కాజీపేట, జనవరి 28 : కాజీపేట నుంచి అయోధ్యకు ఆస్తా ప్రత్యేక రైళ్లు ఈ నెల 30న ప్రారంభం కానున్నాయి. కాజీపేట జంక్షన్ నుంచి అయోధ్యకు 15 రైళ్లు, మరో 15 రైళ్లు అయోధ్య రైల్వే స్టేషన్ నుంచి కాజీపేటకు నడువనున్నాయి. మంగళవారం సాయంత్రం 6:20 గంటలకు కాజీపేట నుంచి (07223) నంబర్తో మొదటి రైలు బయలు దేరి మరుసటి రోజు మధ్యాహ్నం 3:35 గంటలకు అయోధ్య రైల్వే స్టేషన్కు చేరుకుంటుందని రైల్వే అధికారులు తెలిపారు. ఈ ప్రత్యేక రైళ్లు జనవరి 30, ఫిబ్రవరి 1, 3, 6, 8,10,12, 14, 16,18, 20, 22, 24, 26, 28 తేదీల్లో సాయంత్రం 6:20 గంటలకు కాజీపేటలో బయలు దేరనున్నాయి.
అయోధ్య నుంచి ఫిబ్రవరి 2, 4, 6, 9, 11,13, 15, 17, 19, 21, 23, 25, 27, 29, మార్చి 2న మధ్యాహ్నం 14:20 గంటలకు అయోధ్య రైల్వే స్టేషన్లో బయలు దేరి మరుసటి రోజు రాత్రి 9 గంటలకు కాజీపేటకు చేరుకుంటాయని వివరించారు. ఈ ప్రత్యేక రైళ్లు పెద్దపల్లి, రామగుండం, మంచిర్యాల, బెల్లంపల్లి, సిర్పూర్ కాగజ్నగర్, బల్లార్షా, చంద్రాపూర్, సేవాగ్రాం, నాగ్పూర్, ఇటార్సీ, భోపాల్, ఝాన్సీ, కాన్పూర్ స్టేషన్లలో ఆగుతాయని తెలిపారు. ఉమ్మడి వరంగల్ జిల్లా భక్తులు ప్రత్యేక రైళ్లను వినియోగించుకోవాలని రైల్వే అధికారులు కోరారు.