వరంగల్ చౌరస్తా, ఫిబ్రవరి 21: హిజ్రాల మనోభావాలు దెబ్బతినేలా మాట్లాడిన వైఎస్ షర్మిల బహిరంగ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తూ వరంగల్లోని హెడ్ పోస్టాఫీస్ సెంటర్లో మంగళవారం హిజ్రాలు నిరసన తెలిపారు. వైఎస్ షర్మిలకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ, ఆమె ప్లెక్సీని చెప్పులతో కొట్టి దహనం చేశారు. ఈ సందర్భంగా తెలంగాణ ట్రాన్స్జెండర్స్ అసోసియేషన్ అధ్యక్షురాలు బోరుగంటి లైలా మాట్లాడుతూ నాడు సమైక్య నినాదంతో తెలంగాణ వాసులను మోసం చేసి, నేడు జై తెలంగాణ నినాదంతో పది మందిని వెంటబెట్టుకొని వచ్చి రాజకీయాలు చేస్తున్న షర్మిలను ప్రజలు నమ్మరన్నారు. తోటి మనుషుల పట్ల మర్యాద లేకుండా మాట్లాడుతున్న వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిలకు తెలంగాణలో తిరిగే హక్కు లేదన్నారు. రాజకీయ లబ్ధికోసం హిజ్రాల మనోభావాలు దెబ్బతీసేలా సభలు, సమావేశాల్లో మాట్లాడిన ఆమె బేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. మహబూబాబాద్ ఎమ్మెల్యే శంకర్నాయక్పై అనుచిత వాఖ్యలు చేస్తూ మాట్లాడిన సభలో హిజ్రాలపై ప్రజలకు తప్పుడు సంకేతాలు అందేలా షర్మిల వాఖ్యలు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. మాటపై నిలబడని వారు, ప్రజలను మోసం చేసేవారు హిజ్రాలనే విధంగా షర్మిల మాట్లాడుతూ 12 సార్లు కొజ్జాలు అని ప్రస్తావించిందని పేర్కొన్నారు. తమలోనూ విద్యా, వైద్యం, క్రీడలు, రాజకీయ, పారిశ్రామిక రంగాల్లో రాణిస్తున్న వారు చాలా మంది ఉన్నారని తెలిపారు. వారిని స్పూర్తిగా తీసుకొని ముందుకెళ్తున్న హిజ్రాలపై అనుచిత వాఖ్యలు చేసి మానసిక ఇబ్బందులకు గురి చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. ఇప్పటికైనా షర్మిల నుంచి బహిరంగ క్షమాపణలు కోరుతున్నామని, లేకుంటే తెలంగాణలో ఎక్కడ రాజకీయ కార్యక్రమాలు చేపట్టినా అడ్డుకుంటామని హెచ్చరించారు.