వరంగల్, మే 27 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): సామాన్యుడి భూ కష్టం తీర్చేందుకు వచ్చిన ధరణి, ఏండ్ల తరబడి అరిగోస పడ్డ రైతులకు ధైర్యం తెచ్చింది. పారదర్శకంగా.. సులభంగా.. అవినీతి రహితంగా.. జవాబుదారీతనంతో రెవెన్యూ సేవలు అందించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన ‘ధరణి పోర్టల్’ విజయవంతంగా సేవలందిస్తున్నది. గతంలో నెలల తరబడి జాప్యమయ్యే ప్రక్రియ, ఇప్పుడు కేవలం 20 నిమిషాల్లోనే పూర్తవుతుండడంతో అన్నదాతల్లో ఆనందం కనిపిస్తున్నది. 2020 అక్టోబరు 29న ముఖ్యమంత్రి కేసీఆర్ ధరణి వ్యవస్థను ప్రారంభించగా ఉమ్మడి జిల్లాలో అదే సంవత్సరం నవంబర్ 2 నుంచి సేవలు మొదలయ్యాయి. మొత్తంగా ఇప్పటివరకు హనుమకొండ జిల్లాలో ధరణి ద్వారా 37,272 రిజిస్ట్రేషన్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ ‘ధరణి మా ధైర్యం’ అంటూ ధీమా వ్యక్తం చేశారు. ఎక్కడికక్కడ మండలాల్లోనే రిజిస్ట్రేషన్లు అవుతుండడంతో సంతోషపడుతున్నారు.
పారదర్శకత, అవినీతిరహిత, వేగవంతమైన సేవలు లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ‘ధరణి’ అందరిలోనూ భరోసా పెంచింది. వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ ప్రక్రియ వేగంగా జరుగుతున్నది. ఏండ్ల నుంచి పెండింగ్లో ఉన్న భూముల రిజిస్ట్రేషన్లు నిమిషాల్లో పూర్తవుతున్నాయి. ‘ధరణి’ మొదలైనప్పటి నుంచి రిజిస్ర్టేషన్ల సంఖ్య అనూహ్యంగా పెరిగింది. రిజిస్ట్రేషన్, మ్యుటేషన్ వెంటవెంటనే పూర్తవుతున్నాయి. రిజిస్ట్రేషన్ల కోసం ప్రతి మండలంలో రోజూ స్లాట్లు బుక్కవుతున్నాయి. ఎలాంటి అడ్డంకులూ లేకుండా వెంటనే రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తవుతుండడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వ్యవసాయ భూముల రిజిస్ర్టేషన్లలో కొత్త శకానికి శ్రీకారం చుడుతూ 2020 అక్టోబర్ 29న ముఖ్యమంత్రి కేసీఆర్ ధరణి వ్యవస్థను ప్రారంభించారు. అదే సంవత్సరం నవంబర్ 2 నుంచి ఉమ్మడి జిల్లాలో సేవలు మొదలయ్యాయి. అప్పటి నుంచి వ్యవసాయ భూము ల్లో రిజిస్ట్రేషన్లు పెరిగాయి. ధరణి మొదలైనప్పటి నుంచి వరంగల్, హనుమకొండ, మహబూబాబాద్, జనగామ, జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో కలిపి సగటున నెలకు 6500 రిజిస్ర్టేషన్లు పూర్తవుతున్నాయి. ప్రారంభం నుంచి ఇప్పటివరకు హనుమకొండ జిల్లాలో 37,272 రిజిస్ట్రేషన్లు పూర్తయ్యాయి.
