మన ఊరు-మనబడి, మన బస్తీ-మనబడి కార్యక్రమంతో ప్రభుత్వ పాఠశాలలకు మహర్దశ పట్టింది. కోట్లాది రూపాయలతో మౌలిక వసతులు కల్పిస్తున్నారు. కార్పొరేటర్కు దీటుగా తీర్చిదిద్దుతున్నారు. ఈక్రమంలో ప్రతి పాఠశాలలో సౌర విద్యుత్ ఉత్పత్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. టీఎస్ రెడ్కో సహకారంతో తొలి విడుత పైలట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేసిన స్కూళ్లలో సోలార్ ఆన్గ్రిడ్ సిస్టమ్స్ ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించింది. ప్రస్తుతం వరంగల్ జిల్లాలోని 35 పాఠశాలల్లో పనులు ప్రారంభం కాగా.. 11 పాఠశాలల్లో విద్యుత్ ఉత్పత్తి జరుగుతోంది. ఒక్కో స్కూల్లో 8 యూనిట్ల విద్యుత్ తయారవుతుండగా.. ఇందులో 5 యూనిట్లు పాఠశాల అవసరాలకు వినియోగిస్తుండగా మిగిలింది ఎన్పీడీసీఎల్ గ్రిడ్కు చేరుతోంది.
-వరంగల్, ఏప్రిల్ 14 (నమస్తే తెలంగాణ)
వరంగల్, ఏప్రిల్ 14 (నమస్తే తెలంగాణ) : మన ఊరు- మన బడి, మన బస్తీ- మన బడి కార్యక్రమం అమలుతో ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మారిపోతున్నాయి. మౌలిక వసతులకు కేరాఫ్గా తయారవుతున్నాయి. విద్యుద్దీకరణ, పాఠశాల గదుల్లో ఫ్యాన్లు, ట్యూబ్లైట్లు, డ్యుయల్ డెస్క్లు, గ్రీన్చాక్ బోర్డుల ఏర్పాటు, ఫర్నిచర్, మరుగుదొడ్లు, వంట గదులు, ప్రహారీ, అదనపు గదుల నిర్మాణం, పెయింటింగ్ తదితర అభివృద్ధి పనులతో సర్కారు బడులు కార్పొరేట్ స్కూళ్లను తలపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రతి పాఠశాలలో విద్యుత్ వినియోగం పెరుగుతోంది. దీంతో ఆర్థిక భారం పడనున్నందున ప్రభుత్వం ఆయా పాఠశాలలో సౌర విద్యుత్ ఉత్పత్తికి నిర్ణయించింది. టీఎస్ రెడ్కో సహకారంతో తొలి విడుత పైలట్ ప్రాజెక్టు కింద కొన్ని పాఠశాలల్లో సోలార్ ఆన్గ్రిడ్ సిస్టమ్స్ ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించింది. ఈ మేరకు నిధులు కేటాయించడంతో టీఎస్ రెడ్కో ద్వారా సర్కారు బడుల్లో సౌర విద్యుత్ ఉత్పత్తి కోసం సోలార్ ఆన్గ్రిడ్ సిస్టమ్స్ అమర్చే కార్యక్రమం అమల్లోకి వచ్చింది.
మన ఊరు- మన బడి, మన బస్తీ- మన బడి కార్యక్రమంలో భాగంగా సోలార్ ఆన్గ్రిడ్ సిస్టమ్స్ అమర్చేందుకు ప్రభుత్వం తొలివిడుత జిల్లాలో 35 పాఠశాలలను ఎంపిక చేసింది. ఒక్కో పాఠశాలలో రెండు కిలోవాట్స్ కెపాసిటీతో కూడిన సోలార్ ఆన్గ్రిడ్ సిస్టమ్స్ ఏర్పాటుకు మార్గదర్శకాలు విడుదల చేసింది. రెండు కిలోవాట్స్ సోలార్ ఆన్గ్రిడ్ సిస్టమ్స్ అమర్చడం వల్ల రోజుకు 8 యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి జరుగనుంది. ఆయా పాఠశాలలో రెండు కిలోవాట్స్ సోలార్ ఆన్గ్రిడ్ సిస్టమ్స్ ఏర్పాటుకు ప్రభుత్వం రూ.1,59,600 వెచ్చిస్తోంది. సౌర విద్యుత్ ఉత్పత్తి కోసం జిల్లాలో తొలివిడుత ఎంపిక చేసిన 35 ప్రభుత్వ పాఠశాలల్లో టీఎస్రెడ్కో సోలార్ ఆన్గ్రిడ్ సిస్టమ్స్ అమర్చే పనులు చేపట్టింది. ఆయా పాఠశాల భవనాలపై ఆరు సోలార్ పలకలను ఏర్పాటు చేస్తోంది.
విద్యుదుత్పత్తి ప్రారంభం..
