డోర్నకల్, జూన్ 15 : పాఠశాలకు వెళ్లిన విద్యార్థులు, ఉపాధ్యాయులకు తొలిరోజే చేదు అనుభవం ఎదురైంది. ప్రాథమిక పాఠశాల అభివృద్ధి పనులకు సంబంధించిన పెండింగ్ బిల్లు చెల్లించలేదని ఏకంగా ఓ కాంట్రాక్టర్ పాఠశాల గేట్కు తాళం వేశారు. వివరాల్లోకి వెళితే.. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం పెరుమాండ్ల సంకీస గ్రామంలోని ఎంపీపీఎస్ పాఠశాలలో కాంట్రాక్టర్ రామనాథం ‘మన ఊరు – మన బడి’ కార్యక్రమంలో భాగంగా 2023లో పలు అభివృద్ధి పనులు చేపట్టారు.
మొత్తం బిల్లులు రూ.40 లక్షలు కాగా, రూ.7 లక్షలు మాత్రమే వచ్చాయని, మిగిలిన రూ.33 లక్షలు బిల్లులు ఇంకా పెండింగ్లోనే ఉన్నాయన్నారు. పెండింగ్ బిల్లుల కోసమే ఎంపీపీఎస్ పాఠశాల గేట్కు తాళం వేసినట్లు తెలిపారు. మండల విద్యాశాఖ అధికారి అంగోత్ లక్ష్మా, ఎస్సై ఝాన్సీ, ఉపాధ్యాయులు కాంట్రాక్టర్ రామనాథంతో మాట్లాడడంతో సమస్య సద్ధుమణిగింది. రెండు గంటల తర్వాత విద్యార్థులను పాఠశాల భవనంలోకి పంపించారు. అనంతరం డీఈవో సత్యనారాయణమూర్తి పాఠశాలను తనిఖీ చేసి, అభివృద్ధి పనులు, పెండింగ్ బిల్లుల వివరాలు సేకరించారు.