దళారుల దందాకు చెక్
ధరణికి ముందు రిజిస్ట్రేషన్, మ్యుటేషన్ అంటే పూర్తిగా దళారుల దందా. ఎక్కడో దూర ప్రాంతంలో వ్యవసాయ రిజిస్ట్రేషన్లు జరిగేవి. ఆఫీసుకు వెళితే కనీసం లోపలికి కూడా రానిచ్చేవారు కాదు. మ్యుటేషన్ అంటే ఏమిటో?, ఎక్కడ చేస్తారో కూడా సామాన్య రైతులకు అర్థంకాని పరిస్థితి. మ్యుటేషన్ చేయకుంటే సొంత భూమి ఏమవుతోందో, ఎవరి పేరున ఎక్కుతుందో అనే భయం ఉండేది. ఇవన్నీ దళారీ వ్యవస్థ పుట్టకకు కారణమయ్యాయి. రిజిస్ట్రేషన్ ఆఫీసులో మనం నిమిత్తమాత్రులం. వాళ్లు చెప్పిన సమయానికి వెళ్లాలి, రావాలి. కీలకమైన భూమి కాగితాలు ముందుగా దళారులకు ఇస్తేనే పని మొదలవుతుంది. రిజిస్ట్రేషన్ అయ్యాక కూడా వాళ్లు తెచ్చి ఇస్తేనే మనకు వస్తాయి. ఇలా ఏండ్లుగా దళారుల దందా సాగింది. ధరణితో ఇప్పుడు మండల కేంద్రాల్లోనే జరుగుతున్నాయి. ధరణి వీటన్నింటీకీ ముగింపు పలికింది. మీ-సేవలో స్లాట్ బుక్ చేసుకుని… అందులో వచ్చిన రోజున తహసీల్ ఆఫీసుకు వెళ్లితే గరిష్టంగా 20 నిమిషాల్లోపే పని పూర్తవుతోంది. రిజిస్ట్రేషన్ కోసం గతంలో రోజుల తరబడి ఆఫీసుల చుట్టూ తిరిగి, పైసలు ఇచ్చినా పని కాని పరిస్థితులకు ధరణి ముగింపు పలికింది. ఎవరో రాసే వివరాలను తప్పని చెప్పి తిప్పించుకునే తీరుకు భిన్నంగా.. మీ-సేవలో రైతు చెప్పిన వివరాలే నమోదవుతున్నాయి. వీటిని ఎవరూ మార్చే అవకాశం లేదు. మారిందనే సాకుతో పైసల కోసం పీడించే అవకాశం ఇప్పుడు లేదు. గతంలో నెలల తరబడి జరిగే రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఇప్పుడు 20 నిమిషాల్లోనే పూర్తవుతుండడంతో ఎక్కువ మంది రైతులు రిజిస్ట్రేషన్లతో భూ సమస్యలు లేకుండా చూసుకుంటున్నారు.
ఏండ్లనాటి సమస్యలకు పరిష్కారం
ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన మండలాల పునర్వ్యవస్థీకరణతో మండల కేంద్రాలు ప్రజలకు దగ్గరయ్యాయి. ఇప్పుడు రిజిస్ట్రేషన్ సేవలు తహసీల్దార్ ఆఫీసులోనే అందుబాటులోకి వచ్చాయి. రైతులకు ఏ చిన్న ఇబ్బంది లేకుండా రిజిస్ట్రేషన్లు పూర్తవుతున్నాయి. ఆఫీసులు తెరిచే సమయానికి వెళితే రిజిస్ట్రేషన్, మ్యుటేషన్ పూర్తి చేసుకుని గంటలోనే రైతులు ఇంటికి వచ్చి వ్యవసాయ, ఇతర పనుల్లో నిమగ్నమవుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం సాగునీటి వసతులు పెంచడం, వ్యవసాయానికి నిరంతర కరెంటు అందిస్తుండడం, ఇతర సంక్షేమ పథకాలు అమలు చేస్తుండడంతో గ్రామాల్లో భూముల విలువ పెరిగింది. ఈ నేపథ్యంలోనే అక్కడక్కడా భూముల కోసం వివాదాలు మొదలయ్యాయి. ఇలాంటి పరిస్థితులకు అవకాశం లేకుండా ఉండేందుకు, సమగ్రమైన, వేగవంతమైన ప్రక్రియను తేవాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి కేసీఆర్ ‘ధరణి’ వ్యవస్థను తెచ్చారు. దీనిద్వారా రైతుల్లో భరోసా పెరిగింది. భూముల రిజిస్ట్రేషన్ల కోసం ముందుకొస్తున్నారు. కుటుంబ సభ్యుల మధ్య ఏండ్లుగా ఆగిపోయిన భూముల పంపణీ దాదాపుగా పూర్తయ్యింది. ఇప్పుడు ఎప్పటికప్పుడే పరిష్కరించుకుంటున్నారు. వారసత్వ భూముల దఖలులోనూ కుటుంబ సభ్యులు అందరూ కలిసి ఉండేలా ‘ధరణి’ కృషిచేస్తున్నది. బంధువులు, దగ్గరి వారి నుంచి కొనుగోలు చేసిన భూముల్లోనూ ఎలాంటి సమస్యలు ఉండడంలేదు. ధరణితో రైతులకు, సామాన్యలకు తమ భూముల రక్షణపై ధీమా వచ్చింది.
