హైదరాబాద్, ఆగస్టు 13 : అమెరికాకు చెందిన డీప్-టెక్, ఎంటర్ప్రైజెస్ టెక్నాలజీ సేవల సంస్థ క్లౌడ్యాంగిల్స్..హైదరాబాద్లో గ్లోబల్ ఇంజినీరింగ్ సెంటర్ను ప్రారంభించింది. ఈ సెంటర్ను రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..అంతర్జాతీయ టెక్నాలజీ దిగ్గజాలు హైదరాబాద్ను తమ గమ్యస్థానాలుగా ఎంచుకోవడం మంచి పరిణామమని, ఇక్కడ ప్రతిభ కలిగిన ఉద్యోగులు లభిస్తుండటంతో గ్లోబల్ సంస్థలు ఇక్కడ తమ రెండో ప్రధాన కార్యాలయాలను ఏర్పాటు చేయడానికి ముందుకు వస్తున్నారన్నారు.
మౌలిక సదుపాయాలపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించడం కూడా టెక్నాలజీ సంస్థలు ఇక్కడికి రావడానికి ఆసక్తి చూపుతున్నాయని, గడిచిన కొన్నేండ్లలో గ్లోబల్ టెక్నాలజీ దిగ్గజాలు ఇక్కడ కార్యాలయాలను తెరిచాయన్నారు. ఈ సందర్భంగా క్లౌడ్ యాంగిల్స్ సీఈవో ఎన్ రేవతిపతి మాట్లాడుతూ..ఇక్కడి నుంచి అంతర్జాతీయ క్లయింట్లకు సేవలు అందించడానికి ఈ సెంటర్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని, వచ్చే రెండేండ్లలో ఈ సెంటర్లో ఉద్యోగుల సంఖ్యను వెయ్యికి పెంచుకోనున్నట్టు ప్రకటించారు. ఏఐ, క్లౌడ్, డాటా, సాఫ్ట్వేర్ ఇంజినీరింగ్, ఆటోమేషన్ టెక్నాలజీ నిపుణులను తీసుకోనున్నట్టు తెలిపారు.