భీమదేవరపల్లి, అక్టోబర్ 9 : క్యాన్సర్ బారిన పడిన కొడుకు ఆరోగ్యం రోజురోజుకూ క్షీణిస్తుండడంతో ఆ తల్లి తల్లిడిల్లిపోయింది. తీవ్ర మనస్తాపంతో ఆ మాతృమూర్తి అనారోగ్యంతో మంచానపడింది. కొడుకు దూరమైతే తట్టుకోలేననుకుందో ఏమో గానీ అతడి కంటే ముందే కన్నుమూసింది. తల్లి లేకపోతే తననెవరు పట్టించుకుంటారనుకున్నాడో ఏమో.. ఆమె మరణించిన గంట సేపటికే అతనూ కన్నుమూశాడు. ఈ హృదయ విదారక ఘటన హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలంలోని ముల్కనూరులో బుధవారం చోటుచేసుకుంది. గ్రామస్తుల కథనం మేరకు.. చిదురాల లక్ష్మయ్యకు భార్య శోభ(48) ఇద్దరు కుమారులు సందీప్, సాయికిరణ్(28), కూతురు దివ్య ఉన్నారు.
భార్యాభర్తలిద్దరు కూలీ పనిచేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తూ కూతురు వివాహం చేశారు. పెద్ద కొడుకు సందీప్ సైతం కూలీ పనిచేస్తుండగా అతని తమ్ముడు సాయికిరణ్ కొంతకాలం ముల్కనూరులోనే బైక్ మెకానిక్ పని నేర్చుకునేందుకు వెళ్లేవాడు. ఈ క్రమంలో సాయికిరణ్ అస్వస్థతకు గురికావడంతో చికిత్స కోసం వరంగల్లోని ఎంజీఎం ఆస్పత్రికి తీసుకెళ్లారు. నిత్యం గుట్కాలు తినడం వల్ల క్యాన్సర్ వచ్చిందని, ఆపరేషన్ చేయాలని వైద్యులు చెప్పారు. ఏడాది క్రితం పేగు ఆపరేషన్ చేసినా నయం కాకపోవడంతో హైదరాబాద్లోని నీలోఫర్ ఆసుపత్రికి తరలించారు.
అక్కడ కీమోథెరపీ చేసినా ప్రయోజనం లేకపోవడంతో ఆస్పత్రిలో ఉంచి చికిత్స చేయించే స్థోమత లేక ఇంటికి తీసుకొచ్చారు. వినాయక చవితికి ముందు ఆసుపత్రికి వెళ్లి వచ్చిన సాయికిరణ్ మంచానపడ్డాడు. రోజురోజుకూ కొడుకు ఆరోగ్య పరిస్థితి దిగజారుతుండడం చూసి అతని తల్లి శోభ దిగులుతో అనారోగ్యం బారిన పడి బుధవారం ఉదయం కన్నుమూసింది. ఆమె మరణించిన గంట సేపటికే సాయికిరణ్ కూడా మృతిచెందాడు. ఇంటి ముందు తల్లి, కొడుకుల మృతదేహాలను చూసిన గ్రామస్తులు చలించిపోయారు. రెక్కాడితేగాని డొక్కాడని చిదురాల లక్ష్మయ్య కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు.