కొడకండ్ల, మే 16: బీఆర్ఎస్ పాలనలోనే క్రీడలకు ప్రాధాన్యం లభించిందని, గ్రామీణ ప్రాంత క్రీడాకారుల్లో నైపుణ్యాన్ని వెలికితీసేందుకు సీఎం కేసీఆర్ రాష్ట్ర వ్యాప్తంగా ఆటల పోటీలు నిర్వహిస్తున్నారని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహిస్తున్న సీఎం కప్-2023 క్రీడలను ఆయన పరిశీలించి కొద్ది సేపు కబడ్డీ ఆడారు. అనంతరం మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ క్రీడలు మానసికోల్లాసంతో పాటు దేహదారుఢ్యాన్నిస్తాయని పేర్కొన్నారు.
గ్రామీణ ప్రాంత క్రీడాకారులను ప్రోత్సహించడంతో పాటు వారి నైపుణ్యాలను వెలికితీయాలనే ఉద్ధేశంతోనే సీఎం కేసీఆర్ ఆటల పోటీలు నిర్వహిస్తున్నారని ఆయన తెలిపారు. కార్యక్రమంలో ఎంపీపీ ధరావత్ జ్యోతి, టీఎస్ ఈజీసీ సభ్యుడు అందె యాకయ్య, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు సిందె రామోజీ, మార్కెట్ కమిటీ చైర్మన్ పేరం రాము, జీసీసీ మాజీ చైర్మన్ గాంధీనాయక్, సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు పసునూరి మధుసూదన్, మార్కెట్ డైరెక్టర్ కుందూరు అమరేందర్ రెడ్డి, తహసీల్దార్ చంద్రమోహన్, బీఆర్ఎస్ మండల ఉపాధ్యక్షుడు ఎండీ హసీఫ్ పాల్గొన్నారు.