హనుమకొండ, అక్టోబర్ 11 : మాస్టర్ ట్రైనర్లు ఎన్నికల ప్రక్రియపై పూర్తి స్థాయిలో అవగాహన కలిగి ఉన్నప్పుడే ఎన్నికలు సజావుగా నిర్వహించగలమని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. బుధవారం సాయంత్రం హనుమకొండ కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో సాధారణ ఎన్నికల నిర్వహణపై మాస్టర్ ట్రైనీలకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఇందులో కలెక్టర్ పాల్గొని పోలింగ్ అధికారులకు పలు సూచనలు ఇచ్చారు.
అనంతరం ఆమె మాట్లాడుతూ ఎన్నికల నిర్వహణపై ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా తెలుసుకోవాలన్నారు. మాస్టర్ ట్రైనీలు ఎన్నికల నిర్వహణపై పూర్తిగా అవగాహన పెంచుకొని పోలింగ్ అధికారులకు శిక్షణ ఇవ్వాలన్నారు. గత ఎన్నికల్లో జరిగిన పొరపాట్లు పునరావృతం కాకుండా చూసుకోవాలని కలెక్టర్ సూచించారు. ప్రతి పోలింగ్ కేంద్రంలో సిబ్బంది, పోలింగ్ ఏజెంట్లకు మాత్రమే అనుమతి ఉంటుందని, ఇతరులకు ప్రవేశం లేదని స్పష్టం చేశారు. పోలింగ్ ఏజెంట్లు పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి ప్రచారం నిర్వహించకుండా చర్యలు తీసుకోవాలన్నారు.
పోలింగ్, కౌంటింగ్ ప్రక్రియలో చిన్న చిన్న పొరపాట్లకు కూడా తావులేకుండా శిక్షణ ఇస్తున్నట్లు వివరించారు. ఎన్నికలు సజావుగా జరిగేందుకు సహకరించాలని కలెక్టర్ కోరారు. కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి గణేశ్, ట్రైనీ కలెక్టర్ శ్రద్ధా శుక్ల, పరకాల, వరంగల్ పశ్చిమ రెండు నియోజకవర్గాల పరిధి ఎన్నికల అధికారులు పాల్గొన్నారు.