ఫిర్యాదుదారులు, పోలీసుల మధ్య స్నేహభావాన్ని పెంపొందించేందుకు సీఎం కేసీఆర్ ఫ్రెండ్లీ పోలీసింగ్ విధానాన్ని తీసుకొచ్చారు. దీంతో అనేక మందిలో పోలీసుల పట్ల ఉన్న అపోహలు తొలిగి సదభిప్రాయం కలుగుతున్నది. ఇందులో భాగంగా ఫిర్యాదుదారుల పిల్లల కోసం మహబూబాబాద్ టౌన్ పోలీస్ స్టేషన్లో ప్రత్యేక రూమును ఏర్పాటు చేశారు. భార్యాభర్తల మధ్య తగాదాలు, ఘర్షణ, ఇతర వివాదాల్లో పోలీస్స్టేషన్కు వచ్చే సందర్భాల్లో పిల్లలను కూడా తీసుకొస్తుంటారు. దీంతో పోలీసులు వారికి సరైన కౌన్సెలింగ్ ఇవ్వలేకపోతున్నారు.
తమ తల్లిదండ్రులు ఏదో తప్పు చేయడం వల్లే ఇక్కడికి వచ్చారని పిల్లలు భావించి మనసికంగా వారిలో నెగెటివ్ ఆలోచనలు పెరిగే అవకాశం ఉంది. ఇలాంటి చెడు ప్రభావం వారిపై పడకుండా ఉండేందుకే ఇక్కడ చిల్డ్రన్ రూమ్ ఏర్పాటు చేశారు. ఈ రూమ్లో చిన్న పిల్లలకు ఆహ్లాదకర వాతావరణాన్ని కల్పించారు. పోలీసులు కౌన్సెలింగ్ చేసే సమయంలో చిన్నారులను ఈ రూమ్లోకి తీసుకువెళ్లి ఆడిస్తారు. వీరి సంరక్షణ కోసం ప్రత్యేకంగా మహిళా కానిస్టేబుల్ను నియమించారు. ఈ ప్రత్యేక ఏర్పాట్లతో మానుకోట టౌన్ పోలీస్ స్టేషన్ ఇతర స్టేషన్లకు ఆదర్శంగా నిలుస్తున్నది.
ప్రత్యేక రూమ్లో ఉన్నవి ఇవే..
1-18 ఏళ్ల వయస్సు ఉన్నవారు ఈ రూమ్లో ఉండవచ్చు. ప్రధానంగా ఏడాదిలోపు ఉన్న పిల్లల కోసం ప్రత్యేక బెడ్, ఆటల కోసం జారుడు బండ, పాటలు వినేందుకు బాక్స్లు, చిన్న కారు, తదితర పరికరాలను అందుబాటులో ఉంచారు. విద్యార్థులకు విజ్ఞానం అందించేందుకు మ్యాప్ బోర్డ్లు, వర్ణమాల పరికరాలు, డ్రాయింగ్ షీట్లు, ఆట వస్తువులు సిద్ధం చేశారు. పరికరాల ద్వారా ఆటలు ఆడించేలా కానిస్టేబుల్ను నియమించారు. పిల్లల రూమును ఈ నెల 5న ఎస్పీ శరత్ చంద్ర పవార్ ప్రారంభించనున్నారు.
ఫ్రెండ్లీ పోలీసింగ్ విధానంలో భాగంగా మహబూబాబాద్ టౌన్ పోలీస్ స్టేషన్లో చిన్నారులకోసం గది ఏర్పాటు చేశారు. గొడవలు, వేధింపులు తదితర కేసుల్లో భార్యాభర్తలు స్టేషన్కు వచ్చే సందర్భంలో పిల్లలు భయపడకుండా ఉండేందుకు ప్రత్యేకంగా రూమును సిద్ధం చేశారు. గోడలపై ఆకర్షణీయంగా చిత్రాలు వేసి, బొమ్మలు, ఆట వస్తువులను అందుబాటులో ఉంచారు. చిన్నారులపై చెడు ప్రభావం పడకుండా వాటితో కాలక్షేపం చేసేలా తీర్చిదిద్దారు. మహిళా సహాయక కేంద్రాన్ని ఏర్పాటు చేసి, గదిలో పిల్లలకు వసతులు కల్పించారు. మహబూబాబాద్ టౌన్ పోలీస్టేషన్లో నెలకొల్పిన ఈ గదిని ఈ నెల 5న ఎస్పీ శరత్ చంద్ర పవార్ ప్రారంభించనున్నారు.
– మహబూబాబాద్ రూరల్, ఫిబ్రవరి 2