నర్సింహులపేట, మార్చి 1 : ఎస్సారెస్పీ కాల్వ కట్టలు మాయమవుతున్నాయి. కొందరు ఏకంగా కట్టను తొలగించి, తమ భూమిలో కలుపుకొని పంటలు సాగు చేస్తుండగా, మరికొందరు మట్టిని తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. అడిగే వారు లేకపోవడంతో రాత్రనకా, పగలనకా మట్టిని తరలిస్తూ దోచుకుంటున్నారు. మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలంలోని వంతడపల గ్రామ శివారు నుంచి పెద్దనాగారం, మరిపెడ మీదుగా ఖమ్మం జిల్లాకు వెళ్లే ఎస్సారెస్పీ డీజీఎం-60 ప్రధాన కాల్వకు ఇరువైపులా సుమారు 60 నుంచి 100 అడుగుల వెడల్పుతో కట్టలున్నాయి.
కాల్వ రక్షణ కోసం నిర్మాణ సమయంలో తీసిన మట్టి ఇరువైపులా పోశారు. నిబంధనల మేరకు ఎక్కడైనా మట్టి తవ్వాలంటే భూగర్భ గనుల శాఖతో పాటు సాగునీటి, రెవెన్యూ అధికారుల అనుమతి తీసుకోవాలి. కానీ, కొందరు నిబంధనలు ఉల్లంఘించి కాల్వ మట్టిని కొల్లగొడుతున్నారు. ఇరిగేషన్ అధికారులు పట్టించుకోకపోవడంతో ఇప్పుడు ఏకంగా కాల్వ కట్టలు చదును చేసి పంటలు సాగు చేస్తున్నారు. పెద్దనాగారం రెవెన్యూ శివారు నుంచి మరిపెడ శివారు వరకు ప్రధాన కాల్వ కుడి వైపు సుమారు 50 నుంచి 100 ఎకరాల వరకు కట్ట తొలగించి పంటలు సాగు చేసుకుంటున్నారు.
ఉప కాల్వ కట్టల మట్టి సైతం మాయం చేసి చెలకలు, పొలాల్లోకి తరలించుకుంటున్నారు. ప్రధాన కాల్వ నుంచి ఉప కాల్వల కట్ట మట్టిని మాయం చేసి, చదును చేసి పంటలు సాగు చేస్తున్నా అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. పలుమార్లు అధికారులకు తెలిపినా పట్టించుకోవడం లేదని పలువురు రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై ఇరిగేషన్ డీఈ రాజ్కుమార్ మాట్లాడుతూ.. నిబంధనల ప్రకారం కాల్వ కట్టలు వెడల్పు ఉండాలని, కట్టలు ఆక్రమిస్తే చట్టపరమైన చర్యలు తీసుకోవడంతోపాటు కేసులు నమోదు చేస్తామన్నారు.