వరంగల్, ఏప్రిల్ 30 (నమస్తేతెలంగాణ): కేంద్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం పార్లమెంటు ఎన్నికలను స్వేచ్ఛాయుత, ప్రశాంత, పారదర్శక వాతావరణంలో నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి, వరంగల్ కలెక్టర్ పి.ప్రావీణ్య చెప్పారు. వరంగల్ కలెక్టరేట్లో మంగళవారం ఆమె విలేకరుల సమావేశం నిర్వహించారు. వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి బరిలో నిలిచిన అభ్యర్థుల పేర్లు ఖరారయ్యాయని, వారికి గుర్తులు కూడా కేటాయించామని ప్రావీణ్య వెల్లడించారు. వరంగల్ లోక్సభ నియోజకవర్గంలో 42 మంది అభ్యర్థులు బరిలో నిలిచారన్నారు. వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో 1900 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశామని, ప్రతి సెంటర్లో మూడు ఈవీఎంలు ఏర్పాటు చేస్తున్నట్లు ఆర్వో తెలిపారు. వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో 18,24,466 ఓటర్లు, 1,026 మంది సర్వీస్ ఓటర్లు ఉన్నట్లు చెప్పారు. దివ్యాంగులు సౌకర్యవంతంగా ఓటు వేసేలా అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. దీనికితోడు పార్లమెంట్ పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో యువ, దివ్యాంగ, మహిళల కోసం మోడల్ పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. మొత్తం 247 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించినట్లు ప్రావీణ్య వివరించారు. 1309 పోలింగ్ కేంద్రాల్లో లైవ్ వెబ్ కాస్టింగ్, 397 కేంద్రా ల బయట సీసీటీవీ కవరేజ్, 497 మంది మైక్రో అబ్జర్వర్లు, అధిక భద్రత సిబ్బంది నియామకంతో కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నామని అన్నారు.
ఈ నెల 13న జరుగనున్న పోలింగ్కు సుమారు 8,685 మంది పోలింగ్ సిబ్బందిని కేటాయించామని కలెక్టర్ అన్నారు. ఇప్పటి వరకు రూ. 6,33,31,072 విలువైన నగదు, బంగారం, గంజాయి, లికర్ను సీజ్ చేసినట్లు తెలిపారు. 385 మందిపై ఎఫ్ఐఆర్లను నమోదు చేశామన్నారు. కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయగా 1950 టోల్ఫ్రీ నంబర్కు 143 ఫిర్యాదులు వచ్చినట్లు చెప్పారు. అలాగే, సీ విజిల్ ద్వారా 41, సోషల్ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా 1, రాతపూర్వకంగా 3, ఎన్జీఎస్ పోర్టల్ ద్వారా మొత్తం 817 ఫిర్యాదులను పరిష్కరించామన్నారు.
ఎన్నికల సామగ్రి డిస్ట్రిబ్యూషన్, రిసెప్షన్ సెంటర్లు పాలకుర్తి, స్టేషన్ఘన్పూర్ అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందినవి జనగామలో, భూపాలపల్లికి చెందినవి భూపాలపల్లి జిల్లాకేంద్రంలో, హనుమకొండ జిల్లాలోని వరంగల్ పశ్చిమ, పరకాల అసెంబ్లీ సెగ్మెంట్లు, వరంగల్ జిల్లాలోని తూర్పు, వర్ధన్నపేట డిస్ట్రిబ్యూషన్ రిసెప్షన్ కేంద్రాలు ఎనుమాముల మారెట్ యార్డులో ఏర్పాటు చేసినట్లు తెలిపారు. వరంగల్ పార్లమెంట్ పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్ల కౌంటింగ్ కోసం జూన్ 3న ఏనుమాముల మారెట్ యార్డులోని 17, 18, 19 నంబర్ల గోడౌన్లలో ఏర్పాట్లు చేస్తున్నట్లు ప్రావీణ్య వెల్లడించారు. ఎన్నికలను నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్ ఝా చెప్పారు. నిబంధనలకు అనుగుణంగా పోలీస్ సిబ్బందికి శిక్షణ ఇచ్చామన్నారు. పోలింగ్ కేంద్రాలు, స్ట్రాంగ్ రూంల వద్ద పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేస్తామన్నారు. ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో వెబ్ కాస్టింగ్ నిర్వహిస్తారని చెప్పారు. సమావేశంలో సహాయ ఆర్వో, డీఆర్వో శ్రీనివాస్, జిల్లా పౌర సంబంధాల అధికారి ఆయుబ్ అలీ, ఎన్నికల పర్యవేక్షకుడు విశ్వన్నారాయణ, వరంగల్ జిల్లా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు పాల్గొన్నారు.