బచ్చన్నపేట, మే 6 : అబద్ధాలను ప్రచారం చేసి అధికారంలోకి వచ్చిన సీఎం రేవంత్రెడ్డి పార్లమెంట్ ఎన్నికల్లో రాజకీయ లబ్ధికోసం ప్రజలను మరోసారి మోసం చేయాలని చూస్తున్నారని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి విమర్శించారు. బీఆర్ఎస్ పాలనలో కేసీఆర్ అమలు చేసిన సంక్షేమ పథకాలను నిలిపివేయడమేగాక ఉద్యమ నేతను దూషిస్తున్నాడని మండిపడ్డారు. సోమవారం మండల కేంద్రంలోని శ్రీనిధి గార్డెన్స్లో పార్టీ మండల అధ్యక్షుడు బొడిగం చంద్రారెడ్డి అధ్యక్షతన నిర్వహించిన బీఆర్ఎస్ ఆత్మీయ సమావేశానికి ముఖ్య అతిథిగా భువనగిరి ఎంపీ అభ్యర్థి క్యామ మల్లేశం, అతిథులుగా జడ్పీచైర్పర్సన్ గిరబోయిన భాగ్యలక్ష్మి, రైతుబంధు సమితి జిల్లా మాజీ అధ్యక్షుడు ఇర్రి రమణారెడ్డి హాజరయ్యారు. ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ అధికారంలోకి రాగానే చెరువులు, కుంటలు ఎండిపోయాయన్నారు. గోదావరి జలాలున్నా వీటిని నింపకపోవడంతో సాగునీరందక వేలాది ఎకరాల్లో పంట నష్టం జరిగిందన్నారు. రూ.2 లక్షల పంట రుణాలు మాఫీ చేస్తామని చెప్పిన సీఎం రేవంత్రెడ్డి ఆగస్టు 15 వరకు గడువు ఇవ్వాలని రైతులను కోరుతూ యాదగిరి నర్సన్న, కొమురెల్లి మల్లన్న సాక్షిగా సంక్షేమ పథకాలు అమలు చేస్తామని ఒట్లు వేస్తున్నారని అన్నారు. ధాన్యానికి బోనస్ రూ.500, పేద మహిళలకు నెలకు రూ.2500, ఆసరా పింఛన్ల మొత్తాన్ని డబుల్ చేస్తామని చెప్పిన హామీలు ఏమయ్యాయని పల్లా ప్రశ్నించారు. పార్లమెంట్ ఎన్నికల్లో భువనగిరి ఎంపీగా క్యామ మల్లేశంను భారీ మెజార్టీతో గెలిపించాలని ఆయన పిలుపునిచ్చారు.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక సాగునీరందక, కరెంట్ కోతలతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని భువనగిరి ఎంపీ అభ్యర్థి క్యామ మల్లేశం అన్నారు. డిసెంబర్ 9న రైతుల పంట రుణాలు రూ. 2లక్షల మాఫీ చేస్తామని చెప్పిన సీఎం రేవంత్రెడ్డి మాట తప్పాడని విమర్శించారు. కేసీఆర్ పాలనలో వ్యవసాయం పండుగలా ఉండేదన్నారు. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలిస్తేనే రైతుల పక్షాన పోరాటం చేయగలమని, ఢిల్లీలో కేంద్రం మెడలు వంచి నిధులు తేగలమన్నారు. సమావేశంలో సొసైటీ చైర్మన్ పూర్ణచందర్, వైస్ చైర్పర్సన్ మద్దికుంట రాధ, ఎంపీటీసీల ఫోరం మండల అధ్యక్షుడు కనకయ్యగౌడ్, రైతుబంధు సమితి మండల మాజీ అధ్యక్షుడు చల్లా శ్రీనివాస్రెడ్డి, సర్పంచ్ల ఫోరం మండల మాజీ అధ్యక్షుడు గంగం సతీశ్రెడ్డి, నాయకులు కృష్ణంరాజు, వేముల విద్యాసాగర్గౌడ్, ఫిరోజ్, షబ్బీర్, నర్సిరెడ్డి, ముశిని రాజుగౌడ్, శివకుమార్పాల్గొన్నారు.