ఆర్థికంగా వెనుకబడిన గొల్ల, కురమల జీవితాల్లో వెలుగులు నింపడమే లక్ష్యంగా రాష్ట్ర సర్కారు గొర్రెల పంపిణీ పథకానికి శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా మొదటి విడుత పంపిణీతో ఆశించిన ఫలితాలు రావడంతో రెండో విడుత పంపిణీకి సిద్ధమైంది. మొదటి విడుతలో యూనిట్ ధర రూ.1.25లక్షలు ఉండగా, ప్రస్తుతం పెరిగిన ధరల దృష్ట్యా రూ.50వేలు పెంచింది. రూ.1.75లక్షల్లో పెంపకందారులు రూ.43,750 డీడీ రూపంలో చెల్లించాలి. మిగతా రూ.1,31,250 ప్రభుత్వం సబ్సిడీ కింద లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలో జమ చేయనున్నది. కాగా, జిల్లాలో 227 సొసైటీలు ఉండగా వీటి పరిధిలో రెండో విడుతకు 11,868 మందిని ఎంపిక చేసి, వీరితో బ్యాంకు ఖాతాలు తీయించి లబ్ధిదారుల వాటాను డీడీల రూపంలో జమ చేయిస్తున్నారు. ఈ నెల 10వ తేదీ వరకు ఈ ప్రక్రియను పూర్తి చేసి, దశల వారీగా యూనిట్ల పంపిణీకి ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక గొర్రెల కొనుగోలు, పంపిణీలో అత్యంత పారదర్శకత కోసం ప్రభుత్వం ప్రత్యేక యాప్ను రూపొందించింది. ఇందులో గొర్రెల కొనుగోలు నుంచి మొదలుకొని లబ్ధిదారుల ఇంటికి చేర్చే వరకు వివరాలు ఫొటోలతో సహా అప్లోడ్ చేయనున్నారు.
మహబూబాబాద్ రూరల్, ఆగస్టు 5 : ప్రజా సంక్షేమమే లక్ష్యంగా తెలంగాణలో పరిపాలన కొనసాగుతున్నది. రాష్ట్రంలోని అన్ని వర్గాలకు మేలు జరిగేలా సీఎం కేసీఆర్ అనేక పథకాలను అమలు చేస్తున్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో కులవృత్తులకు జీవం పోస్తున్నారు. ఇందులో భాగంగా రాష్ట్ర సర్కారు ఆర్థికంగా వెనుకబడిన గొల్ల, కురుమల జీవితాల్లో వెలుగులు నింపి, ఆర్థిక పరిపుష్టి కల్పించేందుకు సబ్సిడీతో గొర్రెలను పంపిణీ చేస్తున్నది. ఇప్పటికే మొదటి విడుత గొర్రెల పంపిణీ కార్యక్రమం పూర్తయి, సత్ఫలితాలు రావడంతో త్వరలోనే రెండో విడుత పంపిణీకి పచ్చజెండాను ఊపింది. మరోవారం రోజుల్లో ఈ ప్రక్రియను పూర్తి చేయాలని మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ జిల్లా అధికారులను ఆదేశించడంతో కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు. ప్రస్తుతం పెరిగిన ధరల దృష్ట్యా యూనిట్ విలువను పెంచింది. మొదటి విడుతలో ఒక్కో యూని ట్ ధర రూ.1.25లక్షలు ఉండగా, 20 గొర్రెలు, ఒక పొట్టేలు అందజేశారు. ఇందులో ప్రభుత్వం రూ. 93,750 సబ్సిడీ రూపంలో అందించింది. లబ్ధిదారుడి వాటా కింద రూ.32,500 చెల్లించారు. కాగా, రెం డో విడుతలో యూనిట్ ధరను రూ.50వేలు పెంచా రు. అంటే యూనిట్ ధర రూ.1.75లక్షలు కాగా,ఇందులో పెంపకందారులు రూ.43,750 డీడీ రూపంలో చెల్లించాలి. మిగతా రూ.1,31,250 ప్రభుత్వం సబ్సిడీ కింద లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలో జమ చేయనున్నది. జిల్లాలో రెండో విడుత కింద జిల్లాలో 11,868 మందిని జిల్లా అధికారులు ఎంపిక చేశారు. ఈ నెల మొదటి వారంలో వారితో బ్యాంకు ఖాతాలు తీయించి, 10వ తేదీ నుంచి దశలవారీగా గొర్రెలు పంపిణీ చేసేందుకు రెడీ అవుతున్నారు.
గొర్రెల కొనుగోలు, పంపిణీలో అత్యంత పారదర్శకత కోసం ప్రభుత్వం ప్రత్యేక యాప్ను రూపొందించింది. కొనుగోలు చేసిన గొర్రెల సంఖ్యను యాప్లో నమోదుచేయడంతోపాటు లొకేషన్, గొర్రెల ఫొటోలను ఇందులో నిక్షిప్తం చేస్తారు. కొనుగోలు సమయంలో గొర్రెలను వాహనంలో ఎక్కించే ఫొటోలు మొదలుకొని, లబ్ధిదారుడి ఇంటికి చేర్చేవరకు వివరాలు, ఫొటోలు యాప్లో ఉంటాయి. గొర్రెలకు సంబంధించిన లైవ్ వివరాలను మాత్రమే ఈ యాప్ స్వీకరిస్తుంది.
మండలాల వారీగా లబ్ధిదారులు
జిల్లాలోని 227 గొల్ల, కురుమ సొసైటీలున్నాయి. అధికారులు ఈ సొసైటీల నుంచి మండలాల వారీగా లబ్ధిదారులను ఎంపికచేసి డీడీలు తీయిస్తున్నారు. బయ్యారం మండలంలో 631 మంది, చిన్నగూడూరులో 293, దంతాలపల్లిలో 614, డోర్నకల్లో 711, గంగారంలో 45, గార్లలో 482, గూడూరులో 711, కేసముద్రంలో 1438, కొత్తగూడలో 626, కురవిలో 947, మానుకోటలో 1321, మరిపెడలో 881, నర్సింహులపేటలో 331, నెల్లికుదురులో 1016, పెద్దవంగరలో 710, తొర్రూరులో 1113 మంది లబ్ధిదారులుగా ఎంపిక చేశారు.
త్వరలోనే పంపిణీ
రెండో విడుత గొర్రెల పంపిణీకి ప్రభుత్వం గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. జిల్లాలోని 16 మండలాల్లో 11,868 మంది లబ్ధిదారులను ఎంపిక చేశాం. ఈ వారంలో అందరితో డీడీలు తీయించాలని అధికారులు ఆదేశించాం. తెలంగాణ ప్రభుత్వ సూచనల మేరకు పంపిణీ చేస్తాం. ఇప్పటికే సొసైటీల వారీగా అందరికీ సమాచారం అందించాం. పంపిణీ తేదీలు త్వరలోనే ఖరారయ్యే అవకాశం ఉంది.
– సుధాకర్, జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి