వానకాలం పంట పెట్టుబడి డబ్బులు అన్నదాతల ఖాతాల్లో జమ
మొత్తం 1,84,485 మందికి రూ.201.19 కోట్లు విడుదల చేసిన రాష్ట్ర ప్రభుత్వం
ఈ ఏడాది 6,123 మంది కొత్తవారికి అవకాశం.. ఆనందం వ్యక్తం చేస్తున్న కర్షకులు
వానకాలం పంట పెట్టుబడి కోసం రైతుబంధు పథకం డబ్బులను మంగళవారం నుంచి రాష్ట్ర ప్రభుత్వం రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తున్నది. దీంతో అన్నదాతలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలోని 16 మండలాల పరిధిలో 1,84,485 మంది రైతులున్నారు. కొత్తగా 6,123 మంది ధరణి ద్వారా రిజిస్ట్రేషన్ చేయించుకొని పాస్బుక్లు పొందారు. వీరి వివరాలను వ్యవసాయశాఖ అధికారులు ఆన్లైన్లో నమోదు చేశారు. మొత్తం రూ.201.19 కోట్ల పెట్టుబడి సాయం అందనున్నది. ఏటా ప్రభుత్వం రైతులకు ఎకరానికి రూ.10వేలు అందిస్తున్నది. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా వర్షాలు పడడంతో రైతులు వ్యవసాయ పనుల్లో నిమగ్నమయ్యారు.
మహబూబాబాద్, జూన్ 28 (నమస్తే తెలంగాణ): రైతుల సంక్షేమమే ధ్యేయంగా అనేక పథకాలు అమలు చేస్తున్న సీఎం కేసీఆర్ రైతు బాంధవుడిగా నిలిచారు. ఇందులో భాగంగా వానకాలం పంట పెట్టుబడి కోసం రైతుబంధు పథకం డబ్బులను మంగళవారం నుంచి రాష్ట్ర ప్రభుత్వం రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తున్నది. పెట్టుబడి డబ్బులు తమ ఖాతాల్లో జమ అవుతుడడంతో అన్నదాతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రతి ఏటా ప్రభుత్వం రైతులకు పంట పెట్టుబడికోసం ఎకరాకు రూ.10వేలు అందిస్తున్నది. వానకాలం రూ.5వేలు, యాసంగి పంటకు రూ. 5వేలు వారి ఖాతాల్లో జమ చేస్తున్నది. జిల్లాలోని 16 మండలాల పరిధిలో 1,84,485 మంది రైతులు ఉన్నారు. ఇందులో కొత్తగా 6,123 మంది ధరణి ద్వారా రిజిస్ట్రేషన్ చేయించుకొని పాస్బుక్లు పొందారు. వీరు వివరాలను సైతం వ్యవసాయశాఖ అధికారులు ఆన్లైన్లో నమోదు చేశారు. మొత్తం రూ.201.19కోట్లు పెట్టుబడి సాయం అందనుంది. ఉదయం నుంచి రైతుబంధు డబ్బులు రైతుల బ్యాంకు ఖాతాలో జమ అవుతున్నాయి. గతేడాది యాసంగిలో 1,78,362 మంది రైతులకు రూ.189.90 కోట్ల పంట పెట్టుబడి అందించారు. మొదటిరోజు ఎకరంలోపు భూమి ఉన్నవారికి జమచేశారు. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా వర్షాలు పడడంతో రైతులు వ్యవసాయ పనుల్లో నిమగ్నమయ్యారు. దీంతో ప్రభుత్వం ఇచ్చే పంట పెట్టుబడి డబ్బులు వస్తుండడంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
రైతుల బ్యాంకు ఖాతాలో డబ్బులు..
-ఛత్రూనాయక్, జిల్లా వ్యవసాయశాఖ అధికారి
జిల్లాలో 1,84,485 మంది రైతులున్నారు. మొదటి రోజు ఎకరంలోపు ఉన్న రైతులందరికీ మంగళవారం వారి ఖాతాల్లో జమయ్యాయి. వారం రోజుల్లో జిల్లా వ్యాప్తంగా ఉన్న రైతులకు రైతుబంధు డబ్బులు వారి ఖాతాలో జమకానున్నాయి. ఈ ఏడాది కొత్తగా 6,123 మంది రైతులు దరఖాస్తు చేసుకున్నారు. ధరణిలో చేరిన రైతులకు డబ్బులు జమకానున్నాయి.
సకాలంలో పెట్టుబడి సాయం అందింది
వానకాలం పంట సాగు సమయంలో సకాలంలో రైతుబంధు పథకం కింద పంట పెట్టుబడి డబ్బులు చేతికి అందుతున్నాయి. సీఎం కేసీఆర్ తోడ్పాటుతో పంట పెట్టుబడులు అందడం సంతోషంగా ఉంది. నా కు ఉన్న ఎకరం పొలంలో పంట సాగుకు రూ.5వేల నగదు బ్యాంకు ఖాతాలో జమ అయ్యాయి. ఇప్పటికే దుక్కులు సిద్ధం చేసుకోగా, ఈ డబ్బులతో విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేస్తాం. -అజ్మీరా రెడ్డి, రైతు, మరిపెడ
వ్యవసాయానికి పూర్వవైభవం
రాష్ట్రంలో వ్యవసాయం పండుగలా సా గుతున్నది. దేశంలో ఎ క్కడా లేనివిధంగా రైతులకు పెట్టుబడి సాయం అందిస్తూ రైతన్నల పాలిట సీఎం కేసీఆర్ దేవుడిగా నిలిచారు. నాకున్న 20 గుంటల పొలంలో వరి సాగు చేస్తున్నాను. ఈ రోజే నా ఖాతాలో రూ.2500 రైతుబంధు డబులు జమ అయ్యాయి. కేసీఆర్ సాయం మర్చిపోలేను.
-ప్రతాపని శివయ్య, చిన్నగూడూరు
సీఎం కేసీఆర్కు రుణపడి ఉంటాం
రైతుబంధు పథకంతో పెట్టుబడి సాయం అందిస్తున్న సీఎం కేసీఆర్కు రైతులమం తా రుణపడి ఉంటాం. గతం లో సాగు పనులు మొదలు పెట్టాలంటే పెట్టుబడి కోసం తిరిగేటోళ్లం. ఇప్పుడు ఆ రోజులు పోయాయి. నాకు గుండంరాజుపల్లి శివారులో ఎకరం పొలం ఉన్నది. రైతుబంధు డబ్బులు రూ.5వేలు మినీబ్యాంకు నుంచి తీసుకున్న.
-డీ రెడ్యా, గుండరాజుపల్లి, చిన్నగూడూరు
అదునుకు సాయం అందింది..
నాకు 20 గుంటల భూమి ఉన్నది. రైతుబంధు పథకం కింద పెట్టుబడి డబ్బులు రూ.2500 ఏటా బ్యాంకు ఖాతాలో జమ అవుతున్నాయి. గతంలో కరంట్ లేక, నీళ్లు రాక తీవ్ర ఇబ్బందులు పడ్డాం. స్వరాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వంలో సాగుకు నీళ్లు వచ్చాయి. పంట పెట్టుబడికి సాయం వచ్చింది. ఏటా నాకు రూ. 5వేలు వస్తున్నాయి. పొలం నాటు వేసేందుకు పైసలు సరిపోతున్నాయి.
– దూరు శ్రీమతి, నర్సింహులపేట