వర్ధన్నపేట, జనవరి 28 : గుడుంబా తయారు చేసినా, విక్రయించినా కఠిన చర్యలు తీసుకుంటామని ఎక్సైజ్ టాస్క్ఫోర్స్ అసిస్టెంట్ కమిషనర్ నాగేందర్రావు హెచ్చరించారు. వర్ధన్నపేట సర్కిల్ పరిధిలో 2022 సంవత్సరంలో నమోదైన కేసులపై సమీక్ష నిర్వహించారు. బెల్లం రవాణాను జిల్లాలో పూర్తిగా అరికట్టడంతో గడుంబా తయారీదారులు ఇతర ప్రాంతాల నుంచి నల్లబెల్లాన్ని అక్రమంగా తీసుకువస్తున్నారని, దీన్ని నియంత్రించేందుకు ప్రత్యేక రూట్వాచ్లను ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. సంగెం మండలంలోని చింతలపల్లి, ఎల్గూరు స్టేషన్ వద్ద రైల్వే, సివిల్ పోలీసుల సహకారంతో మహారాష్ట్ర, బల్లార్షా ప్రాంతాల నుంచి బెల్లాన్ని తరలిస్తున్న వారిపై కేసులు నమోదు చేసినట్లు వివరించారు. బీదర్, చిత్తూరు నుంచి వాహనాల్లో తరలిస్తున్న బెల్లాన్ని పట్టుకున్నట్లు చెప్పారు. వరంగల్ బీటుబజార్ నుంచి బెల్లం రవాణా జరుగకుండా కఠిన చర్యలు తీసుకున్నామన్నారు. 2022 సంవత్సరంలో సుమారు 17వేల 620 కిలోల నల్లబెల్లం స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. గుడుంబా తయారీపై 220 కేసులు నమోదు చేయడంతో పాటు 1046 లీటర్లను స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. 13,300 లీటర్ల బెల్లం పానకాన్ని ధ్వంసం చేశామన్నారు. వరంగల్, మహబూబాబాద్ జిల్లాల్లో గుడుంబా తయారీ, విక్రయాలను అరికట్టేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని వివరించారు.
రెండు వాహనాలు సీజ్..
చిత్తూరు జిల్లా నుంచి బెల్లాన్ని తీసుకువస్తున్న రెండు వాహనాలను సీజ్ చేశామని ఎక్సైజ్ టాస్క్ఫోర్స్ అసిస్టెంట్ కమిషనర్ నాగేందర్రావు తెలిపారు. రాయపర్తి మండలం జయరామ్తండాకు చెందిన సోదరులు లావుడ్యా సుమన్, ప్రశాంత్ జనగామకు చెందిన శ్రీనివాస్ వాహనంతో పాటు మరో వాహనంలో సుమారు 2,500ల కిలోల బెల్లం, 550 కిలోల పటికను తరలిస్తున్నారు. ముందస్తు సమాచారం మేరకు శుక్రవారం రాత్రి రూట్వాచ్ నిర్వహించి రెండు వాహనాలతో పాటు నిందితులను పట్టుకున్నారు. వీరిపై కేసులు నమోదు చేసి రిమాండ్కు తరలించామని ఆయన తెలిపారు. కార్యక్రమంలో ఎన్ఫోర్స్మెంట్ సీఐలు టీ శ్రీనివాస్, మాధవీలత, వర్ధన్నపేట సీఐ పవన్, ఎస్సై రజిత, సువర్ణ, సిబ్బంది పాల్గొన్నారు.