– ఎంజీయూ ఔట్సోర్సింగ్ ఉద్యోగుల సంఘం నూతన అధ్యక్షుడు హరికిషన్ రావు
రామగిరి, ఆగస్టు 07 : ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా పని చేస్తున్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు చాలిచాలనీ వేతనాలతో పని చేస్తున్నారని, వారికి ఉద్యోగ భద్రత కల్పించడంతో పాటు సమయానికి జీతాలు చెల్లించాలని నల్లగొండలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీ ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు ఆర్.హరికిషన్ రావు అన్నారు. ఎంజీయూలో శుక్రవారం నిర్వహించిన ఆ సంఘం నూతన కమిటీ ఎన్నిక, జనరల్ బాడీ సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలోని అన్ని శాఖల్లో పని చేస్తున్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగులతో సమన్వయం చేసుకుని పనిచేస్తూనే ఎంజీయూ పనిచేసే ఉద్యోగుల సమస్యల పరిష్కారానికై కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని కోరారు. అనంతరం నూతన కమిటి అధ్యక్షుడిగా ఆర్.హరికిషన్రావు, ఉపాధ్యక్షులుగా ఉమాదేవి, జనరల్ సెక్రెటరీగా విష్ణు, కోశాధికారిగా సరిత, కార్యవర్గ సభ్యులుగా విక్రం, నౌషిన్, శంకర్ను ఎన్నుకున్నారు. నూతన కమిటీని అభినందించి శాలువతో సత్కారించారు. ఈ సమావేశంలో రాష్ట్ర ఉపాధ్యక్షుడు వై.శేఖర్రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు నిర్మల, జిల్లా కార్యదర్శి పి.నాగయ్య, ఇతర ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు పాల్గొన్నారు.