సోలార్ ఆన్గ్రిడ్ సిస్టమ్స్ ఏర్పాటు పనులు మొదలైన 35 సర్కారు బడుల్లో 11 స్కూళ్లలో కొద్ది రోజుల నుంచి సౌర విద్యుత్ ఉత్పత్తి జరుగుతుంది. పర్వతగిరి జడ్పీఎస్ఎస్, నర్సంపేట బాలికలు, బాలురు, మోడల్స్కూల్, నర్సంపేట మండలంలోని ఇటికాలపల్లి మోడల్ స్కూల్, నర్సంపేటలోని ఎంపీపీఎస్, వరంగల్ శివనగర్, గిర్మాజీపేటలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల, మామునూరు, ధర్మారం జడ్పీహెచ్ఎస్, మట్టెవాడ ప్రాథమిక పాఠశాలలో రెండేసి కిలోవాట్స్ కెపాసిటీతో కూడిన సోలార్ ఆన్గ్రిడ్ సిస్టమ్స్ అమర్చే పనులు పూర్తయినట్లు అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం ఈ 11 స్కూళ్లలో ప్రతిరోజు విద్యుదుత్పత్తి జరుగుతున్నట్లు టీఎస్ రెడ్కో వరంగల్ మేనేజర్ జీ మహేందర్రెడ్డి తెలిపారు. వీటిలో ఒక్కో పాఠశాలలో రోజుకు 8 యూనిట్ల కరంటు జనరేట్ అవుతుందని ఆయన చెప్పారు. మిగిలిన 24 ప్రభుత్వ పాఠశాలల్లో సోలార్ ఆన్గ్రిడ్ సిస్టమ్స్ ఏర్పాటు పనులు వివిధ దశల్లో కొనసాగుతున్నాయని, మరికొద్ది రోజుల్లో పూర్తి కాగలవని అన్నారు. సౌర విద్యుత్ ఉత్పత్తి కోసం పైలట్ ప్రాజెక్టు కింద జిల్లాలో తొలివిడుత అధికారులు 250 మంది విద్యార్థులకుపైగా సంఖ్య ఉన్న ప్రభుత్వ పాఠశాలలను సోలార్ ఆన్గ్రిడ్ సిస్టమ్స్ ఏర్పాటు కోసం ఎంపిక చేశారు. ప్రస్తుతం 11 పాఠశాలల్లో ఉత్పత్తి అవుతున్న విద్యుత్ను ఫ్యాన్లు, ట్యూబ్లైట్లు, నీటి సరఫరాకు వినియోగిస్తున్నారు.
దశల వారీగా అన్ని పాఠశాలల్లో సోలార్ ఆన్గ్రిడ్ సిస్టమ్స్..
మన బస్తీ- మన బడి కార్యక్రమం ద్వారా ప్రభు త్వం ఇటీవల వరంగల్ మట్టెవాడలోని ప్రాథమిక పాఠశాలను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దింది. ఈ పాఠశాలకు చెందిన రెండు భవనాల్లో 8 గదులు ఉన్నాయి. ఒకటి నుంచి ఐదో తరగతి వరకు గల ఈ స్కూలులో 312 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. మన బడి కార్యక్రమం ద్వారా ఈ పాఠశాలను అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం రూ.19.79 లక్షలు కేటాయించింది. ఈ నిధులతో పాఠశాలలో విద్యుద్దీకరణలో గదికో నాలుగు ఫ్యాన్లు, నాలుగు ట్యూబ్లైట్ల ఏర్పాటుతో పాటు వాష్రూం, నీటి సరఫరా, డీజీ, లైబ్రరీ ఏర్పాటు తదితర అభివృద్ధి పను లు జరిగాయి. నిర్వహణ కోసం ఈ స్కూల్కు రోజుకి నాలుగైదు యూనిట్ల విద్యుత్ అవసరం. ఎన్పీడీసీఎల్ విద్యుత్ను వాడుకుంటే ఒక్కో యూనిట్కు రూ.8 చొప్పున బిల్లు చెల్లించాల్సి ఉంటుంది.
సోలా ర్ ఆన్గ్రిడ్ సిస్టమ్స్ ఏర్పాటుతో ఎన్పీడీసీఎల్కు చెల్లించాల్సిన బిల్లు నెలకు కనీసం రూ.2 వేలు స్కూల్కు ఆదా అవుతుంది. ప్రస్తుతం ప్రతిరోజు సోలార్ ఆన్గ్రిడ్ సిస్టమ్స్ ద్వారా ఉత్పత్తి అవుతున్న 8 యూనిట్లలో మట్టెవాడ స్కూల్ నాలుగు నుంచి ఐదు యూ నిట్లను వినియోగించుకుంటుండగా మిగిలిన యూని ట్లు ఎన్పీడీసీఎల్ గ్రిడ్కు చేరుతాయి. ఇందుకోసం సోలార్ ఆన్గ్రిడ్ సిస్టమ్స్ అమర్చిన పాఠశాలలో నెట్ మీటరు ఏర్పాటు చేశారు. గ్రిడ్కు వెళ్లిన యూనిట్లను ప్రతి 6 నెలలకు ఒకసారి నెట్ మీటరు ద్వారా లెక్కిం చి ఎన్పీడీసీఎల్ అధికారులు ఆయా పాఠశాలకు జమ చేస్తారు. ఇలా తమ గ్రిడ్లో ఉన్న విద్యుత్కు యూనిట్కు రూ.4.20 చొప్పున స్కూల్కు చెల్లిస్తారు. సోలా ర్ ఆన్గ్రిడ్ సిస్టమ్స్ ఏర్పాటు పూర్తయిన 11 స్కూళ్ల లో కొద్దిరోజుల నుంచి ఇదే విధానం అమలవుతున్న ది. విడుతల వారీగా అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఈ సోలార్ ఆన్గ్రిడ్ సిస్టమ్స్ ఏర్పాటు చేయనున్నారు.