వైరా టౌన్ (కొణిజర్ల), ఆగస్టు 10 : ఆర్ఎంపీ ఇచ్చిన ఇంజెక్షన్ వికటించడంతో ఓ విద్యార్థిని మృతిచెందిన ఘటన ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం బస్వాపురంలో ఆదివారం రాత్రి చోటుచేసుకున్నది. చల్లా రమేశ్-మౌనిక దంపతుల కుమార్తె హిమశ్రీ (14) కొణిజర్లలోని కేజీబీవీలో 8వ తరగతి చదువుతున్నది. జలుబు, జ్వరంతో బాధపడుతుండటంతో ఆదివారం తల్లిదండ్రులు ఆమెను స్థానిక ఆర్ఎంపీ సంపత్ వద్దకు తీసుకెళ్లగా ఆయన ఓ ఇంజెక్షన్ ఇచ్చాడు. తర్వా త అది రియాక్షన్ కావడంతో బాలిక శ్వాస తీసుకోవడానికి ఇబ్బందిపడింది. దీంతో కుటుంబ సభ్యులు ఖమ్మంలోని ప్రైవేటు దవాఖానకు తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ మృతిచెందింది. ఆర్ఎంపీ కారణంగానే బాలిక మృతిచెందినట్టు తల్లిదండ్రులు ఆరోపించారు.
ప్రాణం తీసిన రూ.600 లొల్లి ; రావాల్సిన డబ్బులు అడిగితే దాడి మనస్తాపంతో ట్రాక్టర్ డ్రైవర్ ఆత్మహత్య
జగిత్యాల రూరల్, ఆగస్టు 10: ఆరు వందల రూపాయల లొల్లి ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకున్నది. తనకు రావాల్సిన డబ్బులు ఇవ్వాలని అడిగినందుకు సదరు వ్యక్తి దాడి చేయడంతో బాధితుడు ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. జగిత్యాల రూరల్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జగిత్యాల రూరల్ మండలం వెల్దుర్తికి చెందిన బందెల రమేశ్ (38) ట్రాక్టర్ డ్రైవర్గా పనిచేస్తున్నాడు. గతంలో తాను డ్రైవర్గా పనిచేసినప్పుడు రావాల్సిన రూ.600 ఇవ్వకపోవడంతో రమేశ్ ఇటీవల గడ్డం గంగారెడ్డిని దూషించాడు. దీంతో కోపం పెంచుకున్న గంగారెడ్డి ఆదివారం ఉదయం మరో వ్యక్తితో కలిసి రమేశ్ ఇంటికి వెళ్లి దాడి చేశాడు. దీంతో మనస్తాపానికి గురైన రమేశ్ ఆదివారం ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. భార్య మల్లేశ్వరి సోమవారం ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు. గంగారెడ్డి, అజయ్ రావును పోలీసులు అరెస్ట్ చేశారు.