చివరి రోజు 59 మంది విద్యార్థుల గైర్హాజరు
99.4 శాతం హాజరు నమోదు
ప్రశాంతంగా జరిగిన ఎగ్జామ్స్
ఉత్సాహంగా ఇండ్లకు చేరిన పిల్లలు
గిర్మాజీపేట, మే 28: పదో తరగతి పరీక్షలు శనివారం విజయవంతంగా ముగిసినట్లు డీఈవో డీ వాసంతి తెలిపారు. జిల్లావ్యాప్తంగా 56 పరీక్ష కేంద్రాల్లో జరిగిన సాంఘికశాస్త్రం పరీక్షకు 59 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు పేర్కొన్నారు. మొత్తం 9,934 మంది విద్యార్థులకు 9,875 మంది పరీక్షకు హాజరు కాగా, 99.4 శాతం హాజరు నమోదైనట్లు తెలిపారు. ఈ సందర్భంగా 21 పరీక్ష కేంద్రాలను తనిఖీ బృందాలు పరిశీలించాయని చెప్పారు. ఆదర్శ పాఠశాలల జాయింట్ డైరెక్టర్, జిల్లా పరీక్షల పరిశీలనాధికారి పీ రాజీవ్ ధర్మారం, గీసుగొండ, పర్వతగిరిలోని జడ్పీఎస్ఎస్ను తనిఖీ చేసినట్లు వెల్లడించారు. అలాగే, శివనగర్లోని వందన హైస్కూల్, ఏకశిల హైస్కూల్, ఎల్బీనగర్లోని అస్సీసీ హైస్కూల్, దేశాయిపేటలోని నాగార్జున హైస్కూల్, ఎస్ఆర్ పాటాక్మహాల్ల హైస్కూల్, దేశాయిపేటలోని కృష్ణవేణి హైస్కూల్, రంగశాయిపేటలోని విజ్డమ్ హైస్కూల్ను తాను తనిఖీ చేసినట్లు డీఈవో చెప్పారు. 11 పరీక్ష కేంద్రాలను రెండు ఫ్లైయింగ్ స్కాడ్ బృందాలు పరిశీలించాయని వివరించారు.
ప్రశాంతంగా ఎస్సెస్సీ ఎగ్జామ్స్..
ఖానాపురం/చెన్నారావుపేట/గీసుగొండ/నల్లబెల్లి: జిల్లాలో వారం రోజులపాటు నిర్వహించిన ఎస్సెస్సీ పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. కరోనా కారణంగా గత సంవత్సరం పరీక్షలు జరుగలేదు. గతానికి భిన్నంగా ఈ ఏడాది ఒక్కో పరీక్షకు ఒకే పేపర్ కావడంతో ఆరు రోజుల్లోనే పరీక్షలు పూర్తయ్యాయి. టెన్త్ పరీక్షలు ఖానాపురం మండలంలో ప్రశాంతం వాతావరణంలో కొనసాగాయి. బుధరావుపేట మోడల్ స్కూల్లో 160 మంది, ఖానాపురం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 109 మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. పరీక్షలు ముగియడంతో విద్యార్థుల్లో ఉత్సాహం, ఆనందం కనిపించింది. చెన్నారావుపేట మండలంలో టెన్త్ పరీక్షలు ప్రశాంతంగా ముగిసినట్లు చీఫ్ సూపరింటెండెంట్లు ఉమామహేశ్వర్, వెంకట్రాంనర్సయ్య తెలిపారు. రెండు పరీక్ష కేంద్రాల్లో 390 మంది విద్యార్థులకు ఒకరు మాత్రమే గైర్హాజరైనట్లు తెలిపారు.
చివరి రోజు సెంటర్లను ఎంపీడీవో దయాకర్, ఎస్సై మహేందర్ సందర్శించారు. గీసుగొండ మండలంలోని ధర్మారం జడ్పీహెచ్ఎస్, గీసుగొండ జడ్పీహెచ్ఎస్, మరియపురం సెయింట్ జాన్ హైస్కూల్లో 680 మంది విద్యార్థులకు 678 మంది పరీక్షలు రాశారు. చివరి రోజు విద్యార్థులు పరీక్షలు రాసి ఆనందంగా తమ ఇండ్లకు వెళ్లిపోయారు.
నల్లబెల్లి మండలంలోని మూడు పరీక్ష కేంద్రాల్లో 372 మంది విద్యార్థులకు 371 మంది పరీక్షలు రాశారు. తహసీల్దార్ మంజుల, ఎంఈవో చదువుల సత్యనారాయణ పర్యవేక్షణలో పది పరీక్షలు ప్రశాంతంగా జరిగాయి. రెండుసార్లు డీఈవో వాసంతి, ఒకసారి ఫ్లయింగ్ స్క్వాడ్ బృందం సభ్యులు పరీక్ష కేంద్రాలను తనిఖీ చేశారు. ఏ ఒక్క విద్యార్థి డిబార్ కాలేదు. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ విధించి ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా ఎస్సై రాజారాం పటిష్ట బందోబస్తు నిర్వహించారు.
సంగెం మండలంలో పదో తరగతి పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. సంగెం జడ్పీహెచ్ఎస్తోపాటు గవిచర్ల మోడల్ స్కూల్లో పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. సంగెంలో 174 మంది, మోడల్స్కూల్లో 220 మంది విద్యార్థులను కేటాయించారు. సంగెంలో ఒక విద్యార్థి మాత్రమే గైర్హాజరు కాగా, 385 మంది పరీక్ష రాశారు. ఈ ఏడాది ఒకే పేపర్ కావడంతో ఆరు రోజుల్లోనే పరీక్షలు ముగియడంతో విద్యార్థులు సంతోషం వెలిబుచ్చారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరుగకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. కేరింతలు కొడుతూ విద్యార్థులు తమ ఇండ్లకు తరలివెళ్లారు.