సంగెం, మార్చి 12 : రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆరు గ్యారెంటీలు అర్హులకు అందకుండా పోతున్నాయి. ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్నా కంప్యూటర్లలో ఎంట్రీ చేయలేదని పలువురు వాపోతున్నారు. అవసరమైన జిరాక్స్లతో దరఖాస్తు అందించినప్పటికీ కరెంట్ మీటర్, గ్యాస్ కనెక్షన్ వివరాలు కంప్యూటర్లలో చూపడం లేదని ఆగ్రహిస్తున్నారు. హడావుడిగా దరఖాస్తులు స్వీకరించి, ఆధార్ నంబర్లు తప్పుగా ఎంట్రీ చేయడం, కొన్ని అసలే ఎంట్రీ చేయకపోవడంతో లబ్ధి పొందలేకపోతున్నామని కొందరు చెబుతున్నారు. దరఖాస్తు చేసుకున్న తర్వాత ఇచ్చిన రశీదును సైతం ఇప్పుడు మళ్లీ గ్యాస్ సబ్సిడీ కోసం సరైన వివరాలను కంప్యూటర్లో ఎంట్రీ చేయగా తీసుకోవడం లేదని పేర్కొంటున్నారు. మంగళవారం సంగెం మండల పరిషత్ కార్యాలయంలోని ప్రజాపాలన లబ్ధిదారులు పడిగాపులు పడినప్పటికీ ఉపయోగం లేకుండాపోయింది. ఇప్పటికైనా తమను కార్యాలయాల చుట్టూ తిప్పుకోకుండా వెంటనే పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు.
ఖానాపురం : గృహజ్యోతి పథకం అమలుకు నోచుకోని అర్హులు మంగళవారం మండల పరిషత్ కార్యాలయం వద్ద బారులు తీరారు. గత నెలలో దరఖాస్తు చేసుకున్న వారికి ఫిబ్రవరి నెలలో 200లోపు యూనిట్లకు జీరో బిల్లు రావా ల్సి ఉంది. అయితే, పథకం అమలులో లోటుపాట్ల వల్ల అర్హులకు సైతం బిల్లులు వచ్చాయి. దీంతో ప్రజలు విద్యుత్ అధికారులను కలిసి సమస్యను వినిపించా రు. సాంకేతిక కారణాలతో జీరో బిల్లు అమలు కాలేదని, మార్చికి సంబంధించి జీరో బిల్లు అమలు కావాలంటే ఎంపీడీవో కార్యాలయంలో సరి చేసుకోవాలని సూచించారు. మండలవ్యాప్తంగా అన్ని గ్రామాల నుంచి ప్రజలు తరలివస్తుండడంతో కార్యాలయం కిక్కిరిసిపోతోంది.