సివిల్స్ ఫలితాల్లో మనోళ్లు సత్తా చాటారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం గుంటూరుపల్లికి చెందిన శాఖమూరి సాయిఆశ్రిత్ ఆలిండియా 40వ, తెలంగాణలో 1వ ర్యాంకు సాధించాడు. హనుమకొండ జిల్లాకు చెందిన జయసింహారెడ్డి ఆలిండియా 217, సాయికిరణ్ 460, రుత్విక్ సాయి 558, సాయికృష్ణారెడ్డి 640, మంద అపూర్వ 646వ ర్యాంకు సాధించి అదరగొట్టారు. వీరిని పలువురు అభినందించగా వారి తల్లిదండ్రులు, కుటుంబసభ్యుల ఆనందానికి అవధుల్లేకుండా పోయింది.
– నమస్తే తెలంగాణ నెట్వర్క్, మే 23
హనుమకొండ/హనుమకొండ చౌరస్తా/చిట్యాల, మే 23 : యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సివిల్ సర్వీసెస్-2022 ఫలితాల్లో జయశంకర్ భూపాలపల్లి, హనుమకొండ జిల్లాకు చెందిన ఆరుగురు సత్తా చాటారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం గుంటూరుపల్లికి చెందిన శాఖమూరి సాయి ఆశ్రిత్ 22 ఏళ్లకే సివిల్స్ సాధించి ఔరా అనిపించాడు. ఆలిండియా 40వ ర్యాంక్, తెలంగాణ 1వ ర్యాంక్తో మెరిసిపోయాడు. శాఖమూరి అమర్-పద్మజ దంపతులకు ఇద్దరు కొడుకులు కాగా ఆశ్రిత్ చిన్నవాడు. వీరు ప్రస్తుతం హనుమకొండలోని అడ్వకేట్ కాలనీలో నివాసముంటున్నారు.
అమర్ క్రెడాయ్(స్థిరాస్తి వ్యాపారుల సంఘం) కోశాధికారిగా పనిచేస్తున్నాడు. ఆశ్రిత్ వరంగల్ పబ్లిక్ స్కూల్లో 10వ తరగతి వరకు, హైదరాబాద్లోని శ్రీచైతన్య జూనియర్ కళాశాలలో ఇంటర్, రాజస్థాన్లోని బిట్స్(పిలానీ)లో బీటెక్ చదివాడు. హైదరాబాద్లోని సీబీఎస్ ఐఏఎస్ అకాడమీలో కోచింగ్ తీసుకున్నాడు. 2022లో యూపీఎస్సీ కండక్ట్ చేసిన సివిల్స్లో మొదటి ప్రయత్నంలోనే ఆలిండియా 40వ ర్యాంక్ సాధించాడు. మంచి ర్యాంకు సాధించిన శ్రీసాయి ఆశ్రిత్కు ప్రభుత్వ చీఫ్విప్ దాస్యం వినయ్భాసర్ ఫోన్లో శుభాకాంక్షలు తెలిపారు.
జయసింహారెడ్డికి 217
హనుమకొండ పోస్టల్ కాలనీలో నివాసం ఉంటున్న వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ సహపరిశోధన సంచాలకులు రావుల ఉమారెడ్డి, లక్ష్మి దంపతుల కొడుకు జయసింహారెడ్డి సివిల్స్లో ఆలిండియా స్థాయిలో 217 ర్యాంకు సాధించాడు. ఇంటివద్దే ఉంటూ ప్రిపేర్ అయ్యి మంచి ర్యాంకు సాధించడం గర్వకారణమని కాలనీవాసులు అభినందించారు. జయసింహారెడ్డిని రెడ్డిజేఏసీ ఆధ్వర్యంలో మంగళవారం ఘనంగా సన్మానించారు.