ధరణితోనే భరోసా వచ్చింది..
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో పాలకులు ఏ రోజు కూడా రైతులు గురించి పట్టించుకోలే. తెలంగాణ రాష్ట్రం వచ్చినంక రైతుల కోసం ప్రత్యేకంగా ధరణి పోర్టల్ ఏర్పాటుచేశారు. మాది ఆత్మకూరు మండలం పెద్దాపురం. నేను 1996ల రెండెకరాలు కొన్న. తెల్లకాయితం మీద రాసుకొని డబ్బులు మొత్తం కట్టిన. అప్పట్ల పట్టా చేయాల్నంటే రెవెన్యూ ఆఫీస్ల పైసలడిగేటోళ్లు. అప్పటినుంచి నాకు పట్టా లేదు. భూమి సాగు చేసుకుంటున్న కానీ పట్టా పాసుబుక్ అయితే లేకపోయేది. తెలంగాణ సర్కారు వచ్చినంక 2016ల ధరణి తోటి పట్టా చేసుకొనేటట్టు చేసిన్రు. అప్పుడు ఆన్లైన్లో దరఖాస్తు పెట్టిన. పక్కాగా రైతుల నుంచి వివరాలు తీసుకొని కాస్తులో ఉన్నాడా లేడా నిర్ధారణ చేసుకున్నారు. ఒక్క రూపాయి ఖర్చు లేకుంట నాకు పట్టా పాసు బుక్ ఇచ్చిన్రు. అప్పటినుంచి భరోసాతో బతుకుతున్నా. రైతుబంధు పథకం కింద ఏడాది రెండు సార్లు బ్యాంకుల డబ్బులు జమైతానయ్. రైతుల కోసం ఆలోచించే సీఎం కేసీఆర్కు మా కుటుంబం ఎంతో రుణపడి ఉంటుంది.
– కాటబత్తిని ప్రభాకర్, పెద్దాపురం
మా బాపు కోరిక తీరినందుకు సంతోషంగా ఉంది..
నేను ఉన్నప్పుడే ఎవరి భూమి వారికి రిజిస్ట్రేషన్ చేయిస్తనని కొన్నేండ్ల నుంచి మా బాపు అనేది. మేము పనుల రీత్యా వేరువేరు చోట్ల ఉంటున్నాం. ఎప్పడైనా పండుగలకు ఇంటికి వచ్చినప్పుడు ఇదే ముచ్చట తీసేది. మేము ఒక్కరోజు, రెండు రోజులు సెలవులు పెట్టుకొని వస్తాం గానీ ఇక్కడ రిజిస్ట్రేషన్ కోసం ఆఫీసులు, బ్రోకర్ల చుట్టూ తిరగాలంటే భయమయ్యేది. అది ఒకటీరెండు రోజుల్లో అయ్యే పని కాదని.. మా బాపు ఎప్పుడు రిజిస్ట్రేషన్ జోలి తీసినా వాయిదా వేసేవాళ్లం. కానీ సీఎం కేసీఆర్ ధరణి పోర్టల్ తెచ్చిన తర్వాత మా మండలంలోని తహసీల్దార్ ఆఫీస్లోనే రిజిస్ట్రేషన్లు త్వరగా అవుతున్నాయి. మేము శుక్రవారం స్లాట్ బుక్ చేస్తే శనివారం టైం ఇచ్చి ఒక్క రోజులోనే కంప్లీట్ చేశారు. తహసీల్దార్ మాకు వెంటనే రిజిస్ట్రేషన్ పేపర్లు ఇచ్చి, నెల రోజుల్లో పోస్ట్లో పాస్బుక్ వస్తుందని చెప్పిన తర్వాత నాకు ఆశ్చర్యం అనిపించింది. ఇలా నాకే కాదు చాలామందికి ధరణి వల్ల నమ్మకం కుదిరింది. రూపాయి ఖర్చు కాలేదు. కేసీఆర్ తెచ్చిన పోర్టల్ వల్లే రిజిస్ట్రేషన్ చేసుకొని మా బాపు కోరిక తీర్చినందుకు మా కుటుంబ సభ్యులు చాలా ఆనందంగా ఉన్నారు.
