మేడారం జనసంద్రమైంది. వనదేవతలు సమ్మక్క-సారలమ్మల దీవెనలు అందుకునేందుకు లక్షలాదిగా భక్తజనం తరలివచ్చింది. మూడో రోజైన శుక్రవారం వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన లక్షా 20వేల మందితో మినీ జాతర జోరుగా సాగింది. ఈ సందర్భంగా తల్లులకు ఎత్తు బంగారం(బెల్లం), ఒడిబియ్యం, చీర సమర్పించి తల్లీ మము చల్లంగ చూడు అంటూ వేడుకున్నారు. మొక్కులు చెల్లించుకున్న అనంతరం భక్తులు అటవీ ప్రాంతంలో వంటావార్పు చేసుకొని సరదాగా గడిపారు.
– తాడ్వాయి, ఫిబ్రవరి 3
మేడారం మినీ జాతరలో భాగంగా మూడో రోజు భక్తజనం ప్రవాహంలా వచ్చింది. వివిధ ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలిరాగా, ఆదివాసీ గిరిజన దైవాలు మేడారం సమ్మక్క-సారలమ్మలను దర్శించుకునేందుకు బారులు తీరారు. తల్లులకు ఇష్టమైన బంగారాన్ని(బెల్లం), చీరె, ఒడిబియ్యం, పసుపు, కుంకుమలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. వరాల తల్లీ.. చల్లంగ చూడమ్మా.. అంటూ భక్తిశ్రద్ధలతో తల్లుల గద్దెలకు గిరిజన సంప్రదాయ పద్ధతుల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం తాడ్వాయి-మేడారం దారిలోని అటవీ ప్రాంతంలో వంటలు చేసుకొని కుటుంబసమేతంగా ఆరగించి సరదాగా గడిపారు. శుక్రవారం సుమారు లక్షా 20వేల మంది భక్తులు అమ్మవార్లను దర్శించుకున్నట్లు దేవాదాయశాఖ అధికారులు తెలిపారు. నేడు శనివారంతో మినీ జాతర ముగియనుండడంతో భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి అమ్మవార్లను దర్శించుకోనున్నారు.
– తాడ్వాయి, ఫిబ్రవరి 3
116 మంది భక్తుల అప్పగింత
తప్పిపోయిన వారి కోసం కలెక్టర్ ఆదేశాల మేరకు జాతర పరిసరాల్లో నాలుగు శిబిరాలు ఏర్పాటు చేశారు. జాతరలో ఈ నెల 1 నుంచి 3వ తేదీ తప్పిపోయిన 116 మంది భక్తులను మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ అధికారులు వారి బంధువులకు అప్పగించారు. ఐటీడీఏ పీవో అంకిత్ శుక్రవారం ఆయా శిబిరాలను సందర్శించి భక్తులకు అందిస్తున్న సేవల వివరాలను అడిగి తెలుసుకున్నారు. భక్తులను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ పలు సూచనలు చేయాలని సిబ్బందికి తెలియజేశారు. తప్పిపోయిన వ్యక్తుల వివరాలను పలుమార్లు మైక్లలో అనౌన్స్ చేస్తూ వారి బంధువులను అప్రమత్తం చేయాలని, ఎవరూ తప్పిపోకుండా చూడాలని ఆయా శిబిరాల ఇన్చార్జిలకు పీవో సూచించారు.