సాయికిరణ్కు 460
హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం కొత్తపల్లి మాజీ సర్పంచ్ పత్తిపాక కొమురెల్లి కుమారుడు సాయికిరణ్ సివిల్స్లో 460వ ర్యాంకు సాధించాడు. సాయికిరణ్ బీటెక్ చేసి కేరళలోని కోజికోడ్ యూనివర్సిటీలో ఎంబీఏ పూర్తి చేశాడు. ఏడాదికి రూ.18లక్షల వేతన ఒప్పందంతో హైదరాబాద్లోని క్రాంప్టన్ ఫ్యాన్స్ కంపెనీలో ఉద్యోగం చేశాడు. ఐఏఎస్ లక్ష్యంగా గతంలో రెండు సార్లు సివిల్స్ రాయగా మూడోసారి విజయం సాధించాడు. సాయికిరణ్ సివిల్స్లో అత్యుత్తమ ర్యాంకు సాధించడంపై గ్రామస్తులు, మండల ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.
కొట్టె రుత్విక్ సాయికి 558
హనుమకొండకు చెందిన కొట్టె రుత్విక్ సాయి సివిల్స్లో ఆల్ ఇండియా స్థాయిలో 558 ర్యాంకు సాధించి పలువురి మన్నలు పొందాడు. రాంనగర్లో నివాసం ఉండే సోషల్ వెల్ఫేర్ ఉద్యోగి కొట్టె రాధాకృష్ణారావు, మంజుల దంపతుల కొడుకు రుత్విక్ సాయి హనుమకొండలోని గురుకుల్ ద స్కూల్లో 10వ తరగతి, హైదరాబాద్లోని పేజ్ కళాశాలలో ఇంటర్, ఢిల్లీలోని శివనాధర్ యూనివర్సిటీలో బీటెక్ ఈసీఈ పూర్తి చేశాడు. ఇప్పటి వరకు ఐదు సార్లు సివిల్స్ రాయగా రెండు సార్లు మెయిన్స్ వరకు వెళ్లాడు. గత సంవత్సరం ఇంటర్వ్యూ వరకు వెళ్లి ప్రస్తుతం ఆల్ ఇండియా స్థాయిలో 558వ ర్యాంకు సాధించాడు. రుత్విక్ సాయిని కుటుంబ సభ్యులు, స్నేహితులు, కాలనీ వాసులు అభినందించారు.
సాయికృష్ణారెడ్డికి 640
వరంగల్ నిట్ సివిల్ ఇంజినీర్ (2016-2020) పూర్వ విద్యార్థి సాయికృష్ణారెడ్డి సివిల్స్లో 640వ ర్యాంకు సాధించాడు. అతను వరంగల్ నిట్ ఎన్ఎస్ఎస్ ప్రధాన కార్యదర్శిగా 2019-20 వరకు కొనసాగాడు. హైదరాబాద్కు చెందిన సాయికృష్ణారెడ్డి ప్రస్తుతం ఐటీ కంపెనీలో ఉద్యోగం చేస్తూ సివిల్స్లో సత్తా చాటాడు.
అపూర్వకు 646
కాకతీయ యూనివర్సిటీ అర్థశాస్త్ర ఆచార్యులు మంద అశోక్కుమార్, రజనీదేవి దంపతుల కూతురు మంద అపూర్వ సివిల్స్లో 646వ ర్యాంకు సాధించింది. హనుమకొండ ఎక్సైజ్కాలనీకి చెందిన అపూర్వ, ఉస్మానియా యూనివర్సిటీలో బీటెక్ పూర్తి చేసి ప్రస్తుతం ఎంటెక్ చేస్తున్నది. అపూర్వ తల్లి మంద రజనీదేవి భీమదేవరపల్లి మండలం మాణిక్యాపూర్ ప్రభుత్వ పాఠశాలలో టీచర్. అపూర్వకు ఇద్దరు అన్నయ్యలున్నారు. అపూర్వను శాతవాహన యూనివర్సిటీ మాజీ ఉపకులపతి ఆచార్య మహమ్మద్ ఇక్బాల్ అలీ, కేయూ అధ్యాపకులు ఆచార్య కూరపాటి వెంకటనారాయణ, ఆచార్య సారంగపాణి ఆచార్య వడ్డే రవీందర్, డాక్టర్ ఎర్రబొజ్జు రమేశ్ అభినందించారు.