వరంగల్, జూన్ 29 (నమస్తేతెలంగాణ) /వరంగల్ : తెలంగాణ ఉద్యమకారుడు, ప్రముఖ జానపద గాయకుడు, రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ సాయిచంద్ హఠాన్మరణం ఉమ్మడి జిల్లాను కుదిపేసింది. విద్యార్థి దశ నుంచి కళాకారుడిగా, గాయకుడిగా పేరుతెచ్చుకున్న సాయిచంద్ మలిదశ తెలంగాణ ఉద్యమంలో తన పాటలతో స్ఫూర్తిని రగిలించారు. తెలంగాణ ఆవిర్భావం అనంతరం రాష్ట్ర ప్రగతి, సంక్షేమ పథకాలను తన పాటల ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లారు. ఉద్యమ సమయంలో ఎక్కడ సభ జరిగినా సాయిచంద్ పాటలు ప్రజల్లో జోష్ నింపాయి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా జరిగిన అనేక ధూంధాంలలో ఆయన ఆడిపాడారు. ఉద్యమకారులతో కలిసి కదం తొక్కారు. వందలాది మంది జానపద గాయకులకు ఆయన రోల్ మోడల్గా నిలిచారు. నాడు ఉద్యమ సారథి కేసీఆర్ సభ ఎక్కడ పెట్టినా సాయిచంద్ పాటలతోనే ప్రారంభమయ్యేది. నేడు సీఎం కేసీఆర్ సభ ఎక్కడ నిర్వహించినా ఆయన వ్యాఖ్యానంతోనే మొదలయ్యేది. సాయిచంద్ హఠాన్మరణాన్ని ఉమ్మడిజిల్లాలోని ఉద్యమకారులు జీర్ణించుకోలేక పోతున్నారు. తనతో ఉన్న అనుబంధాన్ని నెమరేసుకొని కన్నీటి పర్యంతమవుతున్నారు. ఓరుగల్లు బిడ్డ మిట్టపల్లి సురేందర్ కలం నుంచి జాలువారిన ‘రాతిబొమ్మల్లోన కొలువైన శివుడా.. రక్తబంధం విలువ నీకు తెలియదురా’ అనే పాటను మలిదశ ఉద్యమంలో తొలి ఆమరుడు శ్రీకాంతాచారి పేరున పాడితే నాటి ఉద్యమ నాయకులు వేదికపైనే కన్నీరు పెట్టుకున్నారు. లక్షాలాదిగా హాజరైన ప్రజల కళ్లు చెమ్మగిల్లాయి.
విడదీయరాని అనుబంధం..
ఉమ్మడి వరంగల్తో సాయిచంద్కు విడదీయరాని అనుబంధం ఉంది. పరకాల, స్టేషన్ ఘన్పూర్ ఉప ఎన్నికల్లో సాయిచంద్ విస్తృత ప్రచారం చేశారు. నాటి విద్యార్థి ఉద్యమ నాయకులుగా ఉన్న వాసుదేవారెడ్డి, జోరిక రమేశ్, ఇండ్ల నాగేశ్వర్రావుతో కలిసి పల్లెపల్లెనా ధూంధాంలు నిర్వహించారు. ఏడాది క్రితం స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గం శోడాషపల్లిలో జరిగిన బహిరంగ సభలో సాయిచంద్ పాటలతో జోష్ నింపారు. నెల క్రితం పశ్చిమ నియోజకవర్గంలో మంత్రి కేటీఆర్ పర్యటన నేపథ్యంలో సెయింట్ గ్యాబ్రియల్ మైదానంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో నిర్వహించిన సాంస్కృతి కార్యక్రమాలకు సాయిచంద్ నేతృత్వం వహించారు. ప్రభుత్వ చీఫ్విప్ వినయ్భాస్కర్, ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డికి సాయిచంద్ సన్నిహితుడు.
2010, జనవరి 23న జేఏసీ ఆధ్వర్యంలో నర్సంపేట పట్టణంలో జరిగిన తెలంగాణ ప్రజాగర్జన సభలో సాయిచంద్ నిర్వహించిన ధూంధాం అలరించింది.
2012లో జరిగిన పరకాల ఉప ఎన్నికల ప్రచారంలో సాయిచంద్ పాల్గొన్నారు. బోయినపల్లి వినోద్కుమార్తో కలిసి సంగెం మండలంలో పర్యటించి పలు ధూంధాంలు నిర్వహించారు.
2023, మే 12న నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి ఆహ్వానం మేరకు మంత్రులు ఎర్రబెల్లి దయాకర్రావు, నిరంజన్రెడ్డితో కలిసి దుగ్గొండి మండలంలోని చలపర్తి గ్రామానికి గిడ్జంగుల కార్పొరేషన్ చైర్మన్ హోదాలో సాయిచంద్ వచ్చారు. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం నిర్మించిన గిడ్డంగుల ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. సాయిచంద్ హఠాన్మరణంపై నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సాయిచంద్ చిత్రపటం వద్ద నివాళులర్పించారు. ఆయనతో తనకున్న ఉద్యమ అనుబంధం ఎంతో గొప్పదని గుర్తుచేసుకున్నారు.
భవిష్యత్ ఉన్న నాయకుడిని కోల్పోయాం
– జోరిక రమేశ్, మలిదశ తెలంగాణ ఉద్యమ నాయకుడు
రాజకీయాల్లో ఎంతో భవిష్యత్ ఉన్న నాయకుడు సాయిచంద్ హఠాన్మరణం తీరని వేదనను మిగిల్చింది. మలిదశ తెలంగాణ ఉద్యమంలో మేము కలిసి పని చేశాం. ముఖ్యంగా పరకాల ఉప ఎన్నికల్లో ఆయనతో కలిసి ఊరూరా తిరిగి ధూంధాంలు నిర్వహించాం. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా తెలంగాణ ఉద్యమకారులతో ఆయనకు అనుబంధం ఉంది. ఆయన పాటలు ఉద్యమకారుల్లో స్ఫూర్తిని రగిలించాయి. సాయిచంద్ హఠాన్మరణం ఎంతో బాధించింది. ఆయన మరణం బీఆర్ఎస్ పార్టీకి తీరని లోటు.