జనగామ చౌరస్తా, ఏప్రిల్ 6 : ఎస్సై దంపతులకు ఆత్మహత్య జనగామ జిల్లా కేంద్రంలో త్రీవ కలకలం రేపింది. గంటల వ్యవధిలోనే ఇద్దరూ మృతిచెందడంతో స్థానికంగా తీవ్ర విషాదం నింపింది. వారి ఆత్మహత్యకు కుటుంబ కలహాలే కారణమని పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు. వెస్ట్జోన్ డీసీపీ ప్రఖ్యాసీతారం కథనం ప్రకారం.. జనగామ అర్బన్ ఎస్సైగా విధులు నిర్వర్తిస్తున్న కాసర్ల శ్రీనివాస్(52) ఆయన భార్య స్వరూప (50)తో కలిసి పట్టణంలోని వెంకటన్నకుంటలోని ఓ అద్దె ఇంట్లో నివాసముంటున్నాడు. వీరికి ఇద్ద రు కుమారులు రవితేజ, బబ్లూ ఉన్నారు.
పెద్ద కుమారుడికి మూడు నెలల క్రితమే వివాహం చేశారు. కొడుకులిద్దరూ హైదరాబాద్లో ప్రైవేట్ జాబ్ చేస్తూ అక్కడే ఉంటున్నారు. బుధవారం రాత్రి కుటుంబ సమస్యలు, ఆర్థిక విషయాల్లో ఎస్సై దంపతులకు గొడవ జరిగింది. దీంతో తీవ్ర మనస్తాపం చెందిన స్వరూప గురువారం తెల్లవారుజామున బాత్రూంలో వెంటిలేటర్కు చీరెతో ఉరేసుసుకుంది. ఉదయం 7 గంటలకు పాలుపోసే లక్ష్మణ్తో పాటు పక్కింటి లక్ష్మీనర్సయ్య ఈ విషయాన్ని మొదట గుర్తించారు. భార్య ఆత్మహత్య చేసుకోవడంతో ఎస్సై శ్రీనివాస్ మనస్తాపానికి గురయ్యాడు. పరామర్శించడానికి వచ్చిన స్థానికులు, పోలీసులు అక్కడే ఉండగానే బాత్రూంకు వెళ్లివస్తానని చెప్పిన ఎస్సై తన సర్వీస్ రివాల్వార్తో తలపై కాల్చుకుని మృతిచెందాడు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను జిల్లా ప్రభుత్వ ప్రధాన దవాఖానకు తరలించినట్లు డీసీపీ తెలిపారు. పూర్తి విచారణ అనంతరం మిగతా వివరాలు వెల్లడిస్తామని ఆయన పేర్కొన్నారు.
ప్రముఖుల సంతాపం
ఎస్సై శ్రీనివాస్, స్వరూప దంపతుల మృతదేహాలకు స్టేషన్ఘన్పూర్ ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య, బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఆరుట్ల దశమంతరెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ పోకల జమునా లింగయ్య, కౌన్సిలర్లు, ఇతర ప్రజా ప్రతినిధులు, వివిధ రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాల నాయకులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు నివాళులర్పించారు. అలాగే పోలీస్ కమిషనర్ ఏవీ రంగనాథ్ దంపతుల మృతదేహాపై పూలమాలలు వేసి నివాళర్పించడంతో పాటు గౌరవ వందనం చేశా రు. పోస్టుమార్టం అనంతరం వారి మృతదేహాలతో అంబేద్కర్ చౌరస్తా వరకు ర్యాలీగా నిర్వహించారు.