స్టేషన్ఘన్పూర్, డిసెంబర్ 15 : గ్రామీణ ప్రాంతాల్లోని యువతలో దాగిఉన్న క్రీడా నైపుణ్యాన్ని వెలికితీసీ వారిని రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొనేలా ప్రోత్సహించేందుకు ఉమ్మడి వరంగల్ జిల్లా స్థాయి మెగా క్రికెట్ పోటీలు నిర్వహించడం అభినంద నీయమని ఎమ్మెల్సీ కడియం శ్రీహరి అన్నారు. మండలంలోని నమిలిగొండ గ్రామంలో కడియం ఫౌండేషన్ సహకారంతో కడియం యువసేన ఆధ్వర్యంలో నిర్వహించిన పోటీలను ఎమ్మెల్సీ కడియం ప్రారంబించారు. అంతకు ముందు బీఆర్ఎస్ జిల్లా నాయకుడు బెలిదె వెంకన్న అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. గతంలో జఫర్గఢ్, ధర్మసాగర్ మండలాల్లో కడియం ఫౌండేషన్ సహకారంతో జిల్లా స్థాయి పోటీలు నిర్వహించినట్లు తెలిపారు.
కేసీఆర్ సహకారంతో స్టేడియం నిర్మాణం
క్రీడలకు సీఎం కేసీఆర్ పెద్ద పీట వేస్తున్నారని, ఇందులో భాగంగానే ప్రతి గ్రామంలో తెలంగాణ క్రీడా ప్రాంగణాలను ఏర్పాటు చేయిస్తున్నారని అన్నారు. ఇందులో భాగంగా స్టేషన్ఘన్పూర్లో స్టేడియం నిర్మాణ పనులు నిలిచిపోయాయని, ఇది పూర్తయితే స్టేడియంలోనే టోర్నమెంట్స్ నిర్వహించుకోవచ్చ న్నా రు. ఈ విషయాన్ని సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి నిధులు మంజూరు చేయిస్తానని అన్నారు.
అభాగ్యులకు అండగా కడియం ఫౌండేషన్
అభాగ్యులకు అండగా కడియం ఫౌండేషన్ నిలుస్తోందని కడియం అన్నారు. కరోనా సమయంలో నిత్యావసర సరుకులు, ఆర్థికసాయం అందజేసినట్లు ఆయన తెలిపారు. ఉన్నత విద్య అభ్యసిస్తున్న వారికి ఆర్థికసాయం అంద జేసినట్లు చెప్పారు. కడియం ఫౌండేషన్ ఆధ్వర్యంలో జనవరిలో ఉమ్మడి జిల్లా స్థాయి కబడ్డీ పోటీలు చాగల్లులో నిర్వహించాలని ఆలోచిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.
నా జీవితం ప్రజా సేవకే అంకితం
నిరుపేద కుటుంబంలో పుట్టిన తనకు ఈ నియోజకవర్గం రాజకీయ జన్మనిచ్చి ఇంతటి వాడిని చేసింది. తనకు అండగా నిలిచిన నియోజకవర్గాన్ని ఎన్నడూ మరిచి పోనని అన్నారు. నియోజకవర్గ ప్రజలకే జీవితం అంకితం అని ఆయన స్పష్టం చేశారు.
కార్యక్రమంలో బీఆర్ఎస్ జిల్లా నాయకులు చింతకుంట్ల నరేందర్రెడ్డి, బానోత్ రాజేశ్నాయక్, రైతుబంధు సమితి జిల్లా సభ్యుడు రాంబాబు, స్టేషన్ఘన్పూర్, ధర్మసాగర్ మండలాల సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు పోగుల సారంగపాణి, పెసరు రమేశ్, సర్పంచ్ కోతి రేణుకారాములు, అనితాసుధాకర్బాబు, డ్యాగల ఉప్పలస్వామి, గాదె చంద్రయ్య, అనుమాల మల్లేశం, ఎంపీటీసీలు బూర్ల లతాశంకర్, రజాక్ యాదవ్, శ్యాంకుమార్ రెడ్డి, మాజీ సర్పంచ్ పేరాల సుధాకర్, కడియం యువసేన వ్యవస్థాపక అధ్యక్షుడు ఎల్మకంటి నాగరాజు, హఫీజ్, విజయ్, సంపత్ రాజ్, మేకల శ్రీకాంత్, దశరథం నాయక్, పాల్గొన్నారు.