రంగం సిద్ధమైంది. ఈ మేరకు ఇటీవల రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకోవడంతో ఉమ్మడి వరంగల్ జిల్లాలో రాజకీయం వేడెక్కింది. సంఘాల పదవీ కాలం ముగిసి చాలారోజులైంది. అప్పటి నుంచి ఇన్చార్జి అధికారుల పాలనే కొనసాగుతున్నది. తాజాగా, రాష్ట్ర ప్రభు త్వం ఎన్నికలు నిర్వహించకుండా, పోటీ లేకుండా అధికార పార్టీ నాయకులతో పాలక మండళ్లను నామినేటెడ్ పద్ధతిలో భర్తీ చేసేందుకు రెడీ అవుతున్నది.
పీఏసీఎస్లతోపాటు డీసీసీబీ, డీసీఎంఎస్లకు సైతం ఇదే పద్ధతిలో నియమించే అవకాశముందని అధికార వర్గాల సమాచారం. ఈ పద్ధతిలో మంత్రులు, ఇన్చార్జి మంత్రులు, ఎమ్మెల్యేల ప్రతిపాదనలే కీలకంగా మారనున్నాయి. ప్రజాస్వామ్యబద్ధంగా జరగాల్సిన ప్రక్రియ ప్రజాప్రతినిధుల కనుసన్నల్లో జరిగే అవకాశం ఉన్నది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో సంఘాల ఉనికికే ముప్పు వాటిల్లే ప్రమాదముందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఉమ్మడి వరంగల్ జిల్లాలో అధికార వర్గాల సమాచారం మేరకు 99 పీఏసీఎస్ పరిధిలో 1287 మంది డైరెక్టర్లు ఉండగా, ఆశావహులు ఇప్పటి నుంచే మంత్రులు, ఎమ్మెల్యేలను ప్రసన్నం చేసుకొనే పనిలో పడినట్లు ప్రచారం జరుగుతున్నది.
ఇప్పటి వరకు పీఏసీఎస్ల పాలకమండళ్లు ఎన్నికల ప్రక్రియ ద్వారా కొలువుదీరేవి. సహకార సంఘాల్లో సభ్యులుగా ఉన్న రైతులు ఓటు ద్వారా 10 నుంచి 13 మంది డైరెక్టర్ల ను ఎన్నుకొనేవారు. వారి నుంచి పీఏసీఎస్ చైర్మన్లు (అధ్యక్షుడు), వైస్ చైర్మన్లు (ఉపాధ్యక్షుడు), చైర్మన్లు డీసీసీబీ డైరెక్టర్లను, వారు డీసీసీబీ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నుకొనే విధానం ప్రస్తుతం కొనసాగుతున్నది. తాజా గా, ప్రభుత్వం తీసుకున్న నామినేటెడ్ పద్ధతి లో పాలక మండళ్లను నియమించనున్నారు. ఈ ప్రక్రియకు ముందు చట్టమార్పిడి చేయాల్సి ఉంటుంది. అందుకు గవర్నర్ ద్వారా ఆర్డినెన్స్ జారీ చేయాల్సి ఉంటుందని, ప్రతిపాదనలు గవర్నర్కు పంపించాల్సి ఉంటుందని, ఈ విషయంలో స్పష్టత లేదని అధికారులు అంటున్నారు. అయితే, ఇప్పటికే అధికారుల పర్సన్ ఇన్చార్జుల జీవో విషయంలో హైకోర్టులో కేసు ఉందని, ఈ విషయంలో ముందుకు వెళ్లితే లీగల్ సమస్యలు వస్తాయనే ఆలోచనలో ఉన్న ప్రభుత్వం న్యాయనిపుణులతో చర్చిస్తున్నట్లు సమాచారం.
ఏడాదికి పైగానే డీసీసీబీ, పీఏసీసీఎస్లు ఇన్చార్జి అధికారుల పాలనలో కొనసాగుతున్నాయి. 2025 ఫిబ్రవరితో పాలక వర్గాల గడువు ముగిసింది. దీంతో ఆరు నెలలపాటు ఆ పాలక వర్గాలనే పర్సన్ ఇన్చార్జి మేనేజింగ్ కమిటీలుగా కొనసాగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆ తర్వాత మరో ఆరు నెలలు గడువు పొడగిస్తూ గత ఆగస్టులో మరోసారి ఉత్తర్వులు జారీ చేసింది. ఈ క్రమంలో గడువు పూర్తి కాకముందే అకస్మాత్తుగా డిసెంబర్ 19న ప్రభుత్వం పాలక వర్గాలను రద్దు చే సింది. అప్పటి నుంచే ఇప్పటి వరకు అధికారు లే పర్సన్ ఇన్చార్జులుగా కొనసాగుతున్నారు.