సార్వత్రిక సమ్మె రెండోరోజూ కొనసాగింది. మంగళవారం పలు కార్మిక సంఘాలు నిరసన ర్యాలీలు నిర్వహించాయి. కేంద్రంలోని మోడీ సర్కార్కు వ్యతిరేకంగా కార్మికులు చేసిన నినాదాలు హోరెత్తాయి. బీజేపీ ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా, కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ వరంగల్ రైల్వేస్టేషన్ నుంచి వరంగల్ చౌరస్తా వరకు భారీ ర్యాలీ తీశారు. తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ హాజరయ్యారు. కష్టజీవుల వ్యతిరేక పార్టీ బీజేపీ అని, పేదలను కొట్టి కార్పొరేట్ శక్తులకు పెడుతున్నదని మండిపడ్డారు. నర్సంపేట, వర్ధన్నపేట, పర్వతగిరి, సంగెం, నల్లబెల్లి మండలకేంద్రాల్లో ఆందోళన, రాస్తారోకో, బైక్ ర్యాలీలు జరిగాయి. తహసీల్దార్, ఎంపీడీవోలకు వినతిపత్రాలు అందజేశారు. వరంగల్ మట్టెవాడలో తెలంగాణ ఆటోట్రాలీ డ్రైవర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ర్యాలీ తీసి, కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ గేటు ఎదుట రోడ్డుపై కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ స్వచ్ఛ ఆటోల యూనియన్ సంపూర్ణ మద్దతు ప్రకటించింది.
– నమస్తే తెలంగాణ, నెట్వర్క్
కార్మిక చట్టాలను కాలరాస్తూ.. పెట్రో ధరల పెంపుతో పేద, మధ్యతరగతి ప్రజల నడ్డివిరుస్తూ.. ప్రభుత్వరంగ సంస్థలను అప్పనంగా కార్పొరేట్కు కట్టబెడుతూ ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న కేంద్రంలోని మోదీ సర్కారుపై కార్మికులు, ఉద్యోగులు కన్నెర్రచేశారు. దేశవ్యాప్త సమ్మెలో భాగంగా రెండో రోజైన మంగళవారం బీజేపీ మినహా అన్ని కార్మిక, ఉద్యోగ సంఘాలు, అఖిలపక్ష పార్టీల నాయకులు కలిసి ఉమ్మడి జిల్లా అంతటా నిరసనలతో హోరెత్తించారు. మోదీ సర్కారుకు వ్యతిరేకంగా అన్ని జిల్లాల్లో సంఘీభావ ర్యాలీలు, రాస్తారోకోలు, ధర్నాలు, మానవహారాలు, కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మలు దహనం చేశారు. ఈ సందర్భంగా హనుమకొండలో టీఎన్జీవోలు నల్లబ్యాడ్జీలు ధరించి కలెక్టరేట్ వద్ద భారీ నిరసన తెలిపారు. ఇన్కంటాక్స్ పరిధిని పెంచాలని, సీపీఎస్ను రద్దుచేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని వారు డిమాండ్ చేశారు. అలాగే బ్యాంకు ఉద్యోగులు, అంగన్వాడీ టీచర్లు, వర్కర్లు ర్యాలీగా వచ్చి కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలతో నిరసన గళం వినిపించారు. ఉద్యోగుల మహా ధర్నాతో హనుమకొండలోని విద్యుత్ భవన్ దద్దరిల్లింది. వరంగల్లో అన్ని ట్రేడ్ యూనియన్ల ఆధ్వర్యంలో రైల్వేస్టేషన్ నుంచి పోచమ్మమైదాన్ వరకు భారీ ర్యాలీ తీయగా, ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ పాల్గొని బీజేపీ సర్కారు తీరును ఎండగట్టారు. మహబూబాబాద్ జిల్లాకేంద్రంలో ఏఐటీయూసీ, సీఐటీయూ, ఐఎఫ్టీయూ. టీఆర్ఎస్కేవీ, ఐఎన్టీయూసీ, టీఎన్టీయూసీ, బ్యాంక్, ఇన్సూరెన్స్, రక్షణ, కేంద్రప్రభుత్వ ఉద్యోగ, పెన్షనర్ల ఫెడరేషన్ల ఆధ్వర్యంలో వ్యవసాయ మార్కెట్ నుంచి తహసీల్ వరకు భారీ ర్యాలీ తీసి ప్రజా వ్యతిరేక విధానాలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే సింగరేణి కార్మికులు సమ్మెలో పాల్గొనడంతో నల్లనేల బోసిపోయింది. దీంతో భూపాలపల్లిలోని గనులు, పని ప్రదేశాలు వెలవెలబోయాయి. ప్రైవేటీకరణ పేరుతో ఉద్యోగ, ఉపాధి అవకాశాలకు గండి కొడుతున్న మోదీ సర్కారును కార్మిక సంఘాలన్నీ సమష్టిగా ఉద్యమించి గద్దె దింపాలని నేతలు పిలుపునిచ్చారు.
– నమస్తే నెట్వర్క్