– ఆకుల నాగేందర్, హసన్పర్తి (సాప్ట్వేర్ ఉద్యోగి)
రిజిస్ర్టేషన్లు త్వరగా అవుతున్నయ్
ఇదివరకు భూమి అమ్మాలన్నా, కొనాలన్నా భీమదేవరపల్లి రిజిస్ర్టేషన్ ఆఫీస్ వెళ్లేది. అక్కడ రిజిస్ర్టేషన్ అయ్యాక మ్యుటేషన్ కోసం తహసీల్దార్ కార్యాలయానికి పోవాలి. వీఆర్వో లేదా వీఆర్ఏకు రిజిస్ర్టేషన్ కాగితాలు ఇస్తే నెలల తరబడి తిరిగితే గానీ పట్టాకు రాసేవాళ్లు కాదు. కానీ గిప్పుడు ఆ సమస్యే లేదు. తహసీల్దార్ ఆఫీస్లోనే రిజిస్ర్టేషన్ అవుతుంది. అయ్యాక వెంటనే మన పాస్ బుక్కులో రిజిస్ర్టేషన్ అయిన భూమిని ప్రింట్ చేసి ఇస్తున్నారు. దీని వల్ల ముందులెక్క నెలల తరబడి ఆఫీస్ల చుట్టూ తిరిగే బాధ తప్పుతోంది. డబ్బులు కూడా తీసుకోరు. ఒకే రోజు పాసు బుక్కులో భూమి అమ్మినా, కొన్నా రికార్డుల్లోకి ఎక్కుతుంది. ధరణి వల్ల రైతుల బాధలు చాలావరకు తప్పాయ్.
– గుడికందుల వేణు, ఎల్కతుర్తి
భూముల లెక్క పక్కాగా తెలుస్తున్నది
సీఎం కేసీఆర్ ధరణి పోర్టల్ తీసుకురావడం రైతులకు నిజంగా వరం. ప్రతీ భూమి లెక్క తేలింది. వ్యవసాయ భూమి ఎవరికి ఎంత ఉంది అనేది తెలుసుకోవచ్చు. దీని వల్ల అవినీతికి, కబ్జాలకు ఆస్కారం లేకుండా పోయింది. మా నాన్న హింగె వీరమల్లు ద్వారా వచ్చిన భూమిని గిఫ్ట్ రిజిస్ట్రేషన్ చేసుకుని 1-33గుంటలకు మ్యుటేషన్ చేసుకున్న. పాస్బుక్ కూడా వచ్చింది. రైతుబంధు కూడా పడుతున్నది. మమ్మల్ని కాదని మా భూమిని ఎవరు కూడా లాక్కోలేరు. ఎవరైనా తహసీల్దార్ ఆఫీస్కు వచ్చి భూమిని అమ్మేవారికి నిమిషాల వ్యవధిలో రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారు. చాలా సంతోషంగా ఉంది. ఒకప్పుడు రాత లెక్కలు ఉండేవి. ఒకరి భూమి ఒకరి పేరుమీద, ఒకరికి తక్కువ, మరొకరికి ఎక్కువ అయ్యేవి. ఇష్టం వచ్చినట్లు రాసుకునే వారు. ధరణి వచ్చిన తర్వాత అవన్నీ వాటన్నిటికీ పరిష్కారం చూపింది. సీఎం కేసీఆర్ సార్కు కృతజ్ఞతలు.
– హింగె రాజేశ్వర్రావు, దామెర
ఎలాంటి పైరవీలు లేవు
తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణి తో భూ సమస్యలు తొలగిపోయాయి. గతానికి భిన్నంగా ఎలాంటి చేతితో చేసే పనులు లేకుండా ఆన్లైన్లో పారదర్శకంగా జరుగుతోంది. ఎలాంటి ఇబ్బంది లేకుండా క్రయవిక్రయాలు జరుగుతున్నాయి. మీ సేవ ద్వారా స్లాట్ బుక్ చేసుకోవడం నుంచి అంతా పకాగా అవుతోంది. కొనుగోలు చేసిన వారికి వెంటనే నమూనా పాస్ పుస్తకం ఇవ్వడం, అమ్మిన వారి ఖాతా నుంచి భూమి మారిపోవడం చకాచకా చేస్తున్నారు. దీనివల్ల భవిష్యత్తులో సమస్యలు రాకుండా పకడ్బందీగా పోర్టల్ తయారుచేశారు. మేము 20 గుంటల భూమిని కొన్నం. స్లాట్ బుక్ చేసి సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్కు వెళ్లాం. తాసిల్దార్ ఇరువర్గాల నుంచి వేలిముద్రలు తీసుకొని వెంటనే మాకు పాసుపుస్తకం ఇచ్చారు. 10 రోజుల తర్వాత ఒరిజినల్ పాస్బుక్ ఇంటికి వచ్చింది. పైరవీల్లేకుండానే రిజిస్ట్రేషన్ కావడం సంతోషంగా ఉంది. సీఎం కేసీఆర్ దూరదృష్టితో ధరణిని తీసుకొచ్చి రైతుల ఇబ్బందులను తీర్చారు.
– అమ్మ జ్యోతి, శాయంపేట
పది నిమిషాల్లో పట్టా అయింది
మాది మడికొండ. మా తండ్రి నిగ్గుల సాంబయ్య. ఊరిలో 3.9 గుంటల పట్టా భూమి ఉంది. మా ముగ్గురు అన్నదమ్ములకు ఎకరం మూడు గుంటల చొప్పున పట్టా మార్పిడి చేశారు. ఎలాంటి ఇబ్బంది లేకుంట మీసేవ కేంద్రంలో స్లాట్ బుక్ చేసుకుని రావడంతోనే తహసీల్దార్ ఆఫీస్లో సునాయాసంగా పట్టా మార్చారు. ఇదివరకు వ్యవసాయ భూమిని రిజిస్ట్రేషన్ చేయించాలంటే చాలా ఖర్చు అయ్యేదట. ఇప్పుడు కేవలం పది నిమిషాల్లో నా పేరు మీదికి మార్చి పట్టా కాగితం కూడా ఇచ్చారు. ఇదంతా ధరణి వల్లే సాధ్యమైంది. అవినీతికి ఆస్కారం లేకుండా సీఎం కేసీఆర్ మంచి ఆలోచన చేశారు. అధికారులకు, ప్రభుత్వానికి కృతజ్ఞతలు.
– నిగ్గుల రవి, మడికొండ
అవినీతికి తావులేదు
నేను ఒగులాపురం శివారు 65ఆ 2/2/1/1 సర్వే నంబర్లో ఐదు గుంటల భూమి కొన్న. మీసేవా కేంద్రంలో స్లాట్ బుక్ చేసుకొని ఇచ్చిన సమయానికి తహసీల్దార్ కార్యాలయానికి పోయిన . పది నిమిషాల్లోనే రిజిస్ట్రేషన్ పూర్తయింది. ఒక్క పైసా లంచం లేదు. రిజిస్ట్రేషన్ కాగితాలు కూడా వెంటనే ఇచ్చిన్రు. చాలా సంతోష మనిపించింది. భూమి పత్రాలు అప్పుడే వచ్చేలా చేయడం వల్ల రైతులకు ధరణిపై పూర్తిస్థాయి నమ్మకం కలిగింది. భూమి రక్షణ మీద నమ్మకం ఏర్పడింది. రైతులకు ధరణి ఎంతో ఉపయోగపడుతుంది. ధరణి వచ్చిన తర్వాత రైతులకు సీఎం కేసీఆర్పై మరింత అభిమానం పెరిగింది. రైతులకు తెలియకుండా ఇంచు భూమి కూడా పోదు అనే నమ్మకమిచ్చిన సీఎం కేసీఆర్కు రుణపడి ఉంటం.
– వొజ్జల కుమారస్వామి, ల్యాదెళ్ల, దామెర మండలం