హోలీ పండుగ వేళ ఉమ్మడి జిల్లాలో విషాదం నెలకొంది. వేర్వేరు ప్రమాదాల్లో ఆరుగురు యువకులు, ఒక బాలుడు మృతిచెందగా మరొకరు గల్లంతయ్యారు. వెంకటాపూర్ మండలం లక్ష్మీపురం వద్ద చెట్టుకు ఢీకొని ఇద్దరు, కమలాపూర్ మండలం గోపాల్పూర్ గ్రామశివారులో ఆటో బోల్తాపడి ఒకరు, గణపురం మండలం చెల్పూర్లో రెండు బైక్లు ఢీకొని మరొకరు, నర్సింహులపేటలో ప్రమాదవశాత్తు చెరువులో పడి విద్యార్థి, హనుమకొండలోని పలివేల్పుల వద్ద ఎస్సారెస్పీ కాల్వలో పడి ఇద్దరు మృతిచెందారు.
వెంకటాపూర్-పాలంపేట గ్రామాల మధ్యలో లక్ష్మీపురం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందారు. వెంకటాపూర్ ఎస్సై చల్లా రాజు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని లక్ష్మీదేవిపేట గ్రామానికి చెందిన ఎంబడి శృశాంత్(22), తిమ్మాపూర్కు ఉమ్మడి ఉమేష్(22) బీటెక్ చదువుతున్నారు. వీరు హోలీ వేడుకలు జరుపుకొని బైక్పై రామప్ప చెరువు కాల్వలో స్నానానికి వెళ్లి తిరిగి వస్తున్నారు. ఈ క్రమంలో లక్ష్మీపురం(రామప్ప వెళ్లే దారిలో) వద్ద బైక్ అదుపుతప్పి చెట్టుకు ఢీకొని అక్కడికక్కడే మృతి చెందారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను ములుగు ఏరియా దవాఖానకు తరలించారు. అదేవిధంగా కమలాపూర్ మండలంలోని గోపాల్పూర్ గ్రామశివారులో ఆటో బోల్తాపడి శనిగరపు వంశీ(21) మృతి చెందాడు. సీఐ హరికృష్ణ తెలిపిన వివరాల ప్రకారం.. నడికూడ మండలం చర్లపల్లి గ్రామానికి చెందిన గంగారపు వినయ్, బొల్లం ప్రశాంత్, శనిగరపు వంశీ, శనిగరపు సాయి హోలీ సంబురాలు జరుపుకుని ఆటోలో శనిగరం గ్రామానికి వచ్చారు. తిరిగి వెళ్తుండగా గోపాల్పూర్ గ్రామ శివారులో ఆటో బోల్తాపడింది. దీంతో శనిగరపు వంశీ అక్కడికక్కడే మృతి చెందగా, వినయ్, ప్రశాంత్, సాయిలకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స కోసం వరంగల్ ఎంజీఎం దవాఖానకు తరలించారు. కాగా, మృతుడు వంశీ హైదరాబాద్లో ఉంటూ, హోలీ పండుగకు చర్లపల్లికి వచ్చాడు. గణపురం మండలం చెల్పూర్ గ్రామంలో రెండు బైక్లు ఎదురెదురుగా ఢీకొని ఒకరు ప్రాణాలు కోల్పోయారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. చిట్యాల మండలంలోని జడల్పేట జీపీ పరిధిలోని గాంధీనగర్కు చెందిన బొట్ల రమేశ్(28) తన బైక్పై వీరయ్యపల్లిలోని అత్తగారింటికి వస్తున్నాడు. అదే సమయంలో ధర్మారావు పేటకు చెందిన ఫొటోగ్రాఫర్ మాట్ల ప్రేమ్కుమార్ తన ద్విచక్ర వాహనంపై చెల్పూర్కు వెళ్తున్న క్రమంలో చర్చి సమీపంలో ఎదురెదురుగా రెండు బైక్లు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో బొట్ల రమేశ్ అక్కడికక్కడే మృతి చెందగా, ప్రేమ్ కుమార్కు తీవ్ర గాయాలయ్యాయి. రమేశ్కు భార్య, కూతురు, కుమారుడు ఉన్నారు. నర్సింహుపేట మండలంలో చెరువులో పడి బాలుడు మృతి చెందాడు. మండ లంలోని రామన్నగూడెం గ్రామానికి చెందిన అబ్బోరి వినోద్రెడ్డి కుమారుడు రిత్విక్రెడ్డి(10) మండల కేంద్రంలో 4వ తరగతి చదువుతున్నాడు. స్నేహితులతో కలసి హోలీ ఆడి స్నానం చేసేందుకు గణేశ్ చెరువు వద్దకు వెళ్లాడు. రంగులు కుడుక్కుంటుండగా ప్రమాదవశాత్తు కాలు జారి చెరువులోని గుంతలో పడిపోయాడు. భయంతో అతని స్నేహితులు వచ్చి గ్రామంలో చెప్పడంతో గ్రామస్తులు అక్కడికి వెళ్లి చూసేసరికి రిత్విక్ మృతి చెందాడు. పంచనామా నిమిత్తం మృతదేహాన్ని జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ దవాఖానకు పంపి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సతీశ్ తెలిపారు.
దామెర/నయీంనగర్, మార్చి 25: హనుమకొండలోని కాకతీయ యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ పరిధిలోని పలివేల్పుల ఎస్సారెస్పీ కెనాల్లో పడి ఇద్దరు మృతి చెందారు. ఒకరు గల్లంతయ్యారు. వివరాలిలా ఉన్నాయి.. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. దామెర మండలం ఊరుగొండ గ్రామానికి చెందిన తక్కెళ్ల కేదారేశ్వర్(42), ముప్పు క్రాంతికు మార్(35) కొద్దికాలంగా పలివేల్పుల వద్ద అద్దె గృహంలో ఉంటూ కుటుంబాలను పోషించుకుంటున్నారు. వీరిద్దరు స్నేహితులు. హోలీ వేడుకల్లో పాల్గొన్న వీరితోపాటు కేదారేశ్వర్ పెద్దకూతురు(11), ఊరుగొండ గ్రామానికి చెందిన పండుగ భిక్షపతి పలివేల్పుల సమీపంలోని ఎస్సారెస్పీ మెయిన్ కెనాల్ వద్దకు వెళ్లారు. స్నానం కోసం కేదారేశ్వర్, కాంత్రి కుమార్ కెనాల్లో దిగగా నీటి ప్రవాహ వేగానికి గల్లంతయ్యారు. పోలీసులు, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది గాలించి మృతదేహాలను వెలికితీశారు. కేదారేశ్వర్ పెద్ద కూతురు కూడా నీటిలో కొట్టుకు పోతుండగా ఆమె పక్కనే ఉన్న భిక్షపతి బయటకు లాగడంతో ప్రాణాలతో బయటపడ్డది. బాలికను చికిత్స కోసం హనుమకొండలోని ఓ ప్రైవేటు దవాఖానకు తీసుకెళ్లారు. ఇద్దరి మృతదేహాలను ఎంజీ ఎం దవాఖాన మార్చురీకి తరలించారు. కేదారేశ్వర్కు భార్య, ఇద్దరు పిల్లలు, క్రాంతికుమార్కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. వీరిద్దరి మృతితో ఊరుగొండ గ్రామంలో విషాదఛాయలు అలుము కున్నాయి. అదేవిధంగా కుమార్పల్లికి చెందిన బ్రహ్మకుమార్ హోలీ వేడుకల్లో పాల్గొని, స్నానం చేద్దామని ఎస్సారెస్పీ కాల్వలోకి దిగి గల్లంతయ్యాడు. ఆయన కోసం పోలీసులు, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది వెతుకుతున్నారు.