కురవి, మే 14 : రాష్ట్రంలో బీఆర్ఎస్ను గ్రామ స్థాయి నుంచి మరింత బలోపేతం చేయడానికి కృషి చేస్తామని మాజీ మంత్రి సత్యవతిరాథోడ్ అన్నారు. మహబూబాబాద్, ములుగు, భూపాలపల్లి జిల్లాల్లోని పార్టీ ప్రతినిధులు, కార్యకర్తలు, నాయకులను సమన్వయం చేసుకొని అధినేత కేసీఆర్ తనపై పెట్టిన బాధ్యతను సమర్ధవంతంగా నిర్వర్తిస్తానన్నారు. గురువారం ఆమె కురవి వీరభద్రస్వామిని దర్శించుకున్న అనంతరం విలేకరులతో మాట్లాడారు.
రాష్ట్ర ప్రజలకు బీఆర్ఎస్ రక్షణ కవచంలా నిలుస్తున్నదని, కేసీఆర్ నాయకత్వంపై ప్రజలకు అపార విశ్వాసం ఉందన్నారు. పార్టీ బలోపేతం కోసం గ్రామ, మండల, జిల్లా స్థాయిలో క్రమశిక్షణతో పనిచేసిన కార్యకర్తలకు అవకాశాలు కల్పిస్తామన్నారు. సభ్యత్వ నమోదుతో ప్రతి గ్రామంలో పార్టీ నిర్మాణాన్ని చేపట్టనున్నట్లు తెలిపారు. అధికారంలో ఉన్న పార్టీలు తమ నిర్ణయాలతో ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నాయని, ఒక్క బీఆర్ఎస్ మాత్రమే వారి పక్షాన పోరాడుతున్నదని సత్యవతి పేర్కొన్నారు.