శాయంపేట, ఏప్రిల్ 1 : ఎట్టకేలకు ప్రాథమిక చేనేత సహకార సంఘాల ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం సిద్ధమైంది. ఇప్పటికే ఓటర్ల జాబితా తయారీకి షెడ్యూల్ విడుదల చేయడంతో పాటు ఈ నెల 4 నుంచి 33 రోజుల సమాయాన్ని ఇచ్చింది. మేలో ఎలక్షన్ నోటిఫికేషన్ ఇచ్చేందకు సిద్ధమవుతున్నట్లు తెలిసింది. 2018 ఫిబ్రవరిలోనే సంఘాల పదవీకాలం ముగియగా దానిని పొడిగిస్తూ వస్త్తున్నారు. కాగా, ఉమ్మడి వరంగల్ జిల్లాలో 66 సంఘాల్లో 11,098 మంది సభ్యులున్నారు. గతంలో చేనేత, జౌలిశాఖ అసిస్టెంట్ డైరెక్టర్ ఆధ్వర్యంలో ఎన్నికలు నిర్వహించగా, ప్రస్తుతం రాష్ట్రంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కోఆపరేటివ్ అథారిటీ ఎలక్షన్స్ జరుగుతాయి.
ఈసారి సంఘంలో వాటాధనం రూ. 300 కంటే తక్కువున్న, చనిపోయిన, రాజీనామా చేసిన వారితో పాటు డిఫాల్టర్ల పేర్ల తొలగింపు చేపట్టడంతో పాటు ఓటర్ల జాబితాలో ఫొటోను తప్పనిసరి చేశారు. అలాగే ఏడాది ముందుగా సభ్యుడైన వారికే ఓటు హక్కు కల్పించడంతో కొత్త ఓటర్లకు అవకాశం లేకుండా పోయింది. ఎన్నికల ఖర్చును సంఘాలే భరించాల్సి ఉంటుంది. ఇందుకోసం ప్రతి సంఘం జాబితాతో పాటు రూ. 5 వేల డీడీనీ అథారిటీకి పంపించాలి. ఒక్కో సంఘంలో తొమ్మిది మంది డైరెక్టర్లను బ్యాలెట్ పద్ధతిన ఎన్నుకోవాలి. వీరిలో ఏడుగురు పురుషులు, ఇద్దరు మహిళలు ఉండనున్నారు. వచ్చిన నామినేషన్ల ఆధారంగా గుర్తులు కేటాయించి ఎన్నికలు నిర్వహించడం లేదా ఏకగ్రీవాలను ప్రకటించడం ఉంటుంది.
హనుమకొండ జిల్లాలో 17 సంఘాల్లో 2,898 మంది సభ్యులున్నారు. అలాగే జనగామ జిల్లాలో 12 సంఘాల్లో 1,500, వరంగల్లో 30 సొసైటీల్లో 5,300, భూపాలపల్లిలోని ఏడు సంఘాల్లో 1,400 మంది సభ్యులున్నట్లు అధికారులు తెలిపారు. మహబూబాబాద్, ములుగు జిల్లాల్లో చేనేత సంఘాలు లేవని అధికారులు స్పష్టం చేశారు.