వర్ధన్నపేట, ఫిబ్రవరి 3 : మున్సిపాలిటీ ఎన్నికల వేళ వర్ధన్నపేట కాంగ్రెస్లో ముసలం పుట్టింది. పార్టీ కోసం మొదటి నుంచి ఉన్న వారిని పక్కనపెట్టి బయటి నుంచి వచ్చిన వారికే అందలం ఎక్కిస్తారా?.. అని ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు రగిలిపోతున్నారు. వర్ధన్నపేట మున్సి పాలిటీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు స్థానిక ఎమ్మెల్యే నాగరాజు మంగళవారం 12 వార్డులకు సంబంధించి నామినేషన్లు దాఖలు చేసిన వారికి బీఫామ్లు అందజేశారు. అధికారం ఉన్నా లేకున్నా పార్టీనే నమ్ముకున్నోళ్లకు తీవ్ర అన్యాయం జరిగిందని, పైసలు ఇచ్చిన వారికే పార్టీ బీఫామ్ ఇచ్చారని సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం సాగుతున్నది. ఇటీవలే కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్న వ్యక్తికి బీఫామ్ ఇవ్వడంపై ఆపార్టీ నాయకులు పెదవి విరుస్తున్నారు.
రియల్ ఎస్టేట్ వ్యాపారంతో పాటుగా పలు ఇబ్బందికర పనులు చేసిన వ్యక్తికి బీఫామ్ ఇవ్వడంపై ఓ వార్డు నుంచి టికెట్ ఆశించిన కాంగ్రెస్ కార్యకర్త ఆ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. సదరు రియల్ ఎస్టేట్ వ్యాపారి నుంచి రూ. కోటికి బేరం కుదుర్చుకొని బీఫామ్ ఇవ్వడంతో పాటుగా చైర్మన్ పదవి కూడా కట్టబెట్టేందుకు ప్రయత్నిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. సోషల్ మీడియాలో ఈ విషయంపై విస్తృతంగా ప్రచారం జరుగుతుండడంతో చైర్మన్ పోస్టుకు రూ. కోటి అనేది హాట్టాపిక్గా మారింది. కేవలం తనకు భజన చేసే వారిని మాత్రమే తన చుట్టూ ఉంచుకుంటూ పార్టీ కోసం ఏళ్ల తరబడి పనిచేసిన వారిని పక్కకు పెడుతున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ఇందులో భాగంగానే మున్సిపాలిటీ ఎన్నికల సందర్భంగా వార్డుల కౌన్సిలర్గా పోటీ చేసే వారికి టికెట్లు ఇచ్చే విషయంపై మరింత వివాదం రాజుకుంటున్నది. దీంతో పట్టణ ప్రజలు కాంగ్రెస్ పార్టీ తీరుపై విస్తృతంగా చర్చించుకుంటున్